Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 8th Lesson ప్రజాస్వామ్యం Textbook Questions and Answers.
TS Inter 1st Year Political Science Study Material 8th Lesson ప్రజాస్వామ్యం
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
ప్రజాస్వామ్యాన్ని నిర్వచించి దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
నిర్వచనాలు :
- అబ్రహాం లింకన్ : “ప్రజలచేత, ప్రజలకొరకు, ప్రజలే నిర్వహించుకొనే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం”.
- లార్డ్ బ్రైస్ : “ఏ సమాజంలో ప్రభుత్వాధికారం చట్టరీత్యా ఏదో ఒక వర్గం లేదా వర్గాల చేతుల్లోగాక మొత్తం సభ్యులకు చెందుతుందో అదే ప్రజాస్వామ్యమవుతుంది”.
ప్రజాస్వామ్యం – లక్షణాలు :
1. స్వేచ్ఛ :
ప్రజాస్వామ్యం స్వేచ్ఛ, సమానత్వం అనే పునాదులపైనే ఆధారపడి ఉంది. ప్రజాస్వామ్య ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రజలకు సాధ్యమైనంత ఎక్కువ స్వేచ్ఛను అందించడమే. ప్రజలకు రాజ్యాంగపరమైన స్వేచ్ఛను అందించడంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఒక్కటే హామీ ఇవ్వగలదు అని చెప్పవచ్చు.
2. సమానత్వం :
ప్రొ. సీలీ అభిప్రాయంలో ప్రజాస్వామ్యం అనేది “ప్రతీ ఒక్కరికీ భాగస్వామ్యం ఉండే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం” అంటాడు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతీ ఒక్కరికీ రాజకీయ వ్యవహారాలలో పాల్గొనే అవకాశం వస్తుంది. ఈ విధానంలో ప్రతి పౌరుడికి ఓటు వేసే హక్కు, ఎన్నికలలో పోటీ చేసే హక్కు ఉంటుంది.
3. స్వతంత్ర న్యాయశాఖ:
ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కచ్చితంగా న్యాయశాఖ స్వతంత్రంగా పని చేస్తుంది.
4. పౌరప్రభుత్వం :
ప్రజలచేత ఓటు హక్కు ద్వారా స్వచ్ఛందంగా ఎవరి ప్రలోభానికి లొంగకుండా ఎన్నుకునే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. “ప్రజాస్వామ్యం బాలెట్ ప్రభుత్వమేగానీ బుల్లెట్ ప్రభుత్వం కాదు”.
5. అధిక సంఖ్యాకుల పాలన :
ప్రజాస్వామ్యం అధిక సంఖ్యాకుల మద్దతుతో అల్పసంఖ్యాకులకు రక్షణ కల్పించే ప్రభుత్వం. ప్రతీ ప్రజాస్వామ్య దేశంలో ఏ పార్టీకైతే మెజారిటీ శాసనసభ సీట్లు దక్కుతాయో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది. అంటే ప్రజాస్వామ్యం “అధిక సంఖ్యాకుల మద్దతు ప్రభుత్వం” అని చెప్పవచ్చు.
6. రాజ్యాంగ నిబంధనల అమలు :
ప్రజాస్వామ్యం కచ్చితంగా రాజ్యాంగ నిబంధనలపైనే పని చేస్తుంది. అది లిఖిత పూర్వక రాజ్యాంగం కావచ్చు లేదా అలిఖితరాజ్యాంగం కావచ్చు.
7. సామ్రాజ్యవాదానికి, యుద్ధానికి వ్యతిరేకం:
ప్రజాస్వామ్యం, అంతర్జాతీయశాంతి, సమానత్వం, న్యాయం, సహకారం అనే అంశాలకు విలువిస్తుంది. ప్రజాస్వామ్యం తీవ్ర జాతీయ వాదానికి, సామ్రాజ్యవాదానికి, యుద్ధానికి వ్యతిరేకం.
8. బలప్రయోగాలకు అవకాశం లేదు :
ప్రజాస్వామ్యంలో బలప్రయోగానికి అవకాశం లేదు. ప్రజాసంక్షేమం పేరిట కూడా బలవంతపు విధానాలు, చట్టాలు ప్రజలపై రుద్దడానికి ప్రజాస్వామ్యంలో అవకాశం లేదు.
9. మానవ హక్కులకు ప్రాధాన్యత :
ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వ్యక్తుల ఔన్నత్యానికి మానవహక్కులకు, ప్రాధాన్యత లభిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే రాజ్యాంగపరంగా హక్కులు కల్పించడం ప్రజాస్వామ్య ప్రాథమిక బాధ్యతగా చెప్పవచ్చు.
10. వాక్ స్వాతంత్ర్యం (భావప్రకటన స్వేచ్ఛ) :
ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెలిబుచ్చే హక్కు ఉంది. తమ భావాలను వ్యక్తం చేయడంలో ఎవరి బలప్రయోగం ఉండదు.
11. ఆదర్శాలకు, సిద్ధాంతాలకు ప్రోత్సాహం :
ప్రజాస్వామ్యంలో విభిన్న ఆదర్శాలకు, భావాలకు, సిద్ధాంతాలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. శాసనసభల్లో కూడా అనేక అంశాలపై నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది.
12. హింసకు, విప్లవాలకు వ్యతిరేకం :
ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం రాజ్యాంగ ప్రక్రియ ద్వారా మాత్రమే జరుగుతుంది తప్ప హింస ద్వారా, విప్లవాల ద్వారా అవకాశం లేదు.
ప్రశ్న 2.
ప్రజాస్వామ్య రకాలను వివరించండి.
జవాబు.
ప్రజాస్వామ్యాన్ని ముఖ్యంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి:
- ప్రత్యక్ష ప్రజాస్వామ్యం
- పరోక్ష ప్రజాస్వామ్యం.
1. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం :
ఏ ప్రభుత్వంలోనైతే ప్రజలు ప్రత్యక్షంగా ప్రభుత్వ వ్యవహారాలలో పాల్గొంటారో ఆ ప్రభుత్వమే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో పౌరులు ప్రభుత్వ విధానాలను, శాసనాలను ప్రభుత్వ కార్యక్రమాలను రూపొందించడంలో ముందుంటారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజాభీష్టం ప్రత్యక్షంగా వ్యక్తీకరించ బడుతుంది. కాని వారు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా కాదు.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు:
- ప్రజాభిప్రాయసేకరణ
- ప్రజాభిప్రాయ నివేదన
- పునరాయనం
- ప్రజానిర్ణయం.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు ప్రస్తుతం స్విట్జర్లాండ్లోను, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో అమలులో ఉంది. స్విట్జర్లాండ్లోని కొన్ని చిన్న కాంటన్స్ (స్థానిక ప్రాంతాలు)లలో ఏప్రిల్ లేదా మే నెలలోని ఏదైనా ఒక ఆదివారం రోజు సమావేశమై వారికి అవసరమైన ప్రతినిధులను ఎన్నుకొని పనులు చేయించుకుంటారు.
2. పరోక్ష ప్రజాస్వామ్యం :
పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ విధమైన ప్రజాస్వామ్యంలో తక్షణ సార్వభౌమాధికారానికి, అంతిమ సార్వభౌమాధికారానికి చాలా స్పష్టమైన తేడా ఉంటుంది.
ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన శాసనసభ రాజ్య ఆశయాలను రూపొందిస్తుంది. కాబట్టి శాసనసభ అనేది తక్షణ సార్వభౌమాధికారిగా చెప్పవచ్చు. కాబట్టి అంతిమ సార్వభౌమాధికార ప్రభుత్వంలో ప్రజలు తమ ప్రతినిధులను ప్రత్యేక కాలపరిమితికి ప్రతినిధులను ఎన్నుకుంటారు.
ఆ కాల పరిమితికి వారు ఎన్నుకున్న ప్రతినిధుల కార్యకలాపాలను సమీక్ష చేస్తారు. ఒకవేళ ఈ కాలపరిమితిలో వీరితో సంతృప్తి చెందకపోతే వచ్చే ఎన్నికల్లో వీరిని ఎన్నుకోరు. ఎన్నికల్లో తిరస్కరిస్తారు. ప్రాతినిధ్య ప్రభుత్వం ప్రజాసార్వభౌమాధికారంచేత సమర్థవంతంగా నడుస్తుంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ప్రజాభిప్రాయాన్ని నెరవేర్చడంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తుంది. ఈ ప్రాతినిధ్య ప్రభుత్వంలో అధికారం ప్రజలదే.
ప్రశ్న 3.
ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ? ప్రజాస్వామ్య ప్రయోజనాలు, లోపాలు వివరించండి.
జవాబు.
అర్థం :
Democracy అనే ఇంగ్లీషు పదం Demos మరియు Kratos అనే రెండు గ్రీకు పదాల కలయిక నుంచి ఆవిర్భవించింది. డెమోస్ అంటే ప్రజలు క్రటోస్ అంటే అధికారం లేదా ‘పాలన’ అని అర్థం.
నిర్వచనం :
ప్రజాస్వామ్యమంటే “ప్రజలచేత, ప్రజల కొరకు, ప్రజలే నిర్వహించుకొనే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం”. – అబ్రహాం లింకన్
ప్రజాస్వామ్య ప్రయోజనాలు :
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో దాదాపు ప్రతి దేశం ప్రజాస్వామ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఎంచుకుంటున్నాయి. ప్రజాస్వామ్య ప్రయోజనాలను క్రింద వివరించడమైంది. అవి :
1. సమర్థవంతమైన ప్రభుత్వం (Efficient form of Government) :
ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ప్రజల అభీష్టం మేరకు పరిపాలన నిర్వహిస్తారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఎప్పుడూ బాధ్యత వహిస్తూ అనుభవజ్ఞులైన, సమర్థులైన నాయకులను సంప్రదిస్తూ వారి సలహాలు సూచనలతో ప్రజలకు సంబంధించిన శాసనాలను రూపొందిస్తారు. శాసనాల రూపకల్పనలో, వ్యయపరిమితులు, ఆర్థికపర సూత్రాలను పాటిస్తారు.
ప్రజాస్వామ్యంలో అనుభవజ్ఞులైన అధికారులు, ఇతర కార్యనిర్వాహక అధికారులు వారి ప్రతిభ మీద, సమర్థత మీద, అనుభవం మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారు. వీరి అనుభవాన్ని, వీరి తెలివితేటలను, సమర్థతను ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు.
2. వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ (Upholds Individual Liberties) :
ఒక్క ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఉంటుందని చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో నివసించే ప్రజలు మాత్రమే నిజంగా స్వేచ్ఛను అనుభవిస్తారు. ప్రజల హక్కులు, స్వాతంత్య్రం, స్వేచ్ఛ అన్నీ కూడా లిఖిత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంటాయి.
3. సమానత్వానికి ప్రాధాన్యత (Importance to Equality) :
ప్రజాస్వామ్యం సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజాస్వామ్యం ప్రజలందరికీ రాజకీయ ఆర్థిక, సామాజిక స్వేచ్ఛను, హక్కులను అందిస్తుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటరానితనం కట్టుబానిసత్వం, వెట్టిచాకిరి, మతం, భాష, ప్రాంతం, పుట్టుక పేరు మీద విచక్షణ చూపడాన్ని వ్యతిరేకిస్తుంది.
4. రాజకీయ చైతన్యం (Political Awareness) :
నిజానికి ప్రజాస్వామ్యం ప్రజలకు రాజకీయ చైతన్యవేదిక అని చెప్పవచ్చు. ఎన్నికల ప్రచారం ప్రజలకు చైతన్యాన్ని అందిస్తుంది. ఎన్నికల సమయంలో ప్రచారం ద్వారా, పత్రికల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తారు.
5. దేశభక్తిని పెంపొందిస్తుంది (Promotes Patriotism) :
ప్రజాస్వామ్యం ప్రజల మధ్య దేశభక్తిని పెంపొందిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు తరచు ఎన్నికల్లో పాల్గొని ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడాన్ని బాధ్యతగా భావిస్తారు.” రాజకీయ ప్రతినిధులు తమ విధులను నిర్వహించడంలో ప్రజలు తమవంతు సహకారం అందిస్తారు.
చాలా సందర్భాల్లో ప్రజలు దేశం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు తమవంతు బాధ్యతను నిర్వహిస్తూ సంయమనం పాటించారు. ఉదాహరణకు భారతదేశంతో చైనా, పాకిస్తాన్ యుద్ధ సమయంలో ప్రజలు నిర్వహించిన పాత్ర శ్లాఘనీయం.
6. పౌరసత్వ శిక్షణ (School of Citizenship) :
ప్రజాస్వామ్య ప్రభుత్వపు మరొక ప్రయోజనం ఏమిటంటే, ప్రజలకు పౌరసత్వ శిక్షణ ఇస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటు వేసే హక్కు, పోటీ చేసే హక్కు, ప్రభుత్వాన్ని సద్విమర్శ చేసే హక్కు, ఇంకా ఇతర రాజకీయ హక్కులను పౌరులుగా వినియోగించుకుంటారు.
7. నైతిక విలువలకు ప్రాధాన్యత (Inculcates Moral Values) :
ప్రజాస్వామ్యంలో ప్రజలకు నైతిక విలువలు అలవడుతాయి.’ ప్రజాస్వామ్యం ప్రజలకు సహకారాలను, బాధ్యతను, సహనాన్ని, త్యాగాన్ని బోధిస్తుంది. లోవెల్ అభిప్రాయంలో “భవిష్యత్తు కాలంలో ప్రజలకు దృఢమైన మానసిక స్థైర్యాన్ని, సమైక్యతను, ఆత్మాభిమానాన్ని అందించే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రమే”.
8. ప్రజాస్వామ్యం ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తుంది (Democracy gives Preference to Public Opinion) :
వాస్తవంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి నిజమైన ప్రతినిధి. బర్నార్డ్ ప్రకారం “ప్రజాస్వామ్యం ప్రజలందరి మధ్య సంబంధాన్ని కలుపుతూ కాపాడుతుంది”.
9. విప్లవాన్ని నివారిస్తుంది (Reduces the Danger of Revolution) :
ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ తమ అభిప్రాయాలను విన్నవించుకొనే, పంచుకొనే అవకాశం ఉంది. కాబట్టి విప్లవం అనే ప్రసక్తే రాదు. ఒకవేళ ప్రభుత్వాన్ని మార్చాల్సివస్తే ఓటు ద్వారా మాత్రమే మారుస్తారు.
10. ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తుంది (Symbol of Progress and Welfare Programmes) :
ప్రజాసంక్షేమాన్ని సాధించడంలో ప్రజాస్వామ్యాన్ని మాత్రమే నిజమైన ప్రభుత్వంగా చెప్పవచ్చు. ప్రజాసంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం.
11. ప్రపంచ శాంతికి మద్దతు (Support to World Peace) :
ప్రజాస్వామ్యం ప్రపంచ శాంతికి మద్దతు ఇస్తుంది. హింసకు వ్యతిరేకి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో మార్పు రావాలంటే రాజ్యాంగపర ప్రక్రియద్వారా, శాంతి, సహకార పూర్వకమైన పద్ధతుల ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది. బర్నార్డ్ ప్రకారం : “ప్రజాస్వామ్య ఉద్యమాలన్ని శాంతికోసం జరిగినవే”.
ప్రజాస్వామ్య ప్రభుత్వం – లోపాలు :
1. వ్యయంతో కూడుకున్న ప్రభుత్వం :
ప్రజాస్వామ్య ప్రభుత్వం చాలా ఖర్చుతో కూడుకున్న ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంపై చాలా ధనం వెచ్చిస్తారు. శాసనసభలను నడపడానికి, కేంద్ర, రాష్ట్ర శాసనసభ సమావేశాల కోసం చాలా ఖర్చు చేయవలసి వస్తుంది. ఇటలీకి చెందిన పార్లమెంటు వట్టి “మాటల దుకాణం”. నియంత ముస్సోలిని మాటల్లో చెప్పాలంటే “కార్లే” మాటల్లో చెప్పాలంటే ప్రజాస్వామ్యం పేదదేశాలకు పనికిరాదు.
2. బలహీనమైన అస్థిర ప్రభుత్వం :
ప్రజాస్వామ్యం ఆచరణలో బలహీనమైన అస్థిర ప్రభుత్వం అని చెప్పవచ్చు. ఏ దేశంలోనైతే బహుళపార్టీ వ్యవస్థ ఉంటుందో అక్కడ ప్రభుత్వాలు తరచుగా మారుతుంటాయి.
ఉదా : భారతదేశంలో 1977 నుంచి 1979, 1989 నుంచి 1991, 1996 నుంచి 1999 వరకు సంకీర్ణ ప్రభుత్వాల వల్ల స్థిరమైన ప్రభుత్వాలు నడపడంలో విఫలమయ్యాయి.
3. అల్పసంఖ్యాక ప్రభుత్వం :
వాస్తవంగా గమనిస్తే ప్రజాస్వామ్య ప్రభుత్వం అధిక సంఖ్యాకుల అభిప్రాయాన్ని ప్రతిబింబించదు. ప్రజాస్వామ్యమంటే అత్యధిక సంఖ్యాకుల మద్దతుగల ప్రభుత్వం అని అంటారు. కాని వాస్తవంగా అదికాదు. చాలా దేశాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు వారి ఓటుహక్కును వినియోగించుకోరు. చాలా దేశాల్లో ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే ఎన్నికవుతారు.
ఓట్ల శాతంతో సంబంధం లేదు. అంతే కాకుండా తిరస్కరించిన వారి సంఖ్యతో కూడా సంబంధం లేదు. ఈ లెక్క ప్రకారం అధికారంలోకి వచ్చిన పార్టీకి వచ్చిన ఓట్లు వ్యతిరేకించిన వారి కంటే తక్కువ ఉంటాయి. కాబట్టి ప్రజాస్వామ్యం అధిక సంఖ్యాకుల ప్రభుత్వం అనడం వాస్తవం కాదు.
4. సంస్కృతికి, నాగరికతకు, మేధావుల విజ్ఞానానికి నిరోధకం:
ప్రజాస్వామ్యం మందిస్వామ్యంగా పేరుపడి సంప్రదాయకంగా పని చేస్తుంది. కళలు, సంస్కృతి, నాగరికతలలో సాధారణంగా శ్రద్ధ చూపరు. ప్రజాస్వామ్యంలో మేధావులు సాధారణంగా ఎన్నికలకు దూరంగా ఉంటారు. ప్రజాస్వామ్య ఎన్నికలలో ఓడిపోయిన మేధావులు ఎందరో ఉన్నారు.
5. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం :
ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం ప్రమాదకరం. త్వరిత నిర్ణయాలు సాధ్యం కాదు. తద్వారా జరగవలసిన పనులు జాప్యంగా జరుగుతాయి. శాసనసభా వ్యవహారాలు, రాజకీయపార్టీలు, ప్రతిపక్షపార్టీలు, సంకీర్ణ ప్రభుత్వాలు మొదలైన విధాన్నాలు నిర్ణయంతో జోక్యం చేసుకోవడం వల్ల కూడా నిర్ణయాలు ఆలస్యం కావచ్చు.
ప్రశ్న 4.
ప్రజాస్వామ్య విజయానికి అవసరమైన నిబంధనలను వివరించండి.
జవాబు.
అన్ని ప్రభుత్వాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వం అతిముఖ్యమైనది. కాని అదే సమయంలో క్లిష్టమైన ప్రభుత్వంగా చెప్ప్చ. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే తప్పనిసరిగా కొన్ని అనుకూల పరిస్థితులు ఉండాలి. కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం చాలా విజయవంతమైంది. మరికొన్ని దేశాల్లో అపజయం పొందింది.
1. నిష్పక్షపాతమైన, స్వతంత్ర పత్రికలు :
స్వతంత్ర, నిష్పక్షపాతమైన పత్రికలు అనేవి ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి అతిముఖ్యమైన సాధనాలు. స్వతంత్రమైన పత్రికలు ప్రజాసంబంధమైన జాతీయ సమస్యలపైన స్పందిస్తాయి.
పత్రికలు ప్రభుత్వం రూపొందించిన అనేక విధానాలపైన నిష్పక్షపాతమైన విమర్శను, సహేతుకమైన విమర్శలను చేస్తూ బాధ్యతగా వ్యవహరిస్తాయి. జాతీయ ప్రాముఖ్యమైన అనేక అంశాలపై ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా పత్రికలు పని చేస్తాయి.
ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్ర్య పరిరక్షణలో రక్షణకర్తగా వ్యవహరిస్తాయి. అప్రజాస్వామికమైన, రాజ్యాంగ వ్యతిరేకమైన, ప్రజావ్యతిరేకమైన చర్యలపైన ప్రజలను అప్రమత్తం చేస్తుంది. నిజానికి నిష్పక్షపాతమైన పత్రికలు ఉంటేనే ప్రజాస్వామ్యం విజయం సాధ్యమౌతుంది.
2. లిఖితరాజ్యాంగం :
ప్రజాస్వామ్య విజయానికి లిఖితరాజ్యాంగం కూడా అతిముఖ్యమైన సాధనం. ఎందుకంటే లిఖిత రాజ్యాంగం పౌరులకు రాజకీయ హక్కుల గురించి, విధుల గురించి అవగాహన, నమ్మకాన్ని కలిగిస్తుంది.
3. ప్రజాస్వామ్యంపై కోరిక :
ప్రజలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే కోరిక, ఇష్టం, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను కాపాడుకోవాలనే కోరిక ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి తోడ్పడతాయి.
4. నిర్దంతర అప్రమత్తత (జాగరూకత) :
ప్రజల నిరంతర అప్రమత్తతనే ప్రజాస్వామ్య విజయానికి ముఖ్యమైన సాధనం. ప్రజలు, ప్రభుత్వ రాజకీయ కార్యకలాపాలను, రాజకీయ నాయకుల చర్యలను నిశ్శబ్దంగా గమనిస్తూ అప్రమత్తతతో వ్యవహరించాలి. కాబట్టి ప్రజాస్వామ్య విజయంలో ప్రజల నిరంతర అప్రమత్తతను (జాగరూకతను) మించింది ఏదీ లేదు. ప్రజలు వారి హక్కులను, విధులను కాపాడుకోవడంలో మేల్కొని ఉండాలి.
5. స్వతంత్ర న్యాయశాఖ:
నిష్పక్షపాతమైన, నిజాయితీతో కూడిన, భయాందోళనలకు అతీతమైన స్వతంత్ర న్యాయశాఖ ప్రజాస్వామ్య విజయానికి అతిముఖ్యమైంది. స్వతంత్ర న్యాయశాఖ ప్రజలకు ధైర్యాన్ని, నమ్మకాన్ని న్యాయం అందించడంలో హామీ ఇస్తుంది.
6. బలమైన ప్రతిపక్షం :
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షం అవసరం. ప్రతిపక్షం ప్రభుత్వం చేసే పనులకు నిరంతర చెక్ పెడుతూ అప్రమత్తం చేస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలైన ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలో ప్రతిపక్షాలు చాలా సమర్థంగా పని చేస్తాయి. భారతదేశంలో కూడా ప్రతిపక్షపార్టీలు చాలాసార్లు విజయవంతమైన గొప్ప పాత్ర వహించాయి.
7. క్రమం తప్పకుండా జరిగే ఎన్నికలు :
క్రమం తప్పకుండా జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పెంచుతాయి. ఎన్నికలు అధికారంలో ఉన్న పార్టీ పని తీరుపై తీర్పుగా వ్యవహరిస్తాయి. స్వతంత్ర, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛావాతావరణంలో జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్య విజయానికి సహకరిస్తాయి.
8. స్థానిక ప్రభుత్వాల చురుకైన పాత్ర :
ప్రజాస్వామ్యంలో స్థానిక ప్రభుత్వాలు చురుకైన పాత్ర వహిస్తాయి. స్థానిక ప్రభుత్వాలు ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని, రాజకీయ భాగస్వామ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే కచ్చితంగా స్థానిక ప్రభుత్వాలను ప్రోత్సహించాలి. జె. ఎస్. మిల్ ప్రజాస్వామ్యంలో స్థానిక ప్రభుత్వాలపై ప్రేమ ఉండడం మొట్టమొదటి నిబంధనగా పేర్కొంటాడు.
9. అధికారం వికేంద్రీకరణ :
ప్రజాస్వామ్య విజయానికి అధికార వికేంద్రీకరణ తప్పనిసరి. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు అధికారాలను పంచుకొని పరిపాలిస్తాయి. కాబట్టి ప్రజాస్వామ్యంలో అధికార కేంద్రీకరణకు, నియంతృత్వ ప్రభుత్వం ఏర్పడడానికి అసలు అవకాశం లేదు.
10. రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం :
ప్రజాస్వామ్య విజయానికి రాజకీయ స్వేచ్ఛ, ఆర్థిక సమానత్వం, సాంఘిక న్యాయం తప్పనిసరి.
11. మెరుగైన విద్యావ్యవస్థ :
ప్రజాస్వామ్య విజయంలో విద్యావ్యవస్థ చాలా ప్రభావాన్ని చూపుతుంది. నిరక్షరాస్యత, పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రధాన అడ్డంకి. విద్య మేధావులను అందిస్తుంది. అనేక అంశాలు అర్థం చేసుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తుంది. ఓటు వేసే హక్కును వినియోగించుకొనేలా చేయడంలో విద్య పౌరులను చైతన్య పరుస్తుంది.
12. ప్రజాస్వామ్యం పై నమ్మకం :
ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం ఉండాలి. ప్రజల మధ్య వ్యక్తిగత సామర్థ్యానికి, ప్రజల మధ్య పరస్పర సహకారానికి చర్చల ద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజల మధ్య సహకార పూర్వక స్ఫూర్తి, రాజీపడే ధోరణి, ఎదుటి వారి అభిప్రాయాలకు కూడా విలువిచ్చే వ్యవస్థ ఉంటే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
ప్రజాస్వామ్యాన్ని నిర్వచించి ప్రయోజనాలు పేర్కొనండి.
జవాబు.
నిర్వచనం :
“ప్రజాస్వామ్యమంటే ప్రజలచేత, ప్రజల కొరకు ప్రజలే నిర్వహించుకొనే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం” – అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్య ప్రయోజనాలు : ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో దాదాపు ప్రతి దేశం ప్రజాస్వామ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఎంచుకుంటున్నాయి. ప్రజాస్వామ్య ప్రయోజనాలను క్రింద వివరించడమైంది. అవి :
1. సమర్థవంతమైన ప్రభుత్వం (Efficient form of Government) :
ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ప్రజల అభీష్టం మేరకు పరిపాలన నిర్వహిస్తారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఎప్పుడూ బాధ్యత వహిస్తూ అనుభవజ్ఞులైన, సమర్థులైన నాయకులను సంప్రదిస్తూ వారి సలహాలు సూచనలతో ప్రజలకు సంబంధించిన శాసనాలను రూపొందిస్తారు. శాసనాల రూపకల్పనలో వ్యయపరిమితులు, ఆర్థికపర సూత్రాలను పాటిస్తారు.
ప్రజాస్వామ్యంలో అనుభవజ్ఞులైన అధికారులు, ఇతర కార్యనిర్వాహక అధికారులు వారి ప్రతిభ మీద, సమర్థత మీద, అనుభవం మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారు. వీరి అనుభవాన్ని, ‘వీరి తెలివితేటలను, సమర్థతను ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు.
2. వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ (Upholds Individual Liberties) :
ఒక్క ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఉంటుందని చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో నివసించే ప్రజలు మాత్రమే నిజంగా స్వేచ్ఛను అనుభవిస్తారు. ప్రజల హక్కులు, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ అన్నీ కూడా లిఖిత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంటాయి.
3. సమానత్వానికి ప్రాధాన్యత (Importance to Equality) :
ప్రజాస్వామ్యం సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజాస్వామ్యం ప్రజలందరికీ రాజకీయ ఆర్థిక, సామాజిక స్వేచ్ఛను, హక్కులను అందిస్తుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటరానితనం కట్టుబానిసత్వం, వెట్టిచాకిరి, మతం, భాష, ప్రాంతం, పుట్టుక పేరు మీద విచక్షణ చూపడాన్ని వ్యతిరేకిస్తుంది.
4. రాజకీయ చైతన్యం (Political Awareness) :
నిజానికి ప్రజాస్వామ్యం ప్రజలకు రాజకీయ చైతన్యవేదిక అని చెప్పవచ్చు. ఎన్నికల ప్రచారం ప్రజలకు చైతన్యాన్ని అందిస్తుంది. ఎన్నికల సమయంలో ప్రచారం ద్వారా, పత్రికల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తారు.
5. దేశభక్తిని పెంపొందిస్తుంది (Promotes Patriotism) :
ప్రజాస్వామ్యం ప్రజల మధ్య దేశభక్తిని పెంపొందిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు తరచు ఎన్నికల్లో పాల్గొని ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడాన్ని బాధ్యతగా భావిస్తారు. రాజకీయ ప్రతినిధులు తమ విధులను నిర్వహించడంలో ప్రజలు తమవంతు సహకారం అందిస్తారు.
చాలా సందర్భాల్లో ప్రజలు దేశం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు తమవంతు బాధ్యతను నిర్వహిస్తూ సంయమనం పాటించారు. ఉదాహరణకు భారతదేశంతో చైనా, పాకిస్తాన్ యుద్ధ సమయంలో ప్రజలు నిర్వహించిన పాత్ర శ్లాఘనీయం.
6. పౌరసత్వ శిక్షణ (School of Citizenship) :
ప్రజాస్వామ్య ప్రభుత్వపు మరొక ప్రయోజనం ఏమిటంటే, ప్రజల పౌరసత్వ శిక్షణ ఇస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటు వేసే హక్కు, పోటీ చేసే హక్కు, ప్రభుత్వాన్ని సద్విమర్శ చేసే హక్కు, ఎకా ఇతర రాజకీయ హక్కులను పౌరులుగా వినియోగించుకుంటారు.
7. నైతిక విలువలకు ప్రాధాన్యత (Inculcates Moral Values) :
ప్రజాస్వామ్యంలో ప్రజలకు నైతిక విలువలు అలవడుతాయి. ప్రజాస్వామ్యం ప్రజలకు సహకారాలను, బాధ్యతను, సహనాన్ని, త్యాగాన్ని బోధిస్తుంది. లోవెల్ అభిప్రాయంలో “భవిష్యత్తు కాలంలో ప్రజలకు దృఢమైన మానసిక స్థైర్యాన్ని, సమైక్యతను, ఆత్మాభిమానాన్ని అందించే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రమే”.
8. ప్రజాస్వామ్యం ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తుంది (Democracy gives Preference to Public Opinion) :
వాస్తవంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి నిజమైన ప్రతినిధి. బర్నార్డ్ ప్రకారం “ప్రజాస్వామ్యం ప్రజలందరి మధ్య సంబంధాన్ని కలుపుతూ కాపాడుతుంది”.
9. విప్లవాన్ని నివారిస్తుంది (Reduces the Danger of Revolution) :
ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ తమ అభిప్రాయాలను విన్నవించుకొనే, పంచుకొనే అవకాశం ఉంది. కాబట్టి విప్లవం అనే ప్రసక్తే రాదు. ఒకవేళ ప్రభుత్వాన్ని మార్చాల్సివస్తే ఓటు ద్వారా మాత్రమే మారుస్తారు.
10. ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తుంది (Symbol of Progress and Welfare Programmes) :
ప్రజాసంక్షేమాన్ని సాధించడంలో ప్రజాస్వామ్యాన్ని మాత్రమే నిజమైన ప్రభుత్వంగా చెప్పవచ్చు. ప్రజాసంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం.
11. ప్రపంచ శాంతికి మద్దతు (Support to World peace) :
ప్రజాస్వామ్యం ప్రపంచ శాంతికి మద్దతు ఇస్తుంది. హింసకు వ్యతిరేకి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో మార్పు రావాలంటే రాజ్యాంగపర ప్రక్రియద్వారా, శాంతి, సహకార పూర్వకమైన పద్ధతుల ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది. బర్నార్డో ప్రకారం : “ప్రజాస్వామ్య ఉద్యమాలన్ని శాంతికోసం జరిగినవే”.
ప్రశ్న 2.
ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ? దోషాలు వివరించండి.
జవాబు.
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్రజాస్వామ్య ఏర్పాటు అనేది ప్రజలకు ప్రభుత్వాలకు తప్పనిసరి లక్ష్యంగా మారింది. ప్రపంచ దేశాలలో ప్రజాసంక్షేమాన్ని సాధించడానికి అత్యున్నతమైన సాధనంగా ప్రజాస్వామ్యాన్ని భావిస్తున్నారు.
అర్థం : గ్రీక్ భాషా పదాలైన “డెమోస్” “క్రెటియా” అనే పదాల కలయికగా ఆంగ్లభాషలో ‘డెమోక్రసీ’ అనే పదం పుట్టింది. డెమోస్ అంటే ప్రజలు క్రెటియా అంటే అధికారం అని అర్థం.
నిర్వచనం : “ప్రజాస్వామ్యమంటే ప్రజలచేత, ప్రజల కొరకు ప్రజలే నిర్వహించుకొనే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం”. – అబ్రహం లింకన్.
ప్రజాస్వామ్య దోషాలు :
1. వ్యయంతో కూడుకున్న ప్రభుత్వం :
ప్రజాస్వామ్య ప్రభుత్వం చాలా ఖర్చుతో కూడుకున్న ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంపై చాలా ధనం వెచ్చిస్తారు. శాసనసభలను నడపడానికి, కేంద్ర, రాష్ట్ర శాసనసభ సమావేశాల కోసం చాలా ఖర్చు చేయవలసి వస్తుంది. ఇటలీకి చెందిన పార్లమెంటు వట్టి “మాటల దుకాణం”: నియంత ముస్సోలిని మాటల్లో చెప్పాలంటే. “కార్లే” మాటల్లో చెప్పాలంటే ప్రజాస్వామ్యం పేదదేశాలకు పనికిరాదు.
2. బలహీనమైన అస్థిర ప్రభుత్వం :
ప్రజాస్వామ్యం ఆచరణలో బలహీనమైన అస్థిర ప్రభుత్వం అని చెప్పవచ్చు. ఏ దేశంలోనైతే బహుళపార్టీ వ్యవస్థ ఉంటుందో అక్కడ ప్రభుత్వాలు తరచుగా మారుతుంటాయి.
ఉదా : భారతదేశంలో 1977 నుంచి 1979, 1989 నుంచి 1991, 1996 నుంచి 1999 వరకు సంకీర్ణ ప్రభుత్వాల వల్ల స్థిరమైన ప్రభుత్వాలు నడపడంలో విఫలమయ్యాయి.
3. అల్పసంఖ్యాక ప్రభుత్వం:
వాస్తవంగా గమనిస్తే ప్రజాస్వామ్య ప్రభుత్వం అధిక సంఖ్యాకుల అభిప్రాయాన్ని ప్రతిబింబించదు. ప్రజాస్వామ్యమంటే అత్యధిక సంఖ్యాకుల మద్దతుగల ప్రభుత్వం అని అంటారు. కాని వాస్తవంగా అదికాదు. చాలా దేశాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు వారి ఓటుహక్కును వినియోగించుకోరు. చాలా దేశాల్లో ఎన్నికల్లో, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే ఎన్నికవుతారు.
ఓట్ల శాతంతో సంబంధం లేదు. అంతే కాకుండా తిరస్కరించిన వారి సంఖ్యతో కూడా సంబంధం లేదు. ఈ లెక్క ప్రకారం అధికారంలోకి వచ్చిన పార్టీకి వచ్చిన ఓట్లు వ్యతిరేకించిన వారి కంటే తక్కువ ఉంటాయి. కాబట్టి ప్రజాస్వామ్యం అధిక సంఖ్యాకుల ప్రభుత్వం అనడం వాస్తవం కాదు.
4. సంస్కృతికి, నాగరికతకు, మేధావుల విజ్ఞానానికి నిరోధకం :
ప్రజాస్వామ్యం మందిస్వామ్యంగా పేరుపడి సంప్రదాయకంగా పని చేస్తుంది. కళలు, సంస్కృతి, నాగరికతలలో సాధారణంగా శ్రద్ధ చూపరు. ప్రజాస్వామ్యంలో మేధావులు సాధారణంగా ఎన్నికలకు దూరంగా ఉంటారు. ప్రజాస్వామ్య ఎన్నికలలో ఓడిపోయిన మేధావులు ఎందరో ఉన్నారు.
5. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం :
ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం ప్రమాదకరం. త్వరిత నిర్ణయాలు సాధ్యం కాదు. తద్వారా జరగవలసిన పనులు జాప్యంగా జరుగుతాయి. శాసనసభా వ్యవహారాలు, రాజకీయపార్టీలు, ప్రతిపక్షపార్టీలు, సంకీర్ణ ప్రభుత్వాలు మొదలైన విధానాల నిర్ణయంతో జోక్యం చేసుకోవడం వల్ల కూడా నిర్ణయాలు ఆలస్యం కావచ్చు.
ప్రశ్న 3.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ? ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు వివరించండి.
జవాబు.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు :
ప్రభుత్వ విధానాల నిర్ణయాలలో ప్రజలు ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా పాల్గొనే ప్రభుత్వమే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రాచీనకాలంలో గ్రీక్, రోమ్ దేశాలలోని నగర రాజ్యాలలో ఉండేది. ప్రస్తుతం స్విజ్జర్లాండ్లో కొన్ని మార్పులతో అమలులో ఉంది.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలను క్రింది విధంగా చెప్పవచ్చు.
1. ప్రజాభిప్రాయ సేకరణ (Referendum) :
ప్రజాభిప్రాయ సేకరణను ఆంగ్లంలో referendum అని అంటారు. ఇది (refer) రిఫర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. రిఫర్ అంటే “సూచించడం” అని అర్థం. ప్రజాభిప్రాయ సేకరణ అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అతిముఖ్యమైన సాధనంగా చెప్పవచ్చు. ఒక ప్రత్యేక అంశం మీద గాని లేదా జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశం మీద కాని ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని (రూఢి చేసుకుంటుంది) సేకరిస్తుంది.
ఇది రెండు రకాలు.
a) నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ (Compulsory Referendum) :
నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ అంటే కొన్ని రకాల బిల్లుల విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి వారి ఆమోదం పొందితేనే ఆ బిల్లులు శాసనాలు అవుతాయి. ఈ బిల్లులను ఒకవేళ ప్రజలు ఆమోదించకపోతే శాసనాలుగా రూపొంది అమలులోకి రావు. నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ మూలంగా ప్రజలు తమ ప్రయోజనాలకు విరుద్ధమైన శాసనాలను అడ్డుకోగలుగుతారు.
ఇది స్విట్జర్లాండ్లో అన్ని ముఖ్యమైన రాజ్యాంగ సవరణలకు సంబంధించి అమలులో ఉంది. అంతేగాక స్విట్జర్లాండ్లోని కొన్ని కాంటన్స్లలో సాధారణ బిల్లులను కూడా ప్రజాభిప్రాయ సేకరణకు పంపవలసి వస్తుంది. ఆస్ట్రేలియా, ఫ్రాన్సు దేశాలలో కూడా రాజ్యాంగ సవరణకు సంబంధించి నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణకు పంపుతారు.
b) ఐచ్ఛిక ప్రజాభిప్రాయ సేకరణ (Optional Referendum) :
కొన్ని రకాల బిల్లులను ప్రజల కోరిక మీద మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణకు పంపడం జరుగుతుంది. అధిక సంఖ్యాక ప్రజల కోరికమేరకు వారి మద్దతుతో బిల్లులు శాసనాలుగా రూపొంది అమలులోకి వస్తాయి. ముఖ్యంగా స్విట్జర్లాండ్ లో 30 వేల మంది స్విస్ పౌరులు ప్రజాభిప్రాయ సేకరణకు పంపాల్సిందని కోరినట్లైతే ప్రజామోదానికి బిల్లును పంపుతారు. ఐచ్ఛిక ప్రజాభిప్రాయ సేకరణలో బిల్లు మీద ప్రజాభిప్రాయ సేకరణ జరపడం అనేది ప్రజల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది.
2. ప్రజాభిప్రాయ నివేదన (చొరవ) (Initiative) :
చొరవ అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం మరొక అతిముఖ్యమైన సాధనం. ఒక నిర్ణీత సంఖ్యలో ప్రజలకు సంబంధించిన ఏదైనా ఒక అంశంపై శాసనం చేయమని శాసనసభకు ప్రతిపాదిస్తే దానిని ప్రజాభిప్రాయ నివేధన అంటారు. ఇందులో ప్రజల చొరవతో లిఖితపూర్వకమైన ప్రతిపాదనతో ప్రభుత్వంచేత శాసనాలు రూపొందించబడుతాయి. ఇది ప్రస్తుతం స్విట్జర్లాండ్లో అమలులో ఉంది.
చొరవ రెండు రకాలు. అవి :
a) బిల్లు రూపంలో ప్రజాభిప్రాయ నివేదన.
b) బిల్లు రూపంలో లేని ప్రజాభిప్రాయ నివేదన.
a) బిల్లు రూపంలో ప్రజాభిప్రాయ నివేదన :
ఈ పద్ధతిలో ప్రజలే స్వయంగా ప్రజాప్రయోజనం దృష్ట్యా అవసరమని భావిస్తే ఆ అంశంపై తామే స్వయంగా లిఖితరూపంలో బిల్లు ముసాయిదా తయారుచేసి ప్రభుత్వానికి సమర్పిస్తూ కచ్చితంగా అమలుపరచమని కోరవచ్చు. అనంతరం ఆ అంశాన్ని శాసనసభ తప్పనిసరిగా చట్టంగా అనుమతించవలసి ఉంటుంది.
b) బిల్లు రూపంలో లేని ప్రజాభిప్రాయ నివేదన :
ఈ పద్ధతిలో ఏదైనా ఒక ప్రత్యేక అంశంపై ప్రజాప్రయోజనం కోసం శాసనం అవసరమని భావిస్తే సంక్షిప్త రూపంలో 50 వేల మంది ప్రజలు సంతకాలు చేసి శాసనసభకు నివేదించవచ్చు. అనంతరం శాసనసభ ఆ అంశంపై శాసనం రూపొందించి ప్రజామోదంతో అమలుపరుస్తుంది.
3. పునరాయనం (Recall) :
పునరాయనం అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతిలో అతిముఖ్యమైన సాధనం. ఈ పద్ధతిలో ప్రజలు తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు సంతృప్తికరంగా పనిచేయకపోతే వారిని వెనక్కి పిలిచే అవకాశం ఉంది. అధిక సంఖ్యాకులు ఈ ప్రతిపాదనకు మద్దతిస్తే ఆ ప్రతినిధి రాజీనామా చేయడానికి అవకాశం ఉంది. అంటే తాము ఎన్నుకున్న ప్రతినిధులు అసమర్థులు, అప్రయోజకులు అని భావిస్తే వారిని పదవి నుంచి తొలగించివేస్తారు.
4. ప్రజానిర్ణయం (Plebiscite) :
ప్లెబిసైట్ అనే పదం ఫ్రెంచిపదం. ఇది ఫ్రెంచి పదాలైన “ప్లెబిస్”, “సిస్లిమ్” నుంచి వచ్చింది. అంటే ప్రజల అభిలాష అని అర్థం. ప్రజానిర్ణయం ప్రజాభిప్రాయ సేకరణకు దగ్గరగా ఉంటుంది. ప్రజానిర్ణయంలో కేవలం రాజకీయ ప్రాధాన్యతగల సమస్యలపై ప్రజానిర్ణయాన్ని సేకరిస్తారు.
తద్వారా ప్రజల నిర్ణయంతో శాశ్వతమైన రాజకీయ పరిష్కారం సాధించే ప్రయత్నం జరుగుతుంది.
ఉదా : సరిహద్దులను మార్చడం, రాజ్య స్వాతంత్య్రం (స్వేచ్ఛ) దేశాల విభజన మొదలైనవి. ప్రజాభిప్రాయ సేకరణ ఒక శాసనప్రక్రియ, కాని ప్లెబిసైట్కు శాసనప్రక్రియతో సంబంధం లేదు. ప్రజానిర్ణయం అతిముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రజల నిర్ణయమే అంతిమ తీర్పు.
ప్రశ్న 4.
ప్రజాస్వామ్యంలో “ప్రజాభిప్రాయం పాత్ర” ఏమిటి ?
జవాబు.
‘ప్రజాభిప్రాయం’ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా 17వ శతాబ్దంలో జాన్లాక్ ఉపయోగించాడు. అయినప్పటికీ జాన్ లాక్ కంటే ముందే ఈ భావన ఉంది. లాటిన్ భాషలో ‘వాక్స్ పాపులీ’ ‘Vo populi’ లేదా ‘ప్రజల గొంతుక’ ‘Voice of the People’ అనే పదాలు వాడుకలో ఉన్నాయి. ప్రజాభిప్రాయాన్ని ఈ విధంగా నిర్వచించారు – “రాజకీయ సంఘటనలు, ప్రభుత్వ విధానాలు, వివిధ సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన అంశాలపై ప్రజల మూల్యాంకనం లేదా అభిప్రాయాల సారమే ప్రజాభిప్రాయం”.
ప్రజాస్వామ్యంలో రాజకీయ అధికారానికీ అంతిమంగా ప్రజలే మూలం కాబట్టి ప్రజాభిప్రాయానికీ చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రభుత్వ విధానంలో మార్పులు తీసుకొని రావడానికి, నిష్క్రియాత్మకమైన పరిశీలన ద్వారా పౌరులను ఏకం చేయటానికి ప్రజాభిప్రాయం తోడ్పడుతుంది.
సిద్ధాంతపరంగా ప్రభుత్వాధికారులు భవిష్యత్ చర్యలను ప్రజాభిప్రాయం నిర్ణయిస్తుంది. రాజకీయ నాయకులు ప్రజల కోరికలను ఎప్పుడూ నెరవేరుస్తారని దీని అర్థం కాదు. దేశంలో మెజారిటీ ప్రజలు పడుతున్న బాధలను తొలగించటానికి రాజకీయ నాయకులు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.
వివిధ సమాచార సాధనాల ద్వారా, ఇతర వనరుల ద్వారా రాజకీయ పార్టీలు ప్రజాభిప్రాయాన్ని సేకరించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. ప్రఖ్యాత అమెరికా జర్నలిస్ట్ గ్రాంట్లాండ్ రైస్ ప్రకారం “ఒక తెలివైన వ్యక్తి స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఒక అజ్ఞాని మాత్రం ప్రజాభిప్రాయాన్ని అనుసరిస్తాడు.”
ప్రజాభిప్రాయానికి ఒక రూపత కల్పించడానికి గల కారకాలను అవగాహన చేసుకోవడం అవసరం. అవి సామాజిక వర్గం, విద్య, మతం, వయస్సు, లింగం, జాతి సమూహం మొత్తానికి సమాజం సజాతీయమైనది కాదు. అది వివిధ ఆలోచనల లేదా వర్గాల కలయికగా అవతరించింది. ప్రతీ విభాగం తమ విధుల నిర్వహణలో విభిన్న సవాళ్ళను ఎదుర్కొంటుంది. అందువల్ల ప్రతి విభాగంలోని సభ్యులు ప్రపంచాన్ని విభిన్న రకాలుగా భావిస్తారు.
ఈ విభిన్న అంశాలు అభిప్రాయాల ఘర్షణకు దారి తీసి రాజకీయ విస్తరణను చూరకొంటాయి. సమాజంలో సభ్యుల సమ్మతిపైనే రాజ్యం నిర్మించబడింది. ప్రజల సమష్టి ఆమోదంతోనే రాజ్యాంగం రచించబడింది. రాజ్యం, రాజ్యాంగం నిర్మాణంలో వ్యక్తులు ప్రాథమిక పద్ధతిలో తమ అభిప్రాయం చెప్పారో అదే ప్రజాభిప్రాయం.
అనేక ప్రభుత్వాలు తమ విధానాలు లేదా చర్యలు ప్రజలపై ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో సమాచార సాధనాల ద్వారా తెలుసుకుంటాయి.
ప్రజాస్వామ్య సమాజంలో ప్రజాభిప్రాయం ప్రత్యేక పాత్రను పోషిస్తుంది. ప్రజాభిప్రాయానికి ప్రభుత్వం స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. ప్రజాభిప్రాయం ద్వారా ప్రజల నుంచి డిమాండ్, మద్ధతుల పట్ల ప్రజాస్వామ్య సమాజం అప్రమత్తంగా ఉండాలి.
ప్రశ్న 5.
ప్రజాస్వామ్య విజయానికి కావలసిన ఏవైనా నాలుగు పరిస్థితులను వివరించండి.
జవాబు.
1. సరైన విద్య (Sound system of Education) :
ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే పౌరులకు సరైన విద్య ఎంతో అవసరం. అజ్ఞానం, అమాయకత్వం, అవిద్య గల పౌరులు సరైన దృక్పథాన్ని కలిగి ఉండక, భారీ సంస్కరణల పట్ల విముఖత ప్రదర్శిస్తారు. విద్య అనేది వ్యక్తుల వివేకానికి పదును పెడుతుంది. అనేక విషయాల పట్ల సరియైన అవగాహనను పెంపొందిస్తుంది. పౌరులను అప్రమత్తులుగా చేస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ విధానాలను అంచనా వేయడంలో, విమర్శించడంలో విద్య దోహదపడుతుంది.
2. వికాసవంతమైన పౌరసత్వం (Enlightened Citizenship) :
ప్రజాస్వామ్య రాజ్యానికి వికాసవంతమైన పౌరులు విలువైన ఆస్థిగా పరిగణించబడతారు. వారు ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. వీరు ప్రభుత్వ వ్యవహారాలలో. చురుకుగా పాల్గొని, హక్కులు, విధుల సక్రమ నిర్వహణలో తోటి పౌరులకు సహాయంగా ఉంటారు. ప్రభుత్వం అమలుచేసే అన్ని మంచి కార్యక్రమాలకు సహకారాన్ని అందిస్తారు.
3. స్వతంత్ర పత్రికలు (Independent Press) :
ప్రజాస్వామ్యానికి స్వతంత్రమైన పత్రికలు ఎంతో ఆవశ్యకమైనవి. పత్రికలు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ఖచ్చితంగానూ, నిష్పక్షపాతంగానూ ప్రజలకు తెలుపుతాయి. ప్రభుత్వ కార్యకలాపాల పట్ల ప్రజలకు సంబంధం కలిగి ఉండేటట్లు చూస్తాయి. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతాయి. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సామరస్యపూర్వక సంబంధాలను పెంపొందించేందుకు కృషి చేస్తాయి.
4. దృఢమైన ప్రతిపక్షం (Strong Opposition) :
పార్లమెంటరీ ప్రజాస్వామ్య విజయం దృఢమైన, సమర్థవంతమైన ప్రతిపక్షంపై చాలా వరకు ఆధారపడుతుంది. అటువంటి ప్రతిపక్షం ప్రభుత్వ విధానాల లోపాలను వెల్లడించి, వాటి నివారణకు కృషి చేస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ప్రతిపక్షాలు ప్రశంసనీయమైన పాత్రను పోషిస్తున్నాయనే విషయాన్ని ఈ సందర్భంలో మనం ప్రస్తావించవచ్చు.
భారతదేశంలో కూడా ఇటీవలి కాలంలో అధికారంలో కొనసాగిన అధికార పార్టీలకు చెందిన వ్యక్తులు పాల్పడిన కుంభకోణాలను వెలికి తీయడంలో ప్రతిపక్షం బృహత్తరమైన పాత్రను పోషించింది. పైన ఉదహరించిన దేశాలలోని అధికార పార్టీలు అనేక అంశాలలో ఎదురైన చిక్కుముడులను పరిష్కరించడంలో ప్రతిపక్షాల సలహాలను తీసుకోవడమైనది. ఇటువంటి పరిస్థితి అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు రెండింటిలో ప్రజాస్వామ్యపు ఆరోగ్యకర చిహ్నంగా పరిగణించవచ్చు.
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
ప్రజాస్వామ్యాన్ని నిర్వచించండి.
జవాబు.
ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో ‘డెమోక్రసీ’ అంటారు. ఈ పదము రెండు గ్రీకు పదాలైన ‘డెమోస్’ మరియు ‘క్రటోస్’ ల నుండి గ్రహించబడింది. డెమోస్ అంటే ప్రజలు, క్రటోస్ అంటే అధికారం లేదా పాలన అని అర్థం. అంటే డెమోక్రసీ అంటే ప్రజల అధికారం లేదా ప్రజల పాలన.
- “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలించే, నిర్వహించబడే ప్రభుత్వం” అని అబ్రహాం లింకన్ పేర్కొన్నాడు.
- “ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం” అని జె.ఆర్.సీలీ పేర్కొన్నాడు.
ప్రశ్న 2.
పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ?
జవాబు.
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా ప్రభుత్వ పాలన నిర్వహించబడటాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం లేదా పరోక్ష ప్రజాస్వామ్యం అని అంటారు. నిర్ణీత సమయానికి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తమ అధికార, విధుల నిర్వహణలో ప్రజలకు బాధ్యత వహిస్తారు. ప్రజా ప్రతినిధులు తమ అధికార విధుల నిర్వహణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించటంలో విఫలమైతే వారిని ప్రజలు ఎన్నికల సమయంలో పదవుల నుండి తొలగిస్తారు.
ప్రశ్న 3.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ?
జవాబు.
ఈ పద్ధతిలో ప్రజలు ప్రభుత్వ పాలన వ్యవహారాలలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. శాసన సంబంధమైన అధికారాలన్నీ వారు చెలాయిస్తారు. ప్రజలే చట్ట సభలలో పాల్గొని చట్టాలను రూపొందిస్తారు. రాజ్య వ్యవహారాలలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తారు.
ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం ప్రస్తుతం స్విట్జర్లాండ్లో కొన్ని కాంటన్ల (Cantons) లోనూ; అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనూ నెలకొని ఉంది.
ప్రశ్న 4.
పునరాయనం అంటే ఏమిటి ?
జవాబు.
పునరాయనం అనేది ఒక ముఖ్యమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనం. ఈ పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేదా అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా తమ కర్తవ్యాలను నిర్వహించడంలో విఫలమైతే వారిని ఓటర్లు వెనుకకు పిలిచేందుకు వీలుంటుంది. దీనినే పునరాయనం అంటారు. ఈ రకమైన పద్ధతి అమెరికాలోని అలెజోనా, మోంటానా, లూసియానా, కాన్సాస్, కాలిఫోర్నియా, నెవెడా, ఓరెగాన్ మొదలగు రాష్ట్రాలలో అమలులో ఉంది.
ప్రశ్న 5.
ప్రజానిర్ణయం అంటే ఏమిటి ?
జవాబు. ప్రజాభిప్రాయ నిర్ణయాన్ని ఆంగ్లంలో ‘ప్లెబిసైట్’ అంటారు. ఈ పదం లాటిన్ భాషలోని ‘ప్లెబిస్’ మరియు ‘సెటమ్’ అనే రెండు పదాల నుండి గ్రహించబడింది. ప్లెబిస్ అంటే ప్రజలు, సెటమ్ అంటే నిర్ణయం లేదా తీర్పు అని అర్థం. అంటే దీని అర్థం ప్రజా నిర్ణయం లేదా ప్రజాతీర్పు. ఒక ప్రభుత్వ విధానంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు అనుసరించే ప్రజాస్వామ్య సాధనమే ప్రజాభిప్రాయ నిర్ణయమని భావించవచ్చు.
ప్రశ్న 6.
ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఏమిటి ?
జవాబు.
‘ప్రజాభిప్రాయ సేకరణ’ని ఆంగ్లంలో ‘రిఫరెండమ్ ‘(Referendum)’ అంటారు. ఒకానొక అంశంపై ప్రజల అభిప్రాయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకొనే ప్రక్రియనే ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ఇటువంటి అంశం సాధారణమైనది కావచ్చు లేదా రాజ్యాంగపరమైనది కావచ్చు. ఆర్.సి. బ్రూక్స్ ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ అనేది శాసనసభ ఇప్పటికే ఆమోదించిన బిల్లు లేదా చట్టంపై నియోజకుల అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు ఉద్దేశించింది.
ప్రశ్న 7.
ప్రజాభిప్రాయ నివేదన అంటే ఏమిటి ?
జవాబు.
శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రజలు, పాల్గొనేందుకు తోడ్పడే ప్రక్రియనే ప్రజాభిప్రాయ నివేదన అని అంటారు.
ఉదా : స్విట్జర్లాండ్ లో 50,000 మంది పౌరులు ఏదైనా ఒక అంశంపై చట్టాన్ని రూపొందించాల్సిందిగా శాసనసభను కోరుతూ ఒక అర్జీపై సంతకం చేసినట్లయితే, వారి ప్రతిపాదనను ప్రజల అభిప్రాయానికి పంపబడుతుంది.
మెజారిటీ ప్రజలు ఆ ప్రతిపాదనను ఆమోదించినట్లయితే ఆ అంశం చట్టంగా ఆమోదితమై అమల్లోకి వస్తుంది. ఇది రెండు రకాలు :
- విధాయక రూపంలో ఉన్న ప్రజాభిప్రాయ నివేదన.
- విధాయక రూపంలో లేని ప్రజాభిప్రాయ నివేదన.
ప్రశ్న 8.
ప్రజాభిప్రాయం అంటే ఏమిటి ?
జవాబు.
లాటిన్ భాషలో ‘వాక్స్పాపులీ’ ‘Vox populi’ లేదా ప్రజల గొంతుక Voice of the People అనే పదాలు వాడుకలో ఉన్నాయి. ప్రజాభిప్రాయాన్ని ఈ విధంగా నిర్వచించారు – “రాజకీయ సంఘటనలు, ప్రభుత్వ విధానాలు, వివిధ సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన అంశాలపై ప్రజల మూల్యాంకనం లేదా అభిప్రాయాల సారమే ప్రజాభిప్రాయం”.
ప్రజాస్వామ్యంలో రాజకీయ అధికారానికి అంతిమంగా ప్రజలే మూలం కాబట్టి ప్రజాభిప్రాయానికి చాలా ప్రాముఖ్యత వుంది. రాజకీయ పక్షాలు, పత్రికలు, వేదికలు, విద్యాసంస్థలు, శాసనసభ, రేడియో, టెలివిజన్, చలన చిత్రాలు ద్వారా ప్రజాభిప్రాయం వ్యక్తమవుతుంది.