TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

Telangana TSBIE TS Inter 2nd Year Economics Study Material 5th Lesson వ్యవసాయ రంగం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Economics Study Material 5th Lesson వ్యవసాయ రంగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయరంగ ప్రాధాన్యతను వివరించండి.
జవాబు.
1. స్థూలదేశీయ ఉత్పత్తి లేదా జోడించిన స్థూల విలువలో వ్యవసాయ రంగం వాటా :
మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటికి జాతీయాదాయంలో 2/3వ వంతు వ్యవసాయ రంగం నుంచే వచ్చింది. భారతదేశంలో ప్రణాళికలు ప్రారంభమైన తరవాత, ద్వితీయ, తృతీయ రంగాలు అభివృద్ధి చెందడంవల్ల వ్యవసాయ రంగం వాటా తగ్గింది. 1950-51లో స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం, దాని అనుబంధ రంగాల వాటా 56.5 శాతంగా ఉంటే 2000-01 నాటికి ఇది 24.7 శాతానికి తగ్గింది. అలాగే 2012-13 నాటికి బాగా తగ్గి 13.9% కి చేరింది.

వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు జోడించిన స్థూల విలువ 2014-15 సం||లో రూ.20.94 లక్షల కోట్లు ఉండగా 2019-20 సం॥ నాటికి రూ.30.47 లక్షల కోట్లకు పెరిగింది. జోడించిన స్థూల విలువలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వాటా 2014-15 సం॥లో 18.2 శాతం ఉండగా 2019-20 సం॥ నాటికి 16.5 శాతంకు తగ్గినది. జోడించిన స్థూల విలువలో వ్యవసాయ ఉత్పత్తుల వాటా 2014-15 సం॥లో 11.2 శాతం ఉండగా 2017-18 సం॥ నాటికి 10 శాతంకు తగ్గినది.

అదే కాలంలో పశుసంపద వాటా 4.4 శాతం నుండి 4.9 శాతానికి పెరగగా అటవీ ఉత్పత్తుల వాటా 1.5 శాతం నుండి 1.2 శాతంకు తగ్గింది. అయితే మత్స్య సంపద వాటా 1.0 శాతం నుండి 1.1 శాతంకు స్వల్పంగా పెరిగినది. అమెరికా, బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ రంగం నుంచి స్థూల దేశీయ ఉత్పత్తికి 2% మాత్రమే వస్తుంది.

2. ఉద్యోగితను కల్పిస్తుంది :
1951లో 98 మిలియన్లు మంది ప్రజలు వ్యవసాయ రంగంలో పనిచేస్తే 2001 నాటికి ఈ సంఖ్య 235 మిలియన్లకు పెరిగింది. శాతం రూపంలో చెప్తే 1951లో 70 శాతం మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తే 2001 నాటికి 59 శాతానికి తగ్గింది. 2008-2011 మధ్య కాలంలో వ్యవసాయం 46 శాతం పురుష శ్రామికులకు, 60 శాతం శ్రామికులకు ఉద్యోగితను కల్పించింది.

మొత్తం మీద భారతదేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడిన ప్రజలు 2011 సం॥లో 49 శాతం ఉండగా 2019 సం॥లో 43 శాతం ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న శ్రామికులు శాతం చాలా తక్కువ. బ్రిటన్, అమెరికాలో 2 శాతం నుంచి 3 శాతం, ఫ్రాన్స్లో 7 శాతం, ఆస్ట్రేలియాలో 6 శాతం శ్రామికులు వ్యవసాయ రంగం పై ఆధారపడి జీవిస్తున్నారు.

3. పరిశ్రమలకు ముడిపదార్థాలను అందిస్తుంది :
వివిధ ముందంజ పరిశ్రమలకు వ్యవసాయ రంగం ముడిపదార్థాలను అందిస్తుంది. పంచదార, జనపనార, వస్త్ర పరిశ్రమ, వనస్పతి, పిండి మరలు, పండ్ల తోటలు, ఆహార తయారీ పరిశ్రమలు వ్యవసాయ రంగంపై ప్రత్యక్షంగా ఆధారపడ్డాయి. పరోక్షంగా చాలా పరిశ్రమలు వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్నాయి. చాలా చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు వాటికి కావలసిన ముడి సరుకుల కోసం వ్యవసాయ రంగంపైన ఆధారపడుతున్నాయి.

4. పారిశ్రామిక వస్తువులకు గిరాకీ :
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో అధిక జనాభా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నందువల్ల పెరిగే గ్రామీణ కొనుగోలు శక్తి పారిశ్రామిక అభివృద్ధికి ప్రేరేపకంగా ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తిని, ఉత్పాదకతను విస్తరించడానికి చర్యలను తీసుకుంటే గ్రామీణ రంగంలో ఆదాయం పెరుగుతుంది.

కాబట్టి పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండు పెరిగి పారిశ్రామిక అభివృద్ధి ప్రక్రియకు మద్దతు లభిస్తుంది. గ్రామీణుల సంపదను పరిశ్రమల సంపదగా పరిగణిస్తారు. అల్ప ధరలు, మధ్య రకం ధరలు ఉన్న వినియోగ వస్తువులకు గ్రామాలు పెద్ద మార్కెట్గా ఉన్నాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

5. మూలధన సమీకరణం :
మూలధన సమీకరణ రేటు పెరిగినంత వరకు ఉన్నత స్థాయి ఆర్థికాభివృద్ధిని సాధించే వీలు కాదు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయం అతి పెద్ద పరిశ్రమ కాబట్టి మూలధన సమీకరణ రేటును పెంచడంలో వ్యవసాయ రంగం ప్రముఖ పాత్రను పోషిస్తుంది. ఇది జరిగినట్లయితే, ఆర్థికాభివృద్ధి ప్రక్రియ పూర్తిగా నష్టపోతుంది. గణనీయంగా వ్యవసాయ ఉత్పాదకత పెరగడంపై వ్యవసాయ రంగంలో మిగులు సృష్టి ఆధారపడుతుంది.

6. ఆహార భద్రతను కల్పించడం, పేదరికాన్ని తగ్గించడం :
శ్రామికులు మిగులు దేశాలలో జనాభా తాకిడి అధికంగా ఉండటమేగాక, ఇది వేగంగా పెరగడం వల్ల ఆహారానికి డిమాండ్ వేగవంతమైన రేటులో పెరుగుతుంది. ఈ దేశాలలో ఉన్న అల్పస్థాయి ఆహార వినియోగం, తలసరి ఆదాయంలోని అల్ప పెరుగుదల వల్ల ఆహారానికి డిమాండ్ వేగంగా పెరుగుతుంది. అందుకే ఆహార ధాన్యాల మిగులు పెరుగుదల తప్పనిసరి అవుతుంది.

7. అంతర్జాతీయ వర్తకంలో వ్యవసాయ రంగం ప్రాధాన్యత :
భారతదేశం ఎగుమతుల్లో టీ, చక్కెర, నూనెగింజలు, పొగాకు, సుగంధ ద్రవ్యాలు మొదలైన వ్యవసాయ ఉత్పత్తులు ప్రధానమైనవి. మొత్తం ఎగుమతుల్లో వ్యవసాయ వస్తువుల ఎగుమతుల అనుపాతం 50%, వ్యవసాయ అంశాలతో కూడుకొన్న ఎగుమతుల అనుపాతం మరొక 20% ఉన్నాయి.

ఈ విధంగా 1950- 51లో మొత్తం ఎగుమతుల్లో 70 శాతం వ్యవసాయ ఎగుమతులుండేవి. 1960-61లో మొత్తం ఎగుమతుల్లో వ్యవసాయ ఎగుమతుల వాటా 44.27% ఉంటే, 2010-11లో ఇది 9.9 శాతానికి పడిపోయినట్లు పట్టిక తెలుపుతుంది. అయితే 2012-13లో ఈ వాటి 13.5 శాతానికి పెరిగింది. కొన్ని సంవత్సరాలలో ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితుల వల్ల ఆహార ధాన్యాలను, పాల ఉత్పత్తులను భారతదేశం దిగుమతి చేసుకుంది.

పట్టిక : మొత్తం ఎగుమతులలో ఎగుమతుల శాతం (రూ.లు కోట్లలో)

సంవత్సరం వ్యవసాయ ఎగుమతులు మొత్తం ఎగుమతులు మొత్తం ఎగుమతులలో వ్యవసాయ ఎగుమతుల శాతం
1960 – 1961 284 642 44.2
1970 – 1971 487 1535 31.7
1980 – 1981 2057 9711 30.7
1990 – 1991 6317 32553 19.4
2000 – 2001 28582 203571 14.0
2010 – 2011 1131116 1142649 9.9

ఆధారం : GOI (2009), Economic Survey, 2008-09; Economic Survery, 2011-12

8) ఆర్థిక ప్రణాళికలలో, ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర :
భారత రవాణా వ్యవస్థకు, బాంకింగ్కు వ్యవసాయ రంగం ముఖ్యంగా మద్దతును ఇస్తుంది. అంతర్గత వర్తకం ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల వల్లనే ఉంది. పంటలు బాగా పండాయా లేదా దెబ్బ తిన్నాయా అనే దాని ప్రభావం ఆర్థిక ప్రణాళికల పైనా, ఆర్థికాభివృద్ధిపైనా ఉంటుంది.

జీవ వైవిధ్య సంతులితను కొనసాగించడానికి, వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాలలో సుస్థిర, సంతులిత అభివృద్ధి. ఆవశ్యకత ఉంది. “దేశంలో త్వరిత ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ అభివృద్ధి మూలం” అని పదవ పంచవర్ష ప్రణాళిక స్పష్టం చేసింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

ప్రశ్న 2.
వ్యవసాయ రంగంలో తక్కువ ఉత్పాదకతకు గల కారణాలను విశదీకరించండి.
జవాబు.
మనదేశంలో వ్యవసాయరంగంలో అల్ప ఉత్పాదకతకు అనేక కారణాలున్నాయి. అవి :

  1. సాధారణ కారణాలు
  2. సంస్థాగత కారణాలు
  3. సాంకేతిక కారణాలు.

