Telangana SCERT 9th Class Telugu Guide Telangana 6th Lesson దీక్షకు సిద్ధంకండి Textbook Questions and Answers.
TS 9th Class Telugu 6th Lesson Questions and Answers Telangana దీక్షకు సిద్ధంకండి
చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 60)
స్వచ్ఛతలో చరిద్దాం !! స్వచ్ఛతకై శ్రమిద్దాం !
స్వచ్ఛ భారత్కు సన్నద్ధం కండి !
ప్రియమైన విద్యార్థులారా ………….
దేశవ్యాప్తంగా ఇటీవల మనం స్వచ్ఛభారత్ పేరుతో ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టిన విషయం మీకు తెల్సిందే! ప్రజల బాధ్యతారాహిత్యం వల్ల దేశవ్యాప్తంగా పేరుకుపోతున్న అపరిశుభ్రతను అనతికాలంలోనే తొలగించాలన్నది ఒక దీక్షలాగ చేపట్టాం. నిరంతరం కొనసాగవలసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా భాగస్వాములే ! మీ మీ పరిసరాల్లో పోగుపడ్డ చెత్తాచెదారాన్ని తొలగించుకుంటూ, వ్యక్తిగత శుభ్రతతో సామాజిక పరిశుభ్రతను గురించి పదిమందికి అవగాహన కల్పిస్తూ స్వచ్ఛభారత్ సాకారమయ్యే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం !
రానున్న రోజులలో భారతావని పరిశుభ్ర భారతంగా పరిఢవిల్లాలని కోరుకుందాం.
వైద్య, ఆరోగ్యశాఖ, రాష్ట్రం.
తెలంగాణ రాష్ట్రం
ప్రశ్నలు
ప్రశ్న 1.
ఇటువంటి పత్రాలు ఎక్కడైనా చూశారా ?
జవాబు:
ఇటువంటి పత్రాలను నేను చూశాను. వీటిని “కరపత్రాలు” అంటారు. వీటినే ఇంగ్లీషుభాషలో Pamphlet అంటారు. ఈ రోజుల్లో సమావేశాలకు రమ్మని పిలిచే ఆహ్వానాలకూ, ఆరోగ్యవర్ధకమైన ప్రభుత్వ ప్రచారాలకు, దైవసంబంధ కార్యక్రమాలకు ఈ కరపత్రాలను పంచుతున్నారు.
ప్రశ్న 2.
ఇట్లా పంచిపెట్టే పత్రాలను ఏమంటారు?
జవాబు:
ఇలా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించేందుకు వినియోగించే పత్రాలను కరపత్రాలు అంటారు.
ప్రశ్న 3.
వీటిని ఎందుకు పంచిపెడుతారు?
జవాబు:
ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద అంశాన్ని ప్రజలందరికీ తెలియపరచడమే, కరపత్రం పంచడంలో గల ప్రధాన ఉద్దేశం. ఒక వ్యక్తిగాని, సంస్థగాని ప్రజలకు అందించాలనుకొనే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు ఈ కరపత్రాలను వినియోగిస్తారు.
ఇవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
కరపత్రాలను ఎందుకు రూపొందిస్తారు ? మీరు చదివిన కరపత్రం గురించి మాట్లాడండి.
జవాబు:
ఒక వ్యక్తిగాని, సంస్థగాని ప్రజలకు అందించాలనుకొనే సమాచారాన్ని, వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు కరపత్రాన్ని రూపొందిస్తారు. ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద విషయాన్ని ప్రజలందరికీ తెల్పడమే కరపత్రం యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక ప్రయోజనాలు ఉన్న విషయాలను, సామాన్య ప్రజానీకానికి చేరవేయడానికి కరపత్రం, ఒక ముఖ్య సాధనంగా ఉంటుంది.
నేను చదివిన కరపత్రం : స్టేట్బ్యాంకు వారు ఇంటి అప్పులు తక్కువ వడ్డీకి, ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా ఇస్తారన్న కరపత్రాన్ని నేను చదివాను.
- ఇంటి అప్పుకు దరఖాస్తు చేసే వ్యక్తి పేర ఇంటిస్థలం ఉండాలి.
- ఇల్లు నిర్మాణానికి స్థానిక పంచాయితీ / మునిసిపల్ కార్పొరేషన్ వారి అనుమతి పత్రం ఉండాలి.
- నిర్మాణ ఖర్చులో 1/4 వంతు పెట్టుబడిగా పెట్టగలిగిన స్థోమత దరఖాస్తుదారుకు ఉండాలి.
- హామీదారు అవసరం లేదు.
- అప్పు వడ్డీతో సహా 15 సంవత్సరాలలో తీర్చగలగాలి.
- జీతం నుండి రికవరీ చేసి, బ్యాంకుకు కడతామన్న పై అధికారి, హామీపత్రం ఉండాలి.
- సంవత్సరానికి 8% వడ్డీకే ఋణం మంజూరు.
- ఋణం ముందుగా చెల్లిస్తే, వడ్డీలో కన్సెషన్లు ఇవ్వబడతాయి.
ప్రశ్న 2.
ప్రజా ఉద్యమాలను శాంతియుతంగానే నిర్వహించవలసిన అవసరం ఏమిటి? చర్చించండి.
జవాబు:
ప్రజా ఉద్యమాలను శాంతియుతంగానే నిర్వహించాలి. హింసా పద్ధతులతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రజల నిత్యావసరాల సరఫరాకు ఆటంకాలు కల్పించడం, వగైరా పనులు చేయరాదు.
ప్రజా ఉద్యమాలను శాంతియుతంగా నిర్వహిస్తే కలిగే లాభాలు :
- ఉద్యమకారులకు ప్రాణనష్టం, ధననష్టం జరుగదు.
- ఉద్యమకారులు ప్రాణభయంతో ఉద్యమం నుండి తప్పుకోరు.
- శాంతియుతంగా ఉద్యమాలు నడిపితే, ఉద్యమాన్ని ఎక్కువకాలం కొనసాగించవచ్చు.
- ఎక్కువకాలం శాంతియుతంగా ఉద్యమం నిర్వహిస్తే, ప్రభుత్వానికి కూడా ఉద్యమకారులపై సానుభూతి, దయ కలుగుతుంది.
- శాంతియుతంగా ఉద్యమం నడిపిన ఉద్యమకారులపై సామాన్య ప్రజలకు అభిమానం, సానుభూతి కలుగుతాయి.
- శాంతియుతంగా చేస్తే, ఉద్యమకారులను ప్రభుత్వం కూడా ఏమీ చేయదు.
- శాంతియుత ఉద్యమం తప్పక విజయాన్ని సాధిస్తుంది.
ప్రశ్న 3.
పాఠం చదువండి. అప్పటి ప్రభుత్వ పాలనను గురించి విమర్శిస్తూ వాడిన కీలక పదాలు వెతికి రాయండి. వాటిని వివరించండి.
జవాబు:
ప్రశ్న 4.
కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఆంగ్లేయుల రాకకు ముందు మన భారతదేశంలో కరపత్రాలు లేవు. ఆధునిక కాలంలో ప్రతిరోజు మనం కనీసం ఒకకరపత్రమైనా చూస్తున్నాం.
ఒక సమాచారాన్ని లేదా ప్రత్యేక అంశాలను అందరికీ తెల్పడమే కరపత్రం ప్రధాన ఉద్దేశం. కరపత్రంలో సాధారణంగా వాడుకభాష ఉంటుంది. కరపత్రాలు వేసినవాళ్ళు, రాసినవాళ్ళ పేర్లు గాని, ముద్రణాలయం పేరు గాని కరపత్రాల్లో ఉండాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక ప్రయోజనాలున్న అంశాలను సామాన్య ప్రజానీకానికి చేరవేయడానికి కరపత్రం ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతుంది. కరపత్రం మనిషి భావస్వేచ్ఛకు సంకేతం.
ప్రశ్నలు:
అ) పై పేరాకు శీర్షిక నిర్ణయించండి.
జవాబు:
‘కరపత్రాల ప్రయోజనం’ అనేది, పై పేరాకు శీర్షికగా సరిపడుతుంది.
ఆ) కరపత్రాలు మనదేశంలో ఎప్పటి నుండి ఉన్నాయి ?
జవాబు:
కరపత్రాలు, మనదేశంలో ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పటి నుండీ ఉన్నాయి.
ఇ) కరపత్రాలు ఎందుకు ?
జవాబు:
ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద అంశాన్ని అందరికీ తెల్పడానికి, కరపత్రాలు ఉపయోగిస్తారు.
ఈ) కరపత్రాలు ఎట్లా ఉండాలి ?
జవాబు:
కరపత్రాలలో సాధారణంగా వాడుకభాష ఉండాలి. కరపత్రాలు వేసినవాళ్ళు, రాసినవాళ్ళ పేర్లు గాని, ముద్రణాలయం పేరు గాని, కరపత్రాల్లో ఉండాలి.
ఉ) పై గద్యం ప్రకారం ఎక్కువగా వేటికి చెందిన కరపత్రాలు చూస్తున్నాం ?
జవాబు:
ప్రభుత్వ సంక్షేమ పథకాలనూ, సామాజిక ప్రయోజనాలున్న విషయాలనూ, సామాన్య ప్రజలకు చేరవేయడానికి నేడు ఎక్కువగా కరపత్రాలు వాడుతున్నాం.
II. వ్యక్తీకరణ-సృజనాత్మకత
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) 1969 తెలంగాణ ఉద్యమకాలం నాటి పాలన ఎట్లా ఉందని భావిస్తున్నారు ?
జవాబు:
1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని, విద్యార్థులూ, ప్రజలూ, ఉద్యోగస్థులూ, రాజకీయ నాయకులూ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలంగాణ నాయకుడు పి.వి. నరసింహారావుగారు ఉండేవారు. 1956లో ఆంధ్ర ప్రాంతమూ తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ ప్రాంతానికి ముల్కీ హక్కులు ఉండేవి.. దాని ప్రకారము తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం తెలంగాణ వారికే ఇవ్వాలి.
కాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత, తెలంగాణ ప్రాంతంలో సహితమూ, ముల్కీ నియమాలను ఉల్లంఘించి, ఆంధ్ర ప్రాంతం వారికి తెలంగాణలో ఉద్యోగాలు ఇచ్చారు. అదీగాక 1956 నుండి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఆంధ్ర ప్రాంతం వారే ఉండేవారు. వారు ఆంధ్ర ప్రాంతానికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకొనేవారు. తెలంగాణ ప్రాంతంలో వచ్చే ప్రభుత్వ రెవెన్యూను సైతం వారు ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు చేసేవారు.
అందువల్ల తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడింది. తెలంగాణ ఉద్యోగులు, ముల్కీ హక్కుల రక్షణకు, నిరవధిక సమ్మెలు ప్రారంభించారు. రాష్ట్ర నాయకులు సమ్మెలను నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. విద్యార్థులు 9 నెలలపాటు సమ్మె చేసినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. విద్యార్థులకు అప్పుడు ఒక విద్యా సంవత్సరం పూర్తిగా వ్యర్ధమయ్యింది.
ఆ) అప్పటి తెలంగాణ పోరాటంలో ప్రజలు కోపోద్రిక్తులు కావడానికి కారణాలు రాయండి.
జవాబు:
ప్రజలు శాంతియుతంగా నెలల తరబడి సమ్మెలు, ధర్నాలు, పికెటింగులు చేసినా, నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉద్యమ నాయకులను బలవంతంగా కారాగారాల్లో ప్రభుత్వము బంధించింది. ఎందరో యువకులు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోలీసుల తుపాకుల తుటాలకు బలయ్యారు. ఎందరో ఉద్యమ నాయకులు, రక్తతర్పణ చేశారు. ఎందరో యువకులు అంగవికలులు అయ్యారు..
తెలంగాణ ప్రాంతం అంతా, అగ్నిగుండంగా మారింది. అయినా కేంద్రప్రభుత్వము తెలంగాణ ప్రజల కోరికను మన్నించలేదు. కనీసము వారిని శాంతింపచేయడానికి ప్రయత్నాలు కూడా చేయలేదు. ఆ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు కోపోద్రిక్తులయ్యారు.
ఇ) గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా తెలంగాణ సాధించాలనడంలో ఆంతర్యం ఏమిటి ?
జవాబు:
1969వ సంవత్సరము గాంధీ శతజయంతి సంవత్సరము. గాంధీజీ శాంతి, సత్యము, అహింస అనే సిద్ధాంతాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పాలకులను మనదేశం నుండి వెడలగొట్టగలిగారు. గాంధీజీ కార్యసాధనకు సత్యాగ్రహాలను, నిరాహారదీక్షలను నమ్మినవాడు. అటువంటి గాంధీజీ శత జయంతి సంవత్సరంలో, గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని, తెలంగాణ ప్రజాసమితి భావించింది. అందుకే విద్యార్థి నాయకుడు నిరాహారదీక్షకు సిద్ధపడ్డాడు.
ఉద్యమం శాంతియుతంగా నడవకపోతే, ప్రభుత్వం బలవంతంగా ఆ ఉద్యమాన్ని శాంతిస్థాపన పేరుతో అణచివేస్తుంది. అశాంతిగా ఉద్యమాన్ని నడిపిస్తే, నాయకులను, ప్రభుత్వం బంధిస్తుంది. ఆ పరిస్థితులు రాకుండా, తెలంగాణ ప్రజాసమితి నాయకత్వం ముందు జాగ్రత్తగా, రాష్ట్ర సాధనోద్యమాన్ని, గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా సాగించాలని నిశ్చయించింది.
ఈ) ప్రజా ఉద్యమాలు హింసాత్మకంగా మారకుండా ఉండడానికి ఉద్యమనాయకత్వం ఏం చేయాలి?
జవాబు:
ప్రజా ఉద్యమాలు హింసాత్మకంగా మారకుండా ఉండాలంటే, ఉద్యమనాయకులు ఈ కింది పద్ధతులను ఆచరణలో పెట్టాలి.
- ఉద్యమానికి ప్రధాన నాయకునిగా ఆవేశపరుడు, ఉద్రేకం కలవాడు కాని, అనుభవం కల నాయకుడిని ఎన్నుకోవాలి.
- ఉద్యమం శాంతియుతంగా, గాంధీజీ నమ్మిన అహింసా మార్గంలోనే నడిపించాలి.
- ఉద్యమనాయకులు ప్రభుత్వ ఆస్తులకు ఏవిధమైన నష్టం కల్గించరాదు.
- ఉద్యమనాయకులు తమ అనుచరులకు హితాన్ని ఉపదేశించి, శాంతిమార్గంలో నడిచేలా చేయాలి.
- ఉద్యమనాయకులు ప్రభుత్వానికి తమ సమస్యలను ఎప్పటికప్పుడు శాంతియుతంగా తెలపాలి.
- ఉద్యమాన్ని హింసా పద్ధతిలోనికి ఎన్నడూ మార్చరాదు.
- ఉద్యమం హింసాపద్ధతిలోకి మళ్ళినట్లయితే, వెంటనే ఉద్యమాన్ని తాత్కాలికంగా నాయకుడు ఆపుచేయాం.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) 1969 నాటి తెలంగాణ ఉద్యమం ద్వారా రాష్ట్రం సాధించకపోవడానికి, నేటి ఉద్యమం విజయవంతం కావడానికి కారణాలు విశ్లేషించండి.
జవాబు:
1969 తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ నాయకులు డా॥ మర్రి చెన్నారెడ్డిగారు నాయకత్వం వహించారు. ఆ రోజుల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ఈ మధ్య సాగిన ఉద్యమం కంటే తీవ్రస్థాయిలోనే జరిగింది. నాటి తెలంగాణ ప్రజాసమితి నాయకత్వాన్ని ప్రజలు కూడా ఎక్కువగానే సమర్థించారు.
అప్పుడు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి నాయకులను 10 మందిని, ప్రజలు యమ్.పి లుగా నెగ్గించారు. విద్యార్థులు 9 నెలలపాటు పాఠశాలలనూ, కళాశాలలనూ బహిష్కరించారు. వారికి ఒక విద్యాసంవత్సరం మొత్తం నష్టం అయ్యింది. అయినా, ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాలేదు.
దానికి ముఖ్యకారణాలివి.
ఆనాటి తెలంగాణ ఉద్యమంలో అహింసా పద్ధతులు అమలయ్యాయి. హైదరాబాదు నగరంలో నివసిస్తున్న ఆంధ్రప్రాంత స్త్రీలను ఉద్యమకారులు అవమానించారు. అల్లర్లు చేశారు. ఈ విధంగా ఉద్యమంలో అహింసా పద్ధతులు అమలుచేయడం వల్లే, నాడు ఆ నాయకులు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధింపలేకపోయారు.
నేటి ఉద్యమ విజయానికి కారణాలు :
- నేటి ఉద్యమం, పట్టువదలని విక్రమార్కుడైన కె.సి.ఆర్ నాయకత్వంలో అహింసా పద్ధతులలో సాగింది.
- నిరాహారదీక్షలు, నిరసనలు, సమ్మెలు, సకలజనుల సమ్మె, ఉద్యోగుల సమ్మె వంటి పద్ధతుల ద్వారా కేంద్రప్రభుత్వాన్ని నేటి ఉద్యమ నాయకులు ఒప్పించగలిగారు.
- 1969 ఉద్యమానికి నాటి కాంగ్రెస్ పార్టీ, వ్యతిరేకంగా నిలిచింది. నేటి ఉద్యమనాయకులకు, తెలంగాణలోని అన్ని పార్టీలూ కలిసి వచ్చాయి.
- ముఖ్యంగా కాంగ్రెస్పార్టీ వారు ముందుండి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిపెట్టారు.
ఈ విధంగా శాంతియుతంగా సాగడమే, నేటి ఉద్యమ విజయానికి ప్రథమ కారణం.
3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.
ఆ) తెలంగాణ ప్రజల జీవనానికి, గ్రామాల అభివృద్ధికి తోడ్పడేవి “చెరువులు”. ఈ చెరువుల ప్రాధాన్యత వివరిస్తూ, వీటిని కాపాడడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చే కరపత్రం తయారు చేయండి. చదివి వినిపించండి.
జవాబు:
‘తెలంగాణ ప్రజల జీవనానికి చెరువుల ప్రాధాన్యము’
మన తెలంగాణ ప్రాంతంలో నేడు నీటి కొరతను ఎదుర్కొంటున్నాం. మనకు కృష్ణా, గోదావరి జీవనదులు ఉన్నా, వర్షపాతం తగినంత లేకపోడం దానికి ముఖ్యకారణం. ప్రధానంగా మన తెలంగాణలో చెరువులు ముఖ్యనీటి వనరులుగా ఉండి, మనకు త్రాగునీటినీ, సాగునీటినీ అందిస్తూ వచ్చాయి. ఈ మధ్యకాలంలో చెరువులను పూడ్చి ఆ స్థలంలో భవనాలు కట్టడం జరుగుతోంది. ఉన్న చెరువులను లోతుగా త్రవ్వించి, దానితో నీటిని నిల్వ చేయడంలో శ్రద్ధ తగ్గిపోయింది. చెరువులు, నీటి తూడు వగైరా పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. కొన్ని చెరువులు ఎండిపోయాయి. అందువల్లనే నేడు భూగర్భజలాలు అడుగంటిపోయాయి. 1500 అడుగులు లోతు బోర్లు వేసినా, చుక్క నీరు లభించడం లేదు. దీనికి ముఖ్యకారణం, మనం చెరువుల విషయంలో చూపిస్తున్న అశ్రద్ధ.
మన తెలంగాణ ప్రాంతంలో శాతవాహనుల కాలం నుండి చెరువుల నిర్మాణంపై శ్రద్ధ ఉంది. కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణం ఉన్నత దశకు చేరింది. తెలంగాణ పాలకులు, అసఫ్జాహీలు, కుతుబ్షాహీలు, సంస్థానాధీశులు చెరువుల నిర్మాణాన్ని అభివృద్ధి చేశారు.
ఇప్పటి మన తెలంగాణ ప్రభుత్వము చెరువుల ప్రాధాన్యతను గుర్తించింది. ‘మిషన్ కాకతీయ’ అనే పేరుతో పాత చెరువుల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యతనిస్తోంది. మనం కూడా ప్రభుత్వంతో చేయి కలుపుదాం. మనం కూడా ఉద్యమస్ఫూర్తితో ముందుకు కదులుదాం. ప్రతి గ్రామంలో చెరువుల పునర్నిర్మాణంలో పాలు పంచుకుందాం. నీటి కొరతలేని బంగారు తెలంగాణను నిర్మించుకుందాం. కదలిరండి. చెరువులను పునర్నిర్మించండి.
ది. X X X X X
ఇట్లు
తెలంగాణ రాష్ట్ర జలవనరుల శాఖ.
III. భాషాంశాలు
పదజాలం
1. కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలకు అర్థాలు రాస్తూ, సొంతవాక్యాల్లో ప్రయోగించండి.
అ) ఆయన అహర్నిశల ఆరాటము తీరని ఆవేదనగానే మిగిలిపోయినది.
జవాబు:
అహర్నిశలు = రాత్రింబగళ్ళు
వాక్యప్రయోగం : మనిషి అహర్నిశలూ విద్యాధనములు సంపాదించాలి.
ఆ) గాంధీ అహింసా మార్గంలో లక్ష్యాన్ని సాధించాడు.
జవాబు:
లక్ష్యం = తలపెట్టిన కార్యం
వాక్యప్రయోగం : ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే పట్టుదల మెండుగా ఉండాలి.
ఇ) తెలంగాణ జనత ధర్మయుద్ధం సాగిస్తున్నది.
జవాబు:
జనత = జనుల గుంపు
వాక్యప్రయోగం : భారతదేశం జనత కష్టజీవులు. ధర్మవర్తనులు.
2. ఇచ్చిన వివరణలకు సరిపడే జాతీయాలను బ్రాకెట్లో ఇవ్వబడిన వాటి నుండి ఏరి వాటికెదురుగా ఉన్న గళ్లల్లో రాయండి.
(కట్టలు తెంచుకోవడం, ఏ ఎండకాగొడుగు, ఉక్కుపాదం మోపడం, తిలోదకాలు ఇవ్వడం)
జవాబు:
అ) ఆశలు వదులు కొనటం = తిలోదకాలు ఇవ్వడం
ఆ) బలవంతంగా అణచివేయటం = ఉక్కుపాదం మోపడం
ఇ) మితిమీరిపోవటం = కట్టలు తెంచుకోవడం
ఈ) అవకాశవాదం = ఏ ఎండకాగొడుగు
వ్యాకరణాంశాలు
1. కింది వాక్యాల్లో సంధి పదాలను గుర్తించి, ఆ పదాలను విడదీసి సంధి పేర్లు పేర్కొనండి.
అ) కోపోద్రిక్తులైన కార్యకర్తలను హింసకు తెగబడకుండా కట్టడి చేశారు.
__________ + _______ = __________
జవాబు:
కోపాద్రిక్తులు = కోప + ఉద్రిక్తులు = గుణసంధి
ఆ) నమ్మిన సిద్ధాంతం కోసం గొప్పవారు ప్రాణాలర్పించడం చూస్తనే ఉన్నాం.
__________ + _______ = __________
జవాబు:
ప్రాణాలర్పించడం = ప్రాణాలు + అర్పించడం = ఉత్వసంధి
ఇ) సత్యాహింసలు పాటించడం ద్వారా సమాజ శాంతికి బాటలు వేయవచ్చు.
__________ + _______ = __________
జవాబు:
సత్యాహింసలు = సత్య + అహింసలు = సవర్ణదీర్ఘ సంధి
2. సమాస పదాలకు చెందిన కింది పట్టికను పూరించండి.
‘సమాస పదం – విగ్రహవాక్యం – సమాస నామం
- భక్తి ప్రపత్తులు – భక్తియు, ప్రపత్తియు – ద్వంద్వ సమాసం
- ధర్మయుద్ధం – ధర్మము కొఱకు యుద్ధం – చతుర్థీ తత్పురుష సమాసం
- రక్తపాతం – రక్తం యొక్క పాతం – షష్ఠీ తత్పురుష సమాసం
- శాంతి సందేశం – శాంతి యొక్క సందేశం – షష్ఠీ తత్పురుష సమాసం
- నాలుగెకరాలు – నాలుగు సంఖ్య గల ఎకరాలు – ద్విగు సమాసం
3. కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
అ) వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు.
వేలాది యువకులు కారాగారాలకు వెళ్లారు. (సామాన్య వాక్యాలు).
జవాబు:
వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు మరియు కారాగారాలకు వెళ్ళారు. (సంయుక్త వాక్యం)
ఆ) గాంధీ విధానాలను ఆచరించాలి.
గాంధీ విధానాల ద్వారా మంచిని సాధించాలి. (సామాన్య వాక్యాలు)
జవాబు:
గాంధీ విధానాలను ఆచరించాలి మరియు మంచిని సాధించాలి (సంయుక్త వాక్యం)
ప్రాజెక్టు పని
మీ ప్రాంతంలో వివిధ రకాల కరపత్రాలు సేకరించి వాటి వివరాలు కింది పట్టిక రూపంలో నమోదు చేయండి. నివేదిక రాయండి.
జవాబు:
కఠిన పదాలకు అర్థాలు
I
62వ పేజీ
సామూహిక ఉపవాస దీక్ష = అందరూ కలసి గుంపుగా ఉపవాసవ్రతం చేపట్టడం
తెలంగాణ రాష్ట్ర ధ్యేయాన్ని = తెలంగాణ రాష్ట్ర సాధన వాంఛను
చాటి చెప్పడానికి = వెల్లడించడానికి
మహాత్ముని = మహాత్మగాంధీజీ యొక్క
ప్రగాఢ విశ్వాసాన్ని = గట్టి నమ్మకాన్ని
ఆదేశాలను = ఆజ్ఞలను
ప్రజా ఉద్యమము = ప్రజల పోరాటం
కొనసాగుతున్నా = సాగుతున్నప్పటికీ (జరుగుతున్నప్పటికీ)
నిరసనపత్రాలకు = వ్యతిరేకతను తెలిపే కాగితాలకు
బడా మనుషులు = పెద్ద మనుష్యులు
భుక్తి మార్గం = తిండికి మార్గం
మలిన హృదయాలను = మురికిపట్టిన మనస్సులను
మరుగుపరుస్తున్నారు = దాస్తున్నారు
జాతిపిత ప్రబోధాలకు = గాంధీజీ బోధనలకు
తిలోదకాలు
(తిల + ఉదకాలు) = నువ్వుల నీళ్ళు
తిలోదకాలిచ్చు = పూర్తిగా ఆశ వదలుకొను,
అహర్నిశలు = పగలు, రాత్రి
ఆరాటము = సంతాపము
ఆవేదన = బాధ
కన్నీటితో తడియడం = ఏడవడం వల్ల కన్నీరు కారడం
ఆంధ్రపాలకులు = ఆంధ్రదేశపు ముఖ్యమంత్రులు
బానిస బంధాలను = = బానిస బంధములను;
తెలంగాణ జనత = తెలంగాణ ప్రజలు;
ప్రాణాలు కోల్పోయినారు = ప్రాణాలు పోగొట్టుకున్నారు
అంగవిహీనులు = అవయవాలు లేనివారు
సత్యాగ్రహ సమరం = సత్యాగ్రహ యుద్ధం
కారాగారం = జైలు
పికెటింగు = అడ్డుకోడం
ధర్నా = నిరసన కార్యక్రమం
ఉత్కృష్ట లక్ష్యాన్ని= గొప్ప లక్ష్యమును
రాబందుల రాచరికం = రాబందుల పెత్తనం
శాంతియుత విప్లవాన్ని = శాంతితో కూడిన విప్లవాన్ని
ప్రశాంత గంభీర జలధి = ప్రశాంతమైన లోతైన సముద్రము
పరిశీలన = శోధన
ప్రజాభిప్రాయము = ప్రజల అభిప్రాయము
మన్నన = గౌరవము
దారుణ హింసాకాండ = భయంకరమైన హింసా కృత్యం
రక్తపాతం = రక్తం కారడం
కోపోద్రిక్తులను = కోపముతో విజృంభించిన వారిని
కట్టలు తెంచుకొంటున్నది = గట్టులు తెంపుకొంటోంది
సడలిపోయే = జారిపోయే
ఏ ఎండకా గొడుగు = సందర్భానుసారంగా ఆచరించి కాలం గడుపుకోడం
63వ పేజీ
శాసన సభ్యులపైన = శాసనసభలోని సభ్యులపై (MLA లపై)
పేరుకుంటున్నది = అతిశయిస్తోంది
అగ్నిజ్వాలలు = అగ్నిమంటలు
కేరింతలాడుతున్న = ఉత్సాహంతో కేకలు వేస్తున్న
స్వార్థపరులు = తమ ప్రయోజనము మాత్రమే చూసుకొనేవారు
ప్రదర్శించడం = చూపడం
ధ్యేయానికి = కోరిన లక్ష్యమునకు
కలచివేస్తున్న = బాధపెడుతున్న
వాస్తవమే = సత్యమే
గాంధీ శతజయంతి
సంవత్సరం = గాంధీగారి నూరవ పుట్టినరోజు అయిన 1969వ సంవత్సరం
సత్యాహింసలు
(సత్య + అహింసలు) = సత్యము, అహింస
వరప్రభుత్వాన్ని = విదేశ ప్రభుత్వాన్ని
పారద్రోలిన = వెళ్ళగొట్టిన
కాసురాకాసి = డబ్బు రాక్షసి
నిరాహారదీక్ష = ఆహారం తిననని పట్టుపట్టడం
సమ్మతిని = అంగీకారాన్ని
శతజయంతి = నూరవ పుట్టినరోజు
జన్మదినానికి = పుట్టినరోజుకు
చేపట్టడం = చేయవలెనని అనుకోడం
పుష్టిని = బలాన్ని
భక్తి ప్రపత్తులు = భక్తి మరియు శరణాగతి
కానుక = బహుమతి
దిగ్విజయం = జయప్రదం
వెలుగులు విరజిమ్మాలి = కాంతులు నింపాలి
సత్యమేవ, జయతే = సత్యమే జయిస్తుంది
పాఠం నేపథ్యం, ఉద్దేశం
తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదు. ఎంతోమంది అమరుల త్యాగాలకు చిహ్నంగా సాధించుకున్నదే ఈ తెలంగాణ రాష్ట్రం. ఇది ఉద్యమాల ఫలితంగానే సాకారమైంది. నిన్నటి ఉద్యమానికి ముందే 1969లో ‘తెలంగాణ ప్రజాసమితి’ పేరుతోటి ప్రత్యేకరాష్ట్ర సాధన పోరాటం మొదలైంది. ఆనాటి ఉద్యమ తీరుతెన్నులను తెలుపడం, కరపత్రం యొక్క స్వరూప స్వభావాలను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం కరపత్రం అనే ప్రక్రియకు చెందినది. ఒక వ్యక్తి గాని, సంస్థ గాని, ప్రజలకు అందించాలనుకొనే సమాచారాన్ని వీలయినంత సంక్షిప్తంగా అచ్చు రూపంలో అందించేందుకు ఉపయోగించే పత్రాన్ని కరపత్రం అంటారు. దీనినే ఆంగ్లభాషలో ‘పాంప్లెట్” (Pamphlet) అంటారు.
“తెలంగాణ హిస్టరీ సొసైటి తరపున 2009లో వెలువడ్డ పుస్తకం, “1969 ఉద్యమం – చారిత్రక పత్రాలు” అనేది. ఈ పుస్తకంలో 1969 నాటి తెలంగాణ ఉద్యమ స్థితి గతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ముద్రించబడ్డాయి. ఆ పుస్తకంలో నుండి ఒక కరపత్రం తీసుకోబడింది. ఆ కరపత్రమే, ఈ పాఠం.
ప్రవేశిక
దీర్ఘకాలంగా శాంతియుత ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించినా అణచివేతకు దిగినా ఉద్యమాలు హింసాయుతంగా మారే అవకాశం ఉన్నది. ముందుగానే అటువంటి పరిణామాన్ని ఊహించిన ఉద్యమనాయకత్వం పాలకులను ఎండగడుతూ గాంధీ సిద్ధాంతాల కనుగుణంగా ఉద్యమించాలని పిలుపునిచ్చింది. ఇందుకనుగుణంగా రూపొందించిన 1969 నాటి కరపత్రంలో వివరాలు ఏమున్నాయో తెలుసుకుందాం.