1. సాధారణ కారణాలు :
i) సాంఘిక వాతావరణం :
వ్యవసాయ అభివృద్ధికి గ్రామీణ ప్రాంతాల్లోని సాంఘిక వాతావరణం అవరోధంగా ఉంది. నూతన వ్యవసాయ పద్ధతులకు రైతులు ప్రత్యుత్తరమివ్వరు. అయినా కూడా భారతీయ రైతులు వారి పరిమితులకు లోబడి వారి వనరులను సమర్థవంతంగా వాడుతున్నారు.

ii) భూమిపైన జనాభా ఒత్తిడి :
భూమిపైన జనాభా ఒత్తిడి అధికంగా వుంది. 2011లో 349 మిలియన్ల గ్రామీణ శ్రామికులలో 263 మిలియన్ల శ్రామికులకు వ్యవసాయ రంగంలోనే పనిని కల్పించడం జరిగింది. భూకమతాల విభజనకు, విఘటనకు భూమిపైన పెరిగే జనాభా ఒత్తిడి కొంతమేరకు కారణమని చెప్పవచ్చు. చిన్న, లాభకరం కాని భూకమతాలలో ఉత్పాదకత తక్కువగా వుంది.

iii) భూమి క్షీణించడం :
దేశంలోని 329 మిలియన్ల హెక్టార్లు భూమిలో సుమారు సగం భూమిలో భూసారం క్షీణించింది. 43% భూమిలో చాలా ఎక్కువగా భూసారం క్షీణించినందువల్ల 33-67 వరకు దిగుబడి నష్టం జరుగుతుంది. 5% భూమి ఉపయోగించే స్థితిలో లేదు. ఈ కారణంగా అంత ఎక్కువగా నష్టం జరిగింది. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో వ్యవసాయ దిగుబడి తక్కువగా వుండటానికి ముఖ్యకారణం భూసారం క్షీణించడమే.

iv) అవస్థాపనా సౌకర్యాల కొరత:
రోడ్లు, కమ్యూనికేషన్లు, మార్కెటింగ్, పరపతి, విద్యుచ్ఛక్తి మురుగునీటి పారుదల లాంటి అవస్థాపనా సౌకర్యాలు కొరతగా వున్నందువల్ల వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా వుంది.

2. సంస్థాగత కారణాలు :
i) భూమి కౌలు విధానం :
ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచడానికి రైతులకున్న సామార్థ్యాన్ని, ఇష్టతను, ఉత్సాహాన్ని, బాగా దోపిడీ చేసే జమిందారీ వ్యవస్థ తగ్గించింది. కౌలు చట్టం, కౌలు భద్రత,

ii) కమతాల పరిమాణం:
భారతదేశంలో భూకమతాల సగటు పరిమాణం చాలా తక్కువగా ఉంది. 2010-2011లో 85% భూకమతాల పరిమాణం 2 ఎకరాలకంటే తక్కువగా వుంది. లాభకరం కాని భూకమతాలు వుండటం వల్ల వ్యవసాయ దిగుబడి తక్కువగా వుంది.

iii) ఉద్యమిత్వం లేకపోవడం :
వ్యవసాయరంగంలోని వ్యవసాయ కార్యకలాపాలలోని ఉద్యమిత్వం, పోటీతత్వం లేవు. అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ రంగంలో కూడా ఉద్యమిత్వం విధానం వుంది.

iv) పెట్టుబడి తక్కువగా వుండటం :
వ్యవసాయరంగంలో ఇది మరొక సమస్య. గ్రామీణ అవస్థాపనలోని ముఖ్య అంశాలలో పెట్టుబడిని కేంద్ర గణాంక సంస్థ పరిగణలోకి తీసుకోలేదు. విద్యుద్దీకరణ, రోడ్ల అభివృద్ధి, గిడ్డంగులు, టెలికమ్యూనికేషన్లో పెట్టుబడులు మొదలైన వాటిని మినహాయించారు.

3. సాంకేతిక కారణాలు :
i) అల్ప ఉత్పత్తి పద్ధతులు :
భారతీయ రైతులలో ఎక్కువ మంది సంప్రదాయ ఉత్పత్తి పద్ధతులను వాడుతున్నారు. ఎరువులను, నూతన అధిక దిగుబడిని ఇచ్చే రకాల విత్తనాలను ఉపయోగించడం కూడా పరిమితంగానే వుంది. ఆధునిక ఉత్పాదకాల లభ్యత పరిమితంగా వుండటమే కాక వాటి వ్యయం ఎక్కువగా వుంది. అందుకే ఉత్పాదకత తక్కువగా వుంది. కోతల అనంతరం వాడే సాంకేతిక జ్ఞానం కూడా పరిమితంగానే ఉండటమేకాక నాణ్యత లేకపోవడం కూడా సమస్యగానే ఉంది.

ii) నీటిపారుదల సౌకర్యాల కొరత:
ఉత్పాదకాలలో ముఖ్యమైనది నీటిపారుదల సౌకర్యం. భారతదేశంలో 2010-11లో మొత్తం పంటవిస్తీర్ణం 199 మిలియన్ల హెక్టార్లయితే ఇందులో 89 మిలియన్ల హెక్టార్ల భూమికే నీటిపారుదల సౌకర్యం వుంది. అంటే పంట విస్తీర్ణంలో 45% భూమికి నీటిపారుదల సౌకర్యం వుంది. నీటిపారుదల సౌకర్యాలు లేక పూర్తిగా వర్షాలపై ఆధారపడుతున్న అన్ని ప్రాంతాలలో ఉత్పాదకత తక్కువగా వుంది.

iii) పర్యావరణ కారకాలు :
భూసార క్షీణత ఎక్కువగా వుండటం, వర్షపాతం ఎక్కువ కావడం వల్ల భూమికి జరిగే నష్టం, వరదలు, అడవులు క్షీణించడం, అధిక నీటి నిల్వలు, మురుగు నీటి పారుదల సౌకర్యం లేకపోవడం, కరువు ‘మోతాదు’ను మించి రసాయన ఎరువులను వాడటం, గాలి కాలుష్యాలు ఇవన్నీ కూడా వ్యవసాయ రంగాల్లో అల్ప ఉత్పాదకతకు దోహదపడుతున్నాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

ప్రశ్న 3.
భారతదేశ భూ సంస్కరణల ప్రధానాంశాలు వ్రాయండి.
జవాబు.
భూ సంస్కరణలు-అర్థం:
భూమిలేని గ్రామీణ కుటుంబాలు చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలను పరిరక్షించటానికి భూసంస్కరణలు భూపునః పంపిణీకి సహాయపడతాయి. వ్యవసాయ అభివృద్ధితోపాటు ఆర్థిక, ఆర్థికేతర మార్పులను భూ సంస్కరణల ద్వారా ప్రవేశపెడతారు.

ప్రత్యక్షంగా ప్రభుత్వం వ్యవసాయ రంగంలో జోక్యం చేసుకొని వ్యవసాయ నిర్మాణంలో మార్పులను తీసుకొని రావడాన్ని “భూ సంస్కరణలు” అంటారు. సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదిక మీద గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునః నిర్మాణం కోసం భారత ప్రభుత్వ స్వాతంత్య్రానంతరం భూ సంస్కరణలను ప్రవేశపెట్టింది.

భూ సంస్కరణలలో ప్రధాన అంతర్భాగాలు.

  1. మధ్య వర్తుల తొలగింపు
  2. కౌలు సంస్కరణలు.
  3. భూ కమతాలపై గరిష్ట పరిమితి విధించడం.

భూ సంస్కరణల అమలుకు ప్రభుత్వ చర్యలు :
1. మధ్యవర్తుల తొలగింపు: ‘శాశ్వత శిస్తు వసూలు చట్టం’ ద్వారా బ్రిటీష్ ప్రభుత్వం జమిందారీ పద్ధతిని ప్రవేశపెట్టింది. జమిందారులు, జాగీర్దారులు, ఇనాందారులు వంటి మధ్యవర్తుల ఆధీనంలో పెద్ద మొత్తంలో భూకమతాలు ఉండేవి. వ్యవసాయదారుల నుంచి భాటకాన్ని (rent) వీరు వసూలు చేసేవారు.

ఈ మధ్యవర్తులు బ్రిటీష్ ప్రభుత్వానికి స్థిరమైన రేటులో భూమి శిస్తును చెల్లించి వ్యవసాయదారుల నుంచి అధిక మొత్తంలో భాటకాన్ని వసూలు చేసేవారు, నిజానికి జమిందారులు లేదా మధ్యవర్తులు అనుపస్థిత భూస్వాములుగా ఉంటూ, భూమిని అభివృద్ధి చేయడం వల్ల విముఖంగా ఉండేవారు.

2. కౌలు సంస్కరణలు :
కౌలుదారు కౌలు చెల్లించే షరతుపై భూ యజమాని నుంచి భూమిని నిర్ణీత కాలానికి లీజుకు తీసుకొని సేద్యం చేస్తాడు. కౌలుదారుని భూ యజమాన్యం హక్కులేని వాస్తవ వ్యవసాయదారునిగా చెప్పవచ్చు. ఒప్పందం ప్రకారం నిర్దిష్ట పద్ధతిలో భాటకాన్ని చెల్లిస్తాడు.

కౌలుదారులను భూస్వాముల నుంచి రక్షించడానికి ప్రభుత్వం కింది చర్యలను ప్రవేశపెట్టింది.

ఎ) కౌలు పరిమాణాన్ని క్రమబద్దం చేయడం :
కౌలుదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం కౌలు పరిమాణాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. మొదటి పంచవర్ష ప్రణాళికలో గరిష్ఠకౌలు పరిమాణం మొత్తం ఉత్పత్తిలో 1/4 లేదా 1/5వ వంతు మాత్రమే ఉండాలని నిర్ణయించబడింది. ఈ విధంగా ఎప్పటికప్పుడు కౌలు పరిమాణాన్ని పెంచే అవకాశం తొలగించబడి కౌలుదారులకు రక్షణ కల్పించబడింది.

హైదరాబాదు రాష్ట్రంలో అమలులో ఉన్న ‘కౌలుదారు రక్షణ చట్టం’ కౌలుదారులను తొలగించడానికి గల అవకాశాలను రద్దు చేయడంతోపాటు యజమాని నుంచి భూమి కొనుగోలు చేయగల హక్కులను వారికి కల్పించింది. ఈ చట్టం దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ప్రగతిశీల చట్టాలలో ఒకటిగా కొనియాడబడింది.

బి) కౌలుదారులకు భద్రతను కల్పించడం :
వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కౌలుదారులను తరుచుగా తొలగించకుండా చట్టం ద్వారా భద్రతను కల్పించింది.

  • భూస్వాములు తమ ఇష్టానుసారంగా కౌలుదారులను తొలగించలేదు.
  • స్వంత వ్యవసాయం కోసం మాత్రమే భూస్వాములు కౌలుదారు నుంచి భూమిని తీసుకోవచ్చు.
  • భూస్వామి స్వంత వ్యవసాయానికి భూమి తీసుకొనే సమయంలో భూమిలో కొంత భాగాన్ని కౌలుదారు ఆధీనంలో ఉంచవలసి ఉంటుంది.

సి) యాజమాన్యపు హక్కులు:
కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కౌలుదారులకు హక్కులను కల్పించడానికి చట్టాలను రూపొందించాయి. ఈ చర్య ఎంతో ప్రశంసనీయమైనదైనా దీని ద్వారా సాధించిన ఫలితాలు అంత సంతృప్తికరంగా లేవు.

3. భూకమతాలపై గరిష్ఠ పరిమితి :

1. కమతాల సమీకరణ :
భారతదేశంలో చిన్న కమతాలు, కమతాలు విఘటన (Fragmentation of land holdings) సర్వసాధారణం, ఈ విధమైన లాభసాటికాని కమతాలు (Uneconomic holdings) మెరుగైన వ్యవసాయ పద్ధతులకు అనువుగా ఉండవు. చిన్న కమతాలు, కమతాల విఘటన సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కమతాల సమీకరణను ప్రోత్సహించింది.

ఈ సంస్కరణలో భాగంగా పంజాబ్, హర్యానా, మహారాష్ట్రలలో లాభసాటి కమతాలు గణనీయమైన సంఖ్యలో చిన్న, విఘటన చెందిన కమతాలు యజమానులకు అందించబడ్డాయి. 2001 సెప్టెంబరు నాటికి 1,633 లక్షల ఎకరాల భూమి మాత్రమే సమీకరించబడింది. చాలా రాష్ట్రలలో వ్యవసాయదారులు సమీకరణ కార్యక్రమానికి సహకరించకపోవడం వల్ల సమీకరణ మందకొడిగా సాగింది.

2. సహకార వ్యవసాయం :
ఇది ఒక సంస్కరణ కాదు. ఐచ్ఛిక స్ఫూర్తిపై ఈ విధానం ఆధారపడుతుంది. ఒక ప్రాంతంలోని వ్యవసాయదారులు తమ చిన్న చిన్న కమతాలను ఏక కమతంగా కలిపి సహకార వ్యవసాయ క్షేత్రంగా రూపొందిస్తారు. ఎంపిక కాబడిన సభ్యులచే సహకార వ్యవసాయ క్షేత్రం నిర్వహించబడుతుంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

ప్రశ్న 4.
భారతదేశంలో ఆహార ధాన్యాలు స్వయం సమృద్ధిని, ఆహార భద్రతను గురించి వివరించండి.
జవాబు.
ప్రపంచ ఆహార భద్రతపై నివేదికను అందజేసిన ఐక్యరాజ్య సమితి కమిటీ ప్రకారం, ప్రజలందరికి అన్ని కాలాలలో చురుకైన, ఆరోగ్యవంతమైన జీవనానికి తమ అభిరుచి మరియు ఆహారపు అలవాట్ల ప్రకారం తగినంత సురక్షితమైన, పౌష్టికాహారం భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా అందుబాటులో ఉండటాన్ని ఆహార భద్రత అంటారు.

భారతదేశంలో ఆహార స్వయం – సమృద్ధి, ఆహార భద్రత :
ప్రణాళికా కాలం ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశపు ప్రణాళికావేత్తలు ప్రణాళికీకరణలో ఆహార ధాన్యాలలో స్వయం సమృద్ధిని సాధించాలనేది అన్ని లక్ష్యాలలో ఒక ముఖ్యమైన లక్ష్యంగా ఉంటుందని తెలుసుకున్నారు.

1965, 1966 సంవత్సరాలలో భారతదేశం తీవ్రమైన కరువు పరిస్థితులను చవిచూచినప్పుడు అమెరికా అధ్యక్షుడు Lyndon Johnson, P.L. 480 పథకంలో నెలవారి ప్రాతిపదికన ఆహార సహాయాన్ని పరిమితం చేశాడు. ఆ తదుపరి కాలంలో ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలో భారత ప్రభుత్వం “విత్తనం – నీరు-ఎరువు” (seed-water-fertilizer) విధానాన్ని అవలంబించింది. ఈ విధానాన్నే “హరిత విప్లవం” అని అంటారు.

ఈ విధానం అవలంబించడం వల్ల భారతదేశ ఆహారోత్పత్తిలో విప్లవాన్ని సాధించడమే కాకుండా దాదాపుగా ఆహారోత్పత్తుల దిగుమతులకు స్వస్తి పలికింది. 1976 వ సంవత్సరం నాటికి భారతదేశం ఆహారోత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధిని సాధించింది. అప్పటి నుండి భారతదేశ ఆహార పదార్థాల దిగుమతులు ఉపేక్షింపదగినవిగా ఉన్నాయి. 1950-51 సం॥లో 30 మిలియన్ టన్నులున్న ఆహార ధాన్యాల ఉత్పత్తి 2018 19 సం॥నాటికి 285 మిలియన్ టన్నులకు చేరింది.

భారతదేశం ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించినప్పటికీ, సురేశ్ డి. టెండూల్కర్ అధ్యక్షతన ఎక్స్పర్ట్ గ్రూప్ చేసిన అధ్యయనం ప్రకారం భారతదేశంలో 2011-12 సం॥లో మొత్తం మీద 21.9 శాతం, గ్రామాలలో 25.7 శాతం, పట్టణాలలో 13.7 శాతం ప్రజలు పేదరికం రేఖకు దిగువన నివసిస్తుంటే, 2014 సం||లో డాక్టర్ సి. రంగరాజన్ అధ్యక్షతన నియమింపబడిన ఎక్స్పర్ట్ గ్రూప్ ప్రకారం 2009-10 సం॥లో 38.2 శాతం ప్రజలు (454 మిలియన్లు), 2011-12 సం|| లో 29.5 శాతం ప్రజలు (363 మిలియన్లు) పేదరికం రేఖకు దిగువన నివసించారు.

అంటే ఆహార ధాన్యాలు భౌతికంగా దేశంలో అందుబాటులో ఉన్నా ప్రజలు వాటిని కొనగలిగే ఆర్థిక స్తోమతను కల్గిలేరు. ఎందుకంటే ప్రజలకున్న అల్ప ఆదాయాల వల్ల వారికి అల్ప కొనుగోలు శక్తి ఉండటమే కారణం.

ప్రశ్న 5.
భారతదేశంలో నూతన వ్యవసాయక వ్యూహం ప్రభావాన్ని అంచనా వేయండి.
జవాబు.
భారతదేశంలో హరిత విప్లవం, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం :
అధిక దిగుబడినిచ్చే వంగడాలు, రసాయన ఎరువులు లాంటి ఆధునిక ఉత్పాదకాల సహాయంతో 1960-1970 మధ్యలో వ్యవసాయ ఉత్పాదకత, ఉత్పత్తిలో సాధించిన పెరుగుదలను హరిత విప్లవం అన్నారు. వ్యవసాయ రంగంలో వచ్చిన నూతన సాంకేతిక మార్పులను సూచిస్తూ విలియం ఎస్. గౌడ్ (william S.Gaud) మొదటిసారిగా ‘హరిత విప్లవం’ అనే పదంను 1968లో ఉపయోగించారు.

నూతన వంగడాల ఉత్పత్తిలో చేసిన కృషి వలన ప్రఖ్యాత అమెరికన్ వ్యవసాయ ఆర్థిక వేత్త మరియు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ను ఈ రంగంలో ముందుగా కృషి చేసిన వ్యక్తిగా, ‘హరిత విప్లవ పితామహుడు’ గా గుర్తించడం జరిగింది.

భారతదేశ ఆర్థిక వ్యవస్థపై నూతన వ్యవసాయిక వ్యూహం / అధిక దిగుబడినిచ్చే వంగడాల కార్యక్రమం ప్రభావం :
నూతన వ్యవసాయిక వ్యూహం లేదా అధిక దిగుబడి నిచ్చే వంగడాల కార్యక్రమం అంతిమ ఫలితం హరిత విప్లవం. అయితే ఈ ప్రక్రియ ఇతర ప్రభావాలను కూడా క్రింది విధంగా విశ్లేషించవచ్చు.

i) వ్యవసాయ ఉత్పాదకత మరియు ఉత్పత్తిలో పెరుగుదల :
నూతన వ్యవసాయిక వ్యూహంలో భాగంగా ఆధునిక వ్యవసాయ ఉత్పాదకాలను వాడడం వల్ల భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత, ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల వచ్చింది.

దీనినే హరిత విప్లవం అంటాం. వివిధ ప్రధాన పంటల ఉత్పాదకత, ఉత్పత్తిలో వచ్చిన మార్పును మనం పట్టిక 5.3లో చూశాము. 1966-67 సం||లో నూతన వ్యవసాయిక వ్యూహం ఆరంభం కాగా పది సం॥రాల కాలంలో అంటే 1976 సం॥ నాటికి భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించింది.

ii) ఉద్యోగిత :
నూతన వ్యవసాయ వ్యూహం అమలు పంట భూముల విస్తీర్ణంలో, ఆహార పదార్థాల ఉత్పత్తిలో, వ్యవసాయ ఉత్పాదకతలో చెప్పుకోదగ్గ పెరుగుదలకు దారితీసింది. హరిత విప్లవం వ్యవసాయ రంగంలో బహుళ పంటలను ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగ అవకాశాలను విస్తరింపజేసింది.

అధిక శ్రమ సాంద్రతతో కూడుకొన్న పంటలైన వరి, చెరకు, బంగాళాదుంపలు, కూరగాయలు, పండ్లు వంటివి వ్యవసాయ రంగంలో ఉద్యోగ అవకాశాలను పెంచాయి. వ్యవసాయ ఉత్పత్తుల చిల్లర వర్తకం ఒక పెద్ద వ్యాపారంగా రూపుదాల్చింది.

iii) రైతుల ఆదాయాల్లో పెరుగుదల :
ప్రత్యేకించి కేరళ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని రైతుల ఆదాయాలు పెరగడానికి మంచి అవకాశాలు ఏర్పడ్డాయి. హరిత విప్లవం పొలాలలోనే పంటలను నాణ్యతా పరంగా క్రమబద్ధీకరించడం లాంటి శాస్త్రీయ, సాంకేతిక పరమైన సామాన్య పద్ధతులను రైతులు అనుసరించడానికి అవకాశాలను కల్పించింది.

మధ్యలో దళారీల ప్రమేయం లేకుండా నేరుగా రిటైల్ కంపెనీలకు అమ్ముకోవడం వల్ల కూడా రైతుల ఆదాయంలో పెరుగుదల ఏర్పడింది. ఎందుకంటే సంఘటిత రిటేలర్స్ మంచి గిట్టుబాటు ధరను రైతులకు ఇవ్వడం జరిగింది.

iv) ఎగుమతుల్లో పెరుగుదల :
భారతదేశం హరిత విప్లవంకు పూర్వం ఆహార ధాన్యాలను అధికంగా దిగుమతి చేసుకునేది. కాని హరిత విప్లవం తరువాత ఈ పరిస్థితి అరుదుగా ఉండటమే గాక వ్యవసాయ ఎగుమతులు బాగా పెరిగాయి. 1960-61 సం||లో వ్యవసాయ మరియు దాని సంబంధిత ఎగుమతులు విలువ రూ. 284 కోట్లు ఉండగా ఇది 2018-19 సం॥ నాటికి రూ.2.7 లక్షల కోట్లకు పెరిగింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

ప్రశ్న 6.
భారతదేశంలో వ్యవసాయ పరపతికి గల ఆధారాలను పరిశీలించండి.
జవాబు.
మనదేశంలో వ్యవసాయదారులకు అవసరమయ్యే వ్యవసాయ పరపతిని ఉత్పాదక, అనుత్పాదక రుణాల రూపంగా విభజించవచ్చు. విత్తనాలు, ఎరువులు, పశువులు, వ్యవసాయ పనిముట్ల కొనుగోలు, బావులు లేదా గొట్టపు బావుల త్రవ్వకం వంటి వాటి కోసం ఉత్పాదక రుణాలు అయితే, పెళ్ళిళ్ళు, సామాజిక వేడుకలు, మతపరమైన వేడుకలు, పండుగలు వంటి వాటిపై ఖర్చు చేసే అవసరాల కోసం అనుత్పాదక రుణాలు.

భారతదేశంలో వ్యవసాయదారులకు అందుబాటులో ఉన్న వ్యవసాయపరపతి ఆధారాలను రెండు రకాలుగా విభజించవచ్చు.

ఎ) సంస్థాపూర్వకం కాని ఆధారాలు :
సంస్థాపూర్వకం కాని ఆధారాల్లో వడ్డీ వ్యాపారులు, భూస్వాములు, వ్యాపారస్థులు, కమీషన్ ఏంజెట్లు, బంధువులు, మిత్రులు మొదలైనవారు వ్యవసాయ పరపతి కల్పనలో ప్రధాన భూమికను నిర్వహిస్తారు. 1951-52లో వ్యవసాయ పరపతి కల్పనలో సంస్థాపూర్వకం కాని మార్గంలో వ్యవసాయదారులు 93 శాతం రుణాన్ని పొందితే ప్రభుత్వం కేవలం 7 శాతం పరపతిని సమకూర్చింది.

బి) సంస్థాపూర్వకమైన ఆధారాలు :
సంస్థాగతం కాని వ్యవసాయపరపతి కల్పనలో అనేక లోపాలుండటం వల్ల వ్యవసాయదారులు దోపిడికి గురవుతున్నందువల్ల ప్రభుత్వ పరంగా సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు వంటి బహుళ ఏజెన్సీలను ప్రోత్సహించింది. వీటి ద్వారా రైతులకు పరపతిని చౌకగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం తలపెట్టింది.

i) సహకార సంఘాలు :
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను రుణగ్రస్థత నుంచి విముక్తి చేసే లక్ష్యంతో 1904 సంవత్సరంలోనే ప్రభుత్వం సహకార ఉద్యమాన్ని ప్రోత్సహించింది. ఈ లక్ష్య సాధన దిశగా సహకార సంఘాలు స్థాపించబడ్డాయి. భారతదేశంలో స్వల్పకాల, మధ్య, దీర్ఘకాల రుణ కల్పన దృష్టా వివిధ స్థాయిల్లో స్థాపించబడ్డాయి.

రైతులకు స్వల్పకాలిక రుణాలను అందించే సంస్థలు మూడు స్థాయిల్లో ప్రవేశపెట్టబడ్డాయి. మొదటిస్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (PACS) గ్రామ స్థాయిలో ప్రవేశపెట్టబడ్డాయి. రెండవ స్థాయి అయిన జిల్లా స్థాయిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (DCCB) స్థాపించబడ్డాయి. మూడవ స్థాయి అయిన రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార బ్యాంకులు (SCB) నెలకొల్పబడ్డాయి. స్వల్ప, మధ్యకాలిక రుణాల కల్పనలో PACs, DCCB లను సమన్వయ పరచడంలో SCB ప్రధాన పాత్రను పోషిస్తుంది.

ii) వాణిజ్య బ్యాంకులు :
1950లో వాణిజ్య బ్యాంకులు అందించిన వ్యవసాయ పరపతి నామమాత్రమేనని చెప్పాలి. 1951-52లో వాణిజ్య బ్యాంకులు అందించిన పరపతి మొత్తం వ్యవసాయ పరపతిలో 0.9 శాతం అయితే, అది 1960-61లో 0.7 శాతం మాత్రమే. 1969లో ఇవి అందజేసిన రుణాలు 162 కోట్ల, రుపాయలు, జాతీయీకరణ అనంతరం 1969 నుంచి 1980 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో వాణిజ్య బ్యాంకుల శాఖలు పెద్ద మొత్తంలో పెరగడమే కాకుండా అవి అందజేసిన రుణాలు కూడా గణనీయంగా పెరిగాయి.

మార్చి 31,2013 నాటికి ఇవి అందజేసిన రుణాలు 5,30,600 కోట్ల రూపాయలు. అయితే, మార్చి 31,2013 నాటికి ప్రైవేటు బ్యాంకులు అందించిన రుణం 1,11,900 కోట్ల రూపాయలు. ప్రభుత్వరంగ ప్రైవేట్ రంగ బ్యాంకులు కలిపి మొత్తం వ్యవసాయ పరపతిలో 71.2 శాతం సంస్థాగత రుణాలను అందించాయి.

iii) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు :
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పరపతి డిమాండ్, సప్లయ్ గల వ్యత్యాసాన్ని సహకార సంఘాలు సర్దుబాటు చేయలేకపోవడం వల్ల దీని నివారణ కోసం శ్రీ ఎం. నరసింహం అధ్యక్షతన నియమించిన గ్రామీణ బ్యాంకుల వర్కింగ్ గ్రూప్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల స్థాపనను సిఫారసు చేసింది.

చిన్న, ఉపాంత రైతులు, భూమిలేని శ్రామికులు, కుల వృత్తులు, చిల్లర వ్యాపారం చేసే ఉద్యమదారులకు అవసరమయ్యే గ్రామీణ పరపతికి సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకులు అందించే పరపతికి మధ్యగల వ్యత్యాసాన్ని తగ్గించే లక్ష్యంగా RRB లను స్థాపించాలని ఈ గ్రూప్ పేర్కొన్నది. ఈ సిఫారసులకు అనుగుణంగా అక్టోబర్ 2, 1975లో మొదటి 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్థాపించబడ్డాయి. 2012-13 సంవత్సరం నాటికి ఈ బ్యాంకులు సంస్థాగత వ్యవసాయ పరపతిలో 10.5 శాతం రుణ సదుపాయం కల్పించాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

ప్రశ్న 7.
వ్యవసాయ మార్కెటింగ్ లోపాలు ఏమిటి ? వ్యవసాయ మార్కెటింగ్ లోపాలను అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించండి.
జవాబు.
భారత దేశంలో వ్యవసాయ మార్కెటింగ్ :
జాతీయ వ్యవసాయ కమీషన్ ప్రకారం “అమ్ముడుపోదగిన వ్యవసాయ సరుకులను . ఉత్పత్తి చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో ప్రారంభమయి వ్యవస్థలోని మార్కెట్ నిర్మితికి చెందిన అన్ని అంశాలను కలుపుకొని పోయే ప్రక్రియనే వ్యవసాయ మార్కెటింగ్గా చెప్పవచ్చు.”

పంట కోతకు ముందు, తరువాత జరిగే కార్యకలాపాలన్నీ ఇందులోకి వస్తాయి. ఉత్పత్తులను కూడదీయడం, నాణ్యతను అనుసరించి విడదీయడం (గేడింగ్), నిలువ చేయడం, రవాణా చేయడం, పంపిణీ చేయడం లాంటి పనులన్నీ వ్యవసాయ మార్కెటింగ్ పరిధిలోకే వస్తాయి.

భారతదేశ వ్యవసాయ మార్కెటింగ్ లోని లోపాలు :
నిలువ సౌకర్యాలు తగినంత స్థాయిలో లేనందువల్ల, మార్కెట్లోని సప్లయి, డిమాండ్ పరిస్థితులతో నిమిత్తం లేకుండానే, పంటకోతల తర్వాత వెంటనే రైతులు తమ వ్యవసాయ మిగులును బలవంతంగా అమ్మవలసి వస్తుంది.

తగిన రవాణా సౌకర్యాలు లేక రైతులు వారి ఉత్పత్తిని స్థానిక వర్తకులకు, వడ్డీ వ్యాపారస్తులకు, కమీషన్ ఏజంట్లకు, మార్కెట్ ధరల కంటే తక్కువకే అమ్మవలసిన తప్పనిసరి పరిస్థితి ఉంది. స్థానిక సంతల్లో సరైన తూనికలు, కొలతలు ఉండనందువల్ల రైతులు మోసపోతున్నారు.

రైతులు బ్రోకర్ల, వ్యాపారుల మోసాలకు కూడా గురవుతున్నారు. రైతులు తూకపు చార్జీలు, సరుకు దించినందుకు చార్జీలు, ఉత్పత్తులను శుద్ధి చేసే ఖర్చులు, ఇతర అనేక నిర్వచించని, నిర్ణయింపబడని చార్జీలను చెల్లించాల్సి వస్తుంది. సరైన గ్రేడింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల రైతు తగిన ధరను పొందడం లేదు.

1. క్రమబద్ధమైన మార్కెట్లు:
వ్యవసాయ మార్కెటింగ్లో ఉన్న అనారోగ్య పరిస్థితులను తొలగించి రైతులకు లాభదాయకమయ్యే ధరలు పొందటానికి వీలుగా క్రమబద్ధ మార్కెట్ల స్థాపనకు ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల చట్టాన్ని రూపొందించింది. తదనుగుణంగా 1951లో దేశంలో 200 క్రమబద్ధ మార్కెట్లు నెలకొల్పబడ్డాయి. ప్రస్తుతం మనదేశంలో 7,246 క్రమబద్ధమైన మార్కెట్లు పనిచేస్తున్నాయి.

మార్కెట్ వ్యవస్థ నిర్మాణపు అభివృద్ధిలో క్రమబద్ధమైన మార్కెట్లను క్రింద పేర్కొన్న ఆశయాలతో రూపొందించడమైనది.

  • వ్యవసాయదారుల ఉత్పత్తులకు లాభదాయక ధరలు వచ్చేటట్లు చూడటం.
  • ఉత్పత్తిదారుడి నుంచి వినియోగదారుడి వరకు వస్తువుల ధరల్లో తేడాను తగ్గించటం.
  • వ్యాపారస్థులు, మధ్య దళారీల మోసపూరిత చర్యలను అరికట్టడం.

2. శ్రేణీకరణ, ప్రామాణీకరణ (Grading and Standardisation) :
వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి శ్రేణీకరణ, ప్రామాణీకరణ సౌకర్యాలను కల్పించనంతవరకు, వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి వీలుకాదు. అయితే, వ్యవసాయ ఉత్పత్తుల శ్రేణీకరణ, ప్రామాణీకరణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.

వ్యవసాయ ఉత్పత్తుల చట్టం 1937 ప్రకారం ప్రభుత్వం అనేక గ్రేడింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. వస్తువుల కన్నా మార్కెట్ను మరింత విస్తృత పరచడానికి వ్యవసాయ మార్కెటింగ్ విభాగం ద్వారా శ్రేణీకరణ చేసిన వస్తువులపైన AGMARK ను ముద్రిస్తున్నారు.

3. గిడ్డంగి సౌకర్యాలు :
రైతులు వారి వస్తూత్పత్తిని నిలువ ఉంచుకొని లాభదాయక ధరను పొందటానికి వీలుగా గ్రామాలు పట్టణాల్లో గిడ్డంగి సౌకర్యాలు విస్తరించబడ్డాయి. ఇందులో భాగంగా 1957లో కేంద్ర గిడ్డంగి కార్పోరేషన్ CWC స్థాపించబడింది. అలాగే వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర గిడ్డంగి కార్పోరేషన్లను SWC ఏర్పాటు చేయడమైంది. ఇంతేగాక జాతీయ స్థాయిలో భారత ఆహార సంస్థ (FCI) స్థాపించబడింది. జూన్, 2013 నాటికి భారతదేశంలో FCI లో 355 లక్షల టన్నులు నిలువ చేసుకొనే శక్తి ఉంది.

4. మార్కెట్ సమాచారం :
వివిధ మార్కెట్లలో వ్యవసాయ వస్తువులకు పలికిన ధరల సమాచారాన్ని రైతులకు చేరవేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఆకాశవాణి ప్రసారాల ద్వారా ఈ ధరలకు సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు రైతులకు చేరవేస్తోంది. ఆకాశవాణి, దూరదర్శన్ లు ప్రతి వారం మార్కెట్ ధరలపై సమీక్షలు నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 26-5- 2015న కిసాన్ ఛానల్ను ప్రారంభించింది.

5. మద్దతు ధరలు :
వ్యవసాయ మార్కెటింగ్లో రైతులు లాభదాయకమైన ధరలు పొందడానికి వీలుగా ప్రభుత్వం వివిధ వస్తువులకు సంబంధించి ‘కనీస మద్ధతు ధరల’ను ప్రకటిస్తుంది. వ్యవసాయ వస్తువుల వ్యయాలు, ధరల కమీషన్ Commis- sion for Agricultural Costs and Prices – CACP సిఫారసుల మేరకు ప్రభుత్వం ఈ ధరలను ప్రకటిస్తుంది.

6. ఇతర చర్యలు :
పై ప్రయత్నాలతోపాటు కింద వివరించిన చర్యలు చేపడితే వ్యవసాయ మార్కెటింగ్లోని లోపాలను తొలగించవచ్చు. అవి :

  1. రోడ్లు-సమాచార సంబంధాలను పెంచడం-అన్ని పల్లెలకు వీటిని అనుసంధానం చేయడం.
  2. బాంకులతోనూ-విత్తసంస్థలతోనూ అనుసంధానం చేయడం.
  3. ఫోన్లు, ఇంటర్ నెట్ కేబుల్ వగైరా ఎలక్ట్రానిక్ సదుపాయాలను అనుసంధానం చేయడం.
  4. క్రమబద్ధమైన మార్కెట్లు బయట వ్యవసాయ వస్తువుల అమ్మకాలను నిషేధించడం..
  5. రవాణా ఖర్చులను తగ్గించడం.
  6. రైతు బజార్లును ప్రోత్సహించడం.
  7. మార్కెట్లలో ప్రమాణీకరించిన తూనికలు, కొలతలు ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టడం.
  8. గ్రామాలు, గ్రామీణ ప్రాంతాల్లో గిడ్డంగి. సౌకర్యాలను పెంచడం.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

ప్రశ్న 8.
భారతదేశంలో గ్రామీణ రుణగ్రస్తతకు గల కారణాలను, వాటిని సరిదిద్దేందుకు తీసుకొనే చర్యలను పరిశీలించండి.
జవాబు.
గ్రామీణ ఋణగ్రస్తత :
భారతదేశంలో జనాభాలో 70 శాతంపైగా ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు. అయితే ఈ ప్రాంతాల్లోని పేద ప్రజలు తాము పొందిన రుణాల్లో ఎక్కువ మొత్తం ఏ రకమైన ఆదాయం ఇవ్వని అనుత్పాదక అవసరాలపై ఖర్చు చేస్తారు. అందువల్ల వీరు పాత ఋణాలను తీర్చలేక రుణగ్రస్తులవుతున్నారు. ఎప్పుడైతే వారికి సంస్థాపరమైన ఋణం తక్కువగా లభిస్తుందో లేదా పూర్తిగా లభించకపోతుందో అప్పుడు వారు దురాశాపరులైన వడ్డీ వ్యాపారుల వద్ద రుణం తీసుకొంటారు.

ఎందుకంటే వీరు అడిగిన వెంటనే అందుబాటులో ఉంటారు. పేదవారు వారి అవసరాల ఒత్తిడి దృష్ట్యా అధిక వడ్డీ రేట్లకు రుణం తీసుకొంటూ వడ్డీ వ్యాపారుల కంబంధ హస్తాల్లో వారి ఆస్తులను తాకట్టు పెట్టి వాటిని పోగొట్టుకొంటున్నారు. ఈ కారణాల వల్ల వారి ఋణగ్రస్తత రానురాను పెరిగిపోతూ శాశ్వతంగా వారు రుణగ్రస్తులుగా మారిపోతున్నారు.

రుణగ్రస్తతకు గల కారణాలు :
గ్రామీణ ప్రాంతాల్లో ఋణం పెరగడానికి కింది విషయాలు కారణభూతం అవుతున్నాయని చెప్పవచ్చు. అవి :

  1. గ్రామ ప్రాంతాల్లో రైతులు రుణగ్రస్తులుగా మారడానికి ప్రధాన కారణం వారి పేదరికం, తక్కువ స్థాయి పొదుపులు, పంట నష్టపోవడం.
  2. అప్పులు చేసి పొలాలను బాగుపరచి అభివృద్ధి చేయాలనే తపన.
  3. అనుత్పాదక పనులపై ఖర్చు పెట్టడం.
  4. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా అప్పులు సంక్రమించడం.
  5. సంస్థాగతం కాని ఋణాలపైన ఎక్కువగా ఆధారపడటం.
  6. పంటలకు మద్ధతు ధరలు తగినంతగా లేకపోవడం.
  7. సేద్యపు ఖర్చులు బాగా పెరిగిపోవడం.

గ్రామీణ ఋణగ్రస్తత తగ్గడానికి తీసుకోవలసిన చర్యలు :
గ్రామీణ ఋణగ్రస్తత, దానికున్న వివిధ రూపాలతోనూ, పరిమాణంతోనూ గ్రామీణ ప్రాంతాల్లో రకరకాల సమస్యలను సృష్టిస్తుంది. దారిద్ర్యాన్ని పెంచుతూ రైతులు దుర్భర జీవితం గడపడానికి కారణమవుతూ ఉంది. ఈ రుణగ్రస్తత వల్ల రైతులు తమ ఉత్పత్తులకు సరసమైన ధరలను పొందక ఆహార భద్రతను కోల్పోతున్నారు. కాబట్టి దీన్ని తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది.

కింద సూచించిన చర్యలు అమలు పరచగలిగితే ఋణగ్రస్తత తగ్గడానికి అవకాశం ఉంటుంది.

  1. చట్టాలను అమలుపరిచి పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఋణాలను వీలయినంత వరకు తగ్గించడం.
  2. గ్రామాల్లో వడ్డీ వ్యాపారుల ప్రాధాన్యత తగ్గించే దిశగా సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నెట్వర్క్స్ ను వేగవంతం చేయడం.
  3. సన్న, చిన్నకారు రైతులకు, గ్రామీణ వృత్తి కళాకారులకు తగిన సమయంలో తగినంత పరపతి మొత్తాన్ని అందించడం.
  4. గ్రామీణ పరపతి అవసరాలను గమనించి, వాటికి తగిన ప్రాధాన్యతను ఇచ్చి “ప్రాధాన్యతా రంగాల”కు (Priority sector) ఇచ్చే పరపతిని పెంచడం..
  5. బలహీన వర్గాలకు వాణిజ్య బ్యాంకులు వినియోగ వస్తువుల కొనుగోలుకు రుణం ఇచ్చేటట్లు చూడటం.
  6. పొలాలను సంస్థాగతం కాని వడ్డీ వ్యాపారులకు అమ్మడాన్ని, కుదువ పెట్టడాన్ని నిషేధించడం.
  7. అప్పులను ఒకే విడతలో చెల్లిస్తే ఇచ్చే తగ్గింపును పెంచడం.
  8. సూక్ష్మ రుణాల పథకం కింద మహిళా రైతులకు రుణాలను ఇవ్వడం, పెంచడం.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

ప్రశ్న 9.
వ్యవసాయ ధరల విధాన ప్రధాన లక్షణాలను వ్రాయండి.
జవాబు.
జాతీయ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయపు సాపేక్ష ప్రాముఖ్యతను బట్టి, ఒక దేశానికి, మరొక దేశానికి వ్యవసాయ ధరల విధానపు లక్ష్యాలు మారుతుంటాయి. సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలలో ధర విధానం ప్రధాన లక్ష్యం వ్యవసాయ ఆదాయం అనూహ్యంగా తగ్గకుండా నిరోధించడం.
వ్యవసాయ ధరల విధానం లక్షణాలు :
ఈ విధానపు ప్రధాన లక్షణాలను కింది విధంగా పేర్కొనవచ్చు. అవి :

1. సంస్థలు :
ధరల విధానాల అమలుకై ప్రభుత్వం రెండు సంస్థలను నెలకొల్పింది. అవి :

i. వ్యవసాయ ధరల సంఘం (1965) :
వ్యావసాయిక ధరల విధానం, కనీస మద్ధతు ధరలను నిర్ధారించడంలోనూ, వ్యావసాయిక ఉత్పత్తుల సేకరణ ధరలకు సంబంధించి ఈ సంఘం ప్రభుత్వానికి సలహాలనిస్తుంది.

ii. భారతదేశ ఆహార కార్పోరేషన్ (Food Corporation of India-1985) :
ప్రభుత్వంచే నిర్ధారించబడిన ధరల వద్ద ఆహారధాన్యాల సేకరణను వ్యవస్థీకరించడం, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వాటి అమ్మకాలను కొనసాగించడం ఈ కార్పోరేషన్ పరిధిలోకి వస్తాయి.

2. కనీస మద్ధతు ధరలను (Minimum Support Price) లేదా సేకరణ ధరలను నిర్ణయించడం :
ప్రతి సంవత్సరం వ్యావసాయిక వ్యయాల ధరల సంఘం (CACP) చేసిన సూచనల ప్రాతిపదికన గోధుమ, బియ్యం, మొక్కజొన్న లాంటి ప్రధాన వ్యావసాయిక ఉత్పత్తుల కనిష్ట మద్దతు ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

3. గరిష్ఠ ధర నిర్ణయం :
కొన్ని నిర్ధిష్ట వ్యావసాయిక వస్తువులకు ప్రభుత్వం గరిష్ఠ ధరలను నిర్ధారిస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఫల వ్యవసాయిక ఉత్పత్తులైన ధాన్యాలు, చక్కెర, బియ్యం మొదలైన వాటిని సరసమైన ధరలకు ప్రభుత్వం అమ్మకాలను ఛేపట్టడం జరుగుతుంది.

ప్రజాపంపిణీ వ్యవస్థ అనేది ధరల విధానపు మరొక ముఖ్య లక్ష్యం. ఇది రెండు రకాలైన రేషనింగ్ను కలిగి ఉంటుంది. అవి : శాసనపరమైన రేషనింగ్, అనియత రేషనింగ్ (informal rationing). శాసనపరమైన నియంత్రిత (rationed) ప్రాంతాలలో బహిరంగ మార్కెట్ పనితీరును చట్టాన్ని అనుసరించి నిరోధించబడుతుంది.

4. బఫర్ నిల్వలు :
ధర చాంచల్యాలు లేకుండా చేసే ఏకైక ఉద్దేశ నిమిత్తమై నిల్వల, అమ్మకాల, కొనుగోళ్ళను బఫర్ నిల్వలు సూచిస్తాయి. దీనిని FCI చేపడుతుంది. అహార ధాన్యాల ధర పెరగడం ప్రారంభమైనపుడు, నిర్ధిష్ట ధరల వద్ద బఫర్ నిల్వల నుంచి ఆహార ధాన్యాల అమ్మకాలను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. తత్ఫలితంగా ఆహార ధాన్యాల ధరలలోని పెరుగుదల నియంత్రించ
బడుతుంది.

ప్రశ్న 10.
భారతదేశంలో ఆహార భద్రత కల్పనకు చర్యలు వ్రాయండి.
జవాబు.
ఆహార భద్రత భావన :
ప్రపంచ ఆరోగ్య భద్రతపై నివేదికను అందజేసిన ఐక్యరాజ్య సమితి కమిటీ ప్రకారం “ప్రజలందరికి అన్ని కాలాలలో చురుకైన, ఆరోగ్యవంతమైన జీవనానికి తమ అభిరుచి మరియు ఆహారపు అలవాట్ల ప్రకారం తగినంత సురక్షితమైన, * పౌష్టికాహారం భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా అందుబాటులో ఉండటం”ను ఆహార భద్రత అంటాం.

ప్రపంచ అభివృద్ధి నివేదిక (World Development Report, 1986) ప్రకారం, “చురుకైన, ఆరోగ్యవంతమైన జీవనాని కోసం అన్ని సమయాలలో చాలినంత ఆహారం ప్రజలందరికీ అందుబాటులో ఉండటమే ఆహార భద్రత”. ఆహార వ్యవసాయ సంస్థ (Food and Agriculture Organisation, 1983) ప్రకారం “ప్రజలందరికీ అన్ని సమయాలలో అవసరమైన ప్రాథమిక ఆహారాన్ని భౌతికంగా, ఆర్థికంగా అందుబాటులోకి తేవడమే ఆహార భద్రత” గా చెప్పవచ్చు.

భారతదేశంలో ఆహార భద్రత ఏర్పాటుకు చర్యలు :
ఆహార భద్రత సమస్యకు చెందిన పరిమాణాత్మక, గుణాత్మక అంశాలను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం క్రింది మూడు ఆహార ఆధారిత భద్రతా వలలపై ఆధారపడింది.

  • ప్రజా పంపిణీ వ్యవస్థ ఆర్యా
  • సమగ్ర శిశు అభివృద్ధి సేవలు.
  • మధ్యాహ్న భోజన పథకం.

i) ప్రజా పంపిణీ వ్యవస్థ :
ప్రజా పంపిణీ వ్యవస్థ క్రింద ఆహార ధాన్యాలను చౌకధరలకు చౌకధరల దుకాణాల ద్వారా అందించడం జరుగుతుంది. ఇది ఇప్పుడు లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థగా పనిచేస్తుంది. దీని కింద పేదలలోని లక్షిత నిరుపేదలకు ముందుగా సేవలను అందిస్తారు.

ii) సమగ్ర శిశు అభివృద్ధి సేవలు :
ఈ పధకం క్రింద ప్రిస్కూల్ కేంద్రాల (అంగన్ వాడీ కేంద్రాలు) ద్వారా ఇంకా పాఠశాలకు వెళ్ళని బాల, బాలికలకు ఉచిత ఆహారం పంపిణీ జరుగుతుంది.

iii) ‘మధ్యాహ్న భోజన పధకం :
పాఠశాలకు వెళ్ళే బాల, బాలికలకు ఈ పధకం క్రింద మధ్యాహ్నం ఉచితంగా భోజన -సౌకర్యం కల్పిస్తున్నారు.

ఆహారభద్రత చట్టం :
భారతదేశంలో ఆహార భద్రతను కల్పించడం కోసం సమగ్ర విధానంగా భారత ప్రభుత్వం 2013 సం. జూలైలో జాతీయ ఆహార భద్రతా చట్టంను ఆమోదించారు. ఈ చట్టం ప్రకారం దేశంలోని 67 శాతం ప్రజలకు (గ్రామాలలో 75 శాతం, పట్టణాలలో 50 శాతం) న్యాయమైన హక్కుగా అధిక సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాల పంపిణీ ఉంటుంది. ప్రతి వ్యక్తికి, ప్రతి నెల అయిదు కిలోల చొప్పున ప్రాధాన్యతా కుటుంబాలకు ఆహార ధాన్యాల సరఫరా ఉంటుంది. అంత్యోదయ అన్న

యోజన కుటుంబాలకు చెందిన ప్రతి కుటుంబంకు ప్రతి నెల 35 కిలోల ఆహార ధాన్యాలను అధిక సబ్సిడీతో కూడిన ధరలకు ప్రతి కిలోకు న్యూట్రీసిరల్స్ అయితే రూ.1, గోధుమలు అయితే రూ. 2, బియ్యం అయితే రూ.3కి అందిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం లబ్ధిదారుల సంఖ్యను నిర్ణయిస్తారు.

ఆ ప్రకారం దేశంలోని 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని 81.35 కోట్ల ప్రజలు ఈ పథకం క్రిందికి వస్తారు. ఈ చట్టం క్రింద మరియు ఇతర సంక్షేమ పథకాల క్రింద కలిపి మొత్తం 610 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఒక సంవత్సరానికి కేటాయిస్తారు.

గర్భవతులు గర్భవతులుగా ఉన్న కాలంలోనూ, మరియు ప్రసవం తరువాత ఆరునెలల వరకు అంగన్ వాడీల ద్వారా ఉచితంగా ఆహారం పొందుతారు మరియు ప్రసవం తరువాత ప్రసూతి ప్రయోజనంగా రూ. 6,000 పొందుతారు. ఆరునెలల నుండి 6సం॥ల వయస్సు గల బాల బాలికలకు అంగన్ వాడీల ద్వారా ఉచితంగా ఆహారం అందిస్తారు.

పాఠశాలకు వెళ్ళే 6 నుండి 14 సం॥ ల బాల బాలికలకు మాధ్యమిక తరగతుల వరకు ఉచితంగా మధ్యాహ్నం భోజనం ఇస్తారు. ఒకవేళ ప్రభుత్వం అర్హులకు ఆహార ధాన్యాలను పంపిణీ చేయకపోతే ఆహార భద్రత భత్యంను ఇవ్వవలసి ఉంటుంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
వ్యవసాయ రంగం వృద్ధి తీరును వివరించండి.
జవాబు.
వ్యవసాయ వృద్ధి : ఈ భావనను క్రింది రెండు అంశాల దృష్ట్యా చర్చించవచ్చు.

i) వ్యవసాయ వృద్ధి ధోరణులు :
స్వాతంత్ర్యం వచ్చేనాటికి భారత వ్యవసాయం వెనుకబడిన స్థితిలో ఉంది. రైతులు ఎక్కువగా అప్పుల పాలవడమే కాకుండా, సరైన యంత్రాలను, మంచి విత్తనాలను, రసాయన ఎరువులను వాడటానికి కావలసిన పరిజ్ఞానం వారికి లేదు. నీటి పారుదల సౌకర్యాలున్న కొన్ని ప్రాంతాలు తప్ప మిగతా అన్ని చోట్ల రైతులు వర్షపాతం, వర్షాకాలం పైన ఆధారపడ్డారు. హెక్టారుకు శ్రామికుని ఉత్పాదకశక్తి చాలా అల్పంగా ఉండేది. ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధి లేకపోవడం వల్ల దేశం ఆహార ధాన్యాల దిగుమతుల పైన ఆధారపడింది.

70 శాతం వ్యవసాయ రంగం పైన ఆధారపడ్డారు. భారతదేశం తన ఆర్థికాభివృద్ధి కోసం అమలు పరిచిన ప్రణాళికా ప్రక్రియలో మొదటి (1951-56), మూడవ (1961-66) మరియు నాల్గవ (1969-74) పంచవర్ష ప్రణాళికలు. వ్యవసాయ రంగంకు అధిక శాతం నిధులను కేటాయించడం వల్ల ఈ రంగానికి ప్రాధాన్యతను ఇచ్చాయి. వ్యవసాయ అభివృద్ధి కొరకు భారతదేశం భూసంస్కరణలను కూడా అమలు పరిచింది.

1966-67 సం||లో ఆధునిక వ్యవసాయ ఉత్పాదకాలయిన అధిక దిగుబడి వంగడాల విత్తనాలు, రసాయనిక ఎరువులు, తెగుళ్ళ నివారణ మందులు మొదలగు వాటిని సరఫరా చేయడం ద్వారా నూతన వ్యవసాయక వ్యూహంను భారతదేశం అనుసరించింది. ఫలితంగా భారతదేశం 1976 సం॥ నాటికి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించింది.

1950-51 నుండి 2019-20 మధ్యకాలంలో భారతదేశ వ్యవసాయ రంగ సగటు వార్షిక వృద్ధి దాదాపు 3 శాతంగా ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ తక్కువ వృద్ధి రేటు (హిందూ వృద్ధి రేటు)ను సాధించిన దశ (సగటు వార్షిక వృద్ధి 3.5 శాతం 1950-51 నుండి 1969 – 70 వరకు) లోనూ, మాధ్యమిక వృద్ధి రేటును సాధించిన దశ (దాదాపు 5 శాతం వార్షిక ఆర్థిక వృద్ధి 1970-71 నుండి 1990-91 వరకు) లోనూ, అధిక వృద్ధిని సాధించిన కాలం (1991-92 నుండి 2019-20 వరకు దాదాపు 7 శాతం సగటు వార్షిక ఆర్థిక వృద్ధి) లోనూ వ్యవసాయ రంగం వృద్ధి రేటు వరుసగా 3.5 శాతం, 5 శాతం, 7 శాతంగా ఉంది. ఆర్థిక సంస్కరణల కాలంలో భారతదేశం సాధించిన అధిక వృద్ధిరేటు సేవల రంగం ప్రత్యేకించి సమాచార, సాంకేతిక రంగం సాధించిన వృద్ధితోనే ప్రభావితం అయింది.

ii) ప్రధాన పంటల ఉత్పాదకత, ఉత్పత్తిలో పెరుగుదల :
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన ప్రారంభంలో ప్రధాన పంటల ఉత్పాదకత, ఉత్పత్తి చాలా తక్కువగా ఉన్నప్పటికీ భారతదేశం 60వ దశకం రెండవ భాగంలో అనుసరించిన నూతన వ్యవసాయిక వ్యూహం వలన 70వ దశకంలో పెరిగింది. వ్యవసాయ ఉత్పాదకత, ఉత్పత్తిలో వచ్చిన గణనీయమైన పెరుగుదలనే హరిత విప్లవం అన్నారు.

1) ఆహారధాన్యాల ఉత్పత్తి 50.8 మిలియన్ టన్నుల (మి.ట) నుండి 285 మిలియన్ టన్నులకు పెరిగింది. అదే కాలంలో బియ్యం ఉత్పత్తి 20.5 మి.ట నుండి 116.4 మి.టలకు, గోధుమల ఉత్పతి 6.4 మి.ట నుండి 102.2 మి.టలకు, మొక్కజొన్నల ఉత్పత్తి 1.7 మి.ట నుండి 27.2 మి. టలకు, పప్పుధాన్యాల ఉత్పత్తి 8.4 మి.ట నుండి 23.4 మి.ట లకు, నూనె గింజల ఉత్పత్తి 5.1 మి.ట నుండి 23.4 మి.టలకు పెరిగింది. ప్రధాన పంటల ఉత్పత్తి విషయంలో కూడా ఎక్కువ పెరుగుదల గోధుమల ఉత్పత్తిలో ఉండగా తక్కువ పెరుగుదల పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ఉంది.

2) ఆహార ధాన్యాల ఉత్పాదకత 1950-51 సం॥లో సగటున ఒక హెక్టారుకు 522 కిలోలుగా ఉండి 2018-19 సం॥ నాటికి 2299 కిలోలకు పెరిగింది. అదే కాలంలో బియ్యం ఉత్పాదకత 688 కిలోల నుండి 2,659 కిలాలకు, గోధుమ ఉత్పాదకత 663 కిలోల నుండి 3,507 కిలోలకు, మొక్కజొన్నల ఉత్పాదకత 547 కిలోల నుండి 2,966 కిలోలకు, పప్పుధాన్యాల ఉత్పాదకత 441 కిలోల నుండి 806 కిలోలకు, నూనెగింజల ఉత్పాదకత 481 కిలోల నుండి 1265 కిలోలకు పెరిగింది. మొత్తం మీద 1950-51 నుండి 2018-19 సం॥ల మధ్యకాలంలో గోధుమల ఉత్పాదకత ఆరు రెట్లు పెరగగా, పప్పుధాన్యాల ఉత్పాదకత రెండింతలు పెరిగింది.

ప్రశ్న 2.
భారతదేశ ప్రధాన వ్యవసాయ పంటల ఉత్పత్తిలో గల ధోరణులను వ్రాయండి.
జవాబు.
ప్రధాన పంటల ఉత్పత్తిలో గల పెరుగుదల :
భారతదేశం 60వ దశకం రెండవ భాగంలో అనుసరించిన నూతన వ్యవసాయిక వ్యూహం వలన 70వ దశకంలో పెరిగింది. వ్యవసాయ ఉత్పాదకత, ఉత్పత్తిలో వచ్చిన గణనీయమైన పెరుగుదలనే హరిత విప్లవం అని అంటాము. ప్రధాన పంటల ఉత్పత్తిలో గల పెరుగుదలను క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చును.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం 1

పట్టిక ప్రకారం ఉత్పత్తి ధోరణి పరిశీలిస్తే 1950 – 51 సం॥ నుండి 2018-19 సం॥ల మధ్య కాలంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 50.8 మిలియన్ టన్నుల (మి.ట) నుండి 285 మిలియన్ టన్నులకు పెరిగింది. అదే కాలంలో బియ్యం ఉత్పత్తి 20.5 మి.ట నుండి 116.4 మి.టలకు, గోధుమల ఉత్పతి 6.4 మి.ట నుండి 102.2 మి.టలకు, మొక్కజొన్నల ఉత్పత్తి 1.7 మి.ట నుండి 27.2 మి.టలకు, పప్పుధాన్యాల ఉత్పత్తి 8.4 మి.ట నుండి 23.4 మి.ట లకు, నూనె గింజల ఉత్పత్తి 5.1 మి.ట నుండి 23.4 మి.టలకు పెరిగింది. ప్రధాన పంటల ఉత్పత్తి విషయంలో కూడా ఎక్కువ పెరుగుదల గోధుమల ఉత్పత్తిలో ఉండగా తక్కువ పెరుగుదల పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ఉంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

ప్రశ్న 3.
భారతదేశంలో వ్యవసాయోత్పాదకత ధోరణులేవి ? వివరించండి.
జవాబు.
వ్యవసాయ ఉత్పత్తి అంటే సాగు చేస్తున్న మొత్తం నుంచి లభించిన మొత్తం ఉత్పత్తి. అదే వ్యవసాయ ఉత్పాదకత అనగా సగటున ఒక హెక్టారు నుండి లభించిన దిగుబడి. భారతదేశంలో వ్యవసాయోత్పాదకతలో వివిధ పంటల ధోరణులను క్రింది పట్టిక ద్వారా వివరించవచ్చు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం 2

ప్రధాన పంటల ఉత్పత్తి ధోరణిని పరిశీలిస్తే 1950-51 సంవత్సరం నుండి 2018-19 సం॥ల మధ్యకాలంలోమొత్తం ఆహార ధాన్యాల ఉత్పాదకత 1950-51 సం॥లో సగటున ఒక హెక్టారుకు 522 కిలోలుగా ఉండి 2018-19 సం॥ నాటికి 2299 కిలోలకు పెరిగింది.

అదే కాలంలో బియ్యం ఉత్పాదకత 688 కిలోల నుండి 2,659 కిలాలకు, గోధుమ ఉత్పాదకత 663 కిలోల నుండి 3,507 కిలోలకు, మొక్కజొన్నల ఉత్పాదకత 547 కిలోల నుండి 2, 966 కిలోలకు, పప్పుధాన్యాల ఉత్పాదకత 441 కిలోల నుండి 806 కిలోలకు, నూనెగింజల ఉత్పాదకత 481 కిలోల నుండి 1265 కిలోలకు పెరిగింది. మొత్తం మీద 1950-51 నుండి 2018-19 సం॥ల మధ్యకాలంలో గోధుమల ఉత్పాదకత ఆరు రెట్లు పెరగగా, పప్పుధాన్యాల ఉత్పాదకత రెండింతలు పెరిగింది.

ప్రశ్న 4.
భారతదేశంలో భూ సంస్కరణల అమలు సరిగా లేకపోవడానికి కారణాలు ఏమిటి ?
జవాబు.
భూ సంస్కరణల అమలు విమర్శనాత్మక పరిశీలన :
భారతదేశంలో భూసంస్కరణ కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా ప్రారంభించబడ్డాయి. సమ సమాజ ఆవిర్భావానికి భూసంస్కరణలు సాధనాలుగా ప్రశంసించబడ్డాయి. సిద్ధాంతపరంగా వ్యవసాయ రంగంలో వ్యవస్థాపూర్వక మార్పులను తేవడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదలకు ఈ సంస్కరణలు దోహదపడతాయి. అయితే, అమలు ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. భూసంస్కరణల అమలులో వైఫల్యాలకు కింది కారణాలు ప్రధానమైనవి.

1. చట్టాలలో లొసుగులు :
భూ సంస్కరణల చట్టాలలో లొసుగులు (loopholes in the acts) ఉన్నాయి. ఈ లొసుగులను ఉపయోగించుకొని పెద్ద భూస్వాములు తమ ఆర్థిక, రాజకీయ బలంతో భూమిపై తమ యాజమాన్యాన్ని నిలుపుకోగలిగారు.

2. రాజకీయ నిబద్ధత లేకపోవడం :
అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు పెద్ద భూస్వాములకు ఎటువంటి ఉపద్రవాన్ని కల్గించకుండా ఉండటానికి చట్టాల అమలులో నిజమైన శ్రద్ధను కనబరచలేదు. అందువల్ల చట్టాలను నిర్వీర్యపరిచారు.

3. లబ్ధిదారుల నిశ్చేష్ట స్వభావం :
సన్నకారు, చిన్న రైతులు, భూమిలేని శ్రామికులు వారి హక్కులకు, జరుగుతున్న ప్రక్రియకు సంబంధించిన పరిజ్ఞానంను కలిగిలేరు. వీరిలో అధిక సంఖ్యాకులు నిరక్షరాస్యతతో, అమాయకంగా ఉంటారు. తమకు ప్రయోజనం కలిగించే సంస్కరణల పట్ల వీరికి చైతన్యం తక్కువ.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

4. పాలనా యంత్రాంగం :
భారతదేశంలో ప్రభుత్వ యంత్రాంగం వలస పాలనలో శిక్షణ పొంది ఆ పద్ధతులకు అలవాటు పడింది. అందువల్ల భూసంస్కరణల పట్ల, గ్రామీణ ప్రజల సమస్యల పట్ల ఉదాసీన వైఖరిని ప్రదర్శించడం జరిగింది. · సంస్కరణల అమలులో తగినంత శ్రద్ధను ప్రభుత్వ యంత్రాంగం కనబరచలేదు.

5. న్యాయపరమైన అవరోధాలు :
చట్టంలోని లొసుగులను అనుకూలంగా చేసుకొని ఇంతమంది పెద్ద భూస్వాములు న్యాయ స్థానాలలో కేసులు వేశారు.

6. భూమి రికార్డులు అందుబాటులో లేకపోవడం :
దశాబ్దాల తరబడి భారతదేశంలో భూమికి సంబంధించిన రికార్డులు సరైన తీరులో నిర్వహించబడలేదు. సరైన రికార్డులు లేకపోవడం వల్ల సంస్కరణల అమలు కష్టతరమైన కార్యక్రమంగా మారింది.

7. రాష్ట్ర జాబితా :
వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ జాబితాలోని అంశం. వివిధ రాష్ట్రాలు చట్టాలను వివిధ స్థాయిలలో అమలు పరిచాయి. భూసంస్కరణల చట్టాల అమలులో రాష్ట్రాల చర్యలకు ఏకీకృత స్వభావం లేదు. జాతీయ భూసంస్కరణల మండలి (National Council for Land Reforms) 2008లో స్థాపించబడినా ఫలితం శూన్యంగా ఉంది.

8. తదుపరి చర్యలలో జాప్యం :
తదుపరి చర్యలను (follow up actions) తీసుకోవడంలో పాలనా యంత్రాంగం అసాధారణ జాప్యాన్ని ప్రదర్శించింది. ప్రకటిత మిగులు భూమి మొత్తం ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోబడలేదు. స్వాధీనం చేసుకొన్న మొత్తం భూమి పంపిణీ చేయబడలేదు. పరపతి, ఇతర ఉత్పాదకాలు లాంటి అనుషంగిక సహాయాన్ని లబ్దిదారులకు అందజేయలేదు. భూమిపై యాజమాన్య హక్కులు మాత్రమే లబ్దిదారులకు కల్పించబడ్డాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

ప్రశ్న 5.
సంస్థాపరంకాని వ్యవసాయ పరపతి మూలాధార లోపాలు ఏమిటి ?
జవాబు.
కాలాన్ని, పరపతి ఉద్దేశాన్ని అనుసరించి మన దేశంలో వ్యవసాయదారులు కోరుకొనే పరపతి మూడు రకాలుగా ఉంటుంది. అవి :

  1. వ్యవసాయ సాగుకు 15 నెలల లోపు అవసరమయ్యే స్వల్పకాలిక రుణం. ఇది విత్తనాలు, ఎరువులు, పశుగ్రాసం వంటి కొనుగోళ్ల రూపంలో ఉంటుంది.
  2. వ్యవసాయ భూమిని బాగు చేయడానికి పశువులు, వ్యవసాయ పనిముట్లు వంటి వాటి కొనుగోలు కోసం వ్యవసాయదారులకు 15 నెలల నుంచి 5 సంవత్సరాల కాల పరిమితి ఉండే మధ్య కాలిక పరపతి అవసరమవుతుంది.
  3. భూమిని అభివృద్ధి చేయడానికి, నీటి సౌకర్య ఏర్పాటుకు, భారీ యంత్రాల కొనుగోలు మొదలైన వాటి కోసం వీరికి 5 సంవత్సరాల పైబడిన దీర్ఘకాలిక అవసరం ఉంటుంది.

మనదేశంలో వ్యవసాయదారులకు అవసరం అయ్యే పరపతిని ఉత్పాదక, అనుత్పాదక రుణాల రూపంగా విభజించవచ్చు. విత్తనాలు, ఎరువులు, పశువులు, వ్యవసాయ పనిముట్ల కొనుగోలు, బావులు లేదా గొట్టపు బావులు త్రవ్వకం వంటి వాటి కోసం ఉత్పాదక రుణాలు అయితే పెళ్ళిళ్ళు, సామాజిక వేడుకలు, మతపరమైన వేడుకలు, పండుగలు వంటి వాటిపై చేసే ఖర్చు అవసరాల కోసం అనుత్పాదక ఋణాలు.

సంస్థాపూర్వకం కాని ఆధారాలు :
సంస్థాపూర్వకం కాని ఆధారాల్లో వడ్డీ వ్యాపారులు, భూస్వాములు, వ్యాపారస్థులు, కమీషన్ ఏజెంట్లు, బంధువులు, మిత్రులు మొదలైనవారు ఉంటారు. 1951-52 లో వ్యవసాయ పరపతికి సంబంధించి సంస్థాపూర్వకం కాని మార్గంలో వ్యవసాయదారులు 93 శాతం రుణాన్ని పొందితే ప్రభుత్వం కేవలం 7 శాతం పరపతిని సమకూర్చింది. వడ్డీ వ్యాపారులు, భూస్వాములు ఉత్పాదక, అనుత్పాదక రుణాలను కల్పిస్తారు.

వీరు ఏ సమయంలోనైనా వ్యవసాయదారులకు సులభంగా అందుబాటులో ఉంటారు.

  1. ఈ రకమైన వ్యవస్థ వడ్డీ వసూళ్ళలో ఏకరూపత ఉండదు.
  2. అత్యధిక వడ్డీ 18 నుంచి 50 శాతం వరకు కూడా ఉంటుంది.
  3. చిన్న రైతులను మోసం చేయడమే కాకుండా వారి వ్యవసాయ భూమిని కూడా స్వాధీనం చేసుకొంటారు.
  4. భూమి లేని శ్రామికులు బలవంతంగా బానిసలుగా మారే అవకాశం ఈ వ్యవస్థలో ఉంటుంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

ప్రశ్న 6.
గ్రామీణ ఋణగ్రస్తతకు గల కారణాలు ఏవి ?
జవాబు.
గ్రామీణ ఋణగ్రస్తతకు గల కారణాలు : గ్రామీణ ప్రాంతాల్లో ఋణం పెరగడానికి కింది విషయాలు కారణభూతం అవుతున్నాయని చెప్పవచ్చు. అవి :

  1. గ్రామ ప్రాంతాల్లో రైతులు రుణగ్రస్తులుగా మారడానికి ప్రధాన కారణం వారి పేదరికం, తక్కువ స్థాయి పొదుపులు, పంట నష్టపోవడం.
  2. అప్పులు చేసి పొలాలను బాగుపరచి అభివృద్ధి చేయాలనే తపన.
  3. అనుత్పాదక పనులపై ఖర్చు పెట్టడం.
  4. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా అప్పులు సంక్రమించడం.
  5. సంస్థాగతం కాని ఋణాలపైన ఎక్కువగా ఆధారపడటం.
  6. పంటలకు మద్ధతు ధరలు తగినంతగా లేకపోవడం.
  7. సేద్యపు ఖర్చులు బాగా పెరిగిపోవడం.

ప్రశ్న 7.
నాబార్డు విధులను వివరించండి.
జవాబు.
వ్యవసాయ రంగ అభివృద్ధికి ఉన్నత స్థితిని కల్పించడానికి, బ్యాంకులకు పునర్ విత్త సౌకర్యం కల్పించడం కోసం రిజర్వు బ్యాంకు వ్యవసాయ పునర్ విత్త అభివృద్ధి కార్పోరేషన్ (ARDC) ని నెలకొల్పింది. బ్యాంకు పరపతి పాత్ర వ్యవసాయ రంగ అభివృద్ధికే పరిమితం కాక గ్రామీణ అభివృద్ధికి కూడా విస్తరించడంతో పరపతి సంస్థలకు ఊతాన్ని, మార్గదర్శనాన్ని ఇవ్వడానికి శిఖరాగ్ర స్థాయిలో విస్తృత వ్యవస్థను ప్రభుత్వం ప్రతిపాదించింది. తదనుగుణంగా (ARDC) స్థానంలో జులై 1982వ సం||లో జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డు NABARD) ను స్థాపించారు.

సాధారణంగా నాబార్డ్ ఈ క్రింది విధులను నిర్వహిస్తుంది :

  1. గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడి, ఉత్పత్తి పనులకు పరపతిని అందించేందుకు గాను అన్ని రకాల సంస్థలకు ఋణాలను అందిస్తుంది.
  2. గ్రామీణ అవస్థావనా సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రభుత్వేతర సంస్థలకు (NGO) పంచాయితీ రాజ్ సంస్థలకు రుణాలను అందిస్తుంది.
  3. ప్రభుత్వేతర సంస్థలు, ఇతర సంస్థాగతంగాని ఏజెన్సీల నవకల్పనలకు దోహదం చేస్తుంది.
  4. స్వయం సహాయక బృందాలను (SHGs) ప్రోత్సహిస్తూ వ్యవస్థీకృత బ్యాంకుల సేవలను గ్రామీణ పేదలకు అందేలా చూస్తుంది.
  5. వర్షాధార వ్యవసాయం ఉత్పాదకత లాభదాయకతలు మనగలిగే విధంగా ప్రజల భాగస్వామ్యంతో వాటర్ షెడ్లను అభివృద్ధి చేస్తుంది.
  6. అభివృద్ధి పరచడానికి అనుకూలంగా ఉండే వ్యవసాయ, వ్యవసాయేతర అవకాశాలను గుర్తించి, బ్యాంకుల రుణాల ద్వారా వాటిని అభివృద్ధి చేసేందుకు వీలుగా పరపతి ప్రణాళికలను తయారు చేస్తుంది.
  7. ప్రాంతీయ గ్రామీణ బాంకుల, సహకార బాంకుల కార్యకలాపాలను తనిఖీ చేస్తుంది.
  8. అభివృద్ధి చర్యల్లో అన్నిసంస్థలు చేస్తున్న విత్త సహాయక పనులను సమన్వయ పరుస్తుంది.
  9. రైతుల క్లబ్బుల ద్వారా సాంకేతిక విజ్ఞానాన్ని బదిలీచేసే పనులకు సహాయాన్ని అందిస్తుంది.
  10. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర రంగాలైన చిన్న తరహా పరిశ్రమలు, చిన్న మధ్య తరహా వ్యాపార సంస్థలు, కుటీర, గ్రామీణ పరిశ్రమలు, హస్తకళలు, ఇతర గ్రామీణ వృత్తులకు పునర్విత్త సహాయాన్ని అందించి అభివృద్ధి పరుస్తుంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

ప్రశ్న 8.
భారతదేశ వ్యవసాయ మార్కెటింగ్లో గల లోపాలు ఏవి ?
జవాబు.
జాతీయ వ్యవసాయ కమీషన్ అభిప్రాయంలో, “వ్యవసాయ మార్కెటింగ్లోని వివిధ దశలను కలుపుకొని ప్రస్తుత ధరల వద్ద రైతులు తమ ఉత్పత్తులకు విక్రయించే ప్రక్రియే వ్యవసాయ మార్కెటింగ్”.
పై నిర్వచనం ప్రకారం వ్యవసాయ మార్కెటింగ్ అంటే మార్కెట్ ధరల వద్ద వ్యవసాయదారులు తమ ఉత్పత్తిని అంతిమ వినియోగదారులకు చేర్చే ప్రక్రియను వ్యవసాయ మార్కెటింగ్ అని చెప్పవచ్చు. పంట పండించడానికి ముందు పండించిన తరువాత జరిగే కార్యకలాపాలన్నీ వ్యవసాయ ఉత్పత్తి కిందకు వస్తాయి.

భారత వ్యవసాయ మార్కెటింగ్లో లోపాలు:
భారత వ్యవసాయ మార్కెటింగ్ దోపిడీ అధికంగా ఉంది.. అందువల్ల రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను పొందలేకపోతున్నారు. వ్యవసాయ మార్యెటింగ్ లోని ముఖ్యమైన లోపాలను కింద వివరించడం జరిగింది.

1. మధ్యవర్తుల జోక్యం :
దళారీలు వ్యాపారులతో రహస్య మంతనాలు జరిపి ఉత్పత్తులకు తక్కువ ధర చెల్లించి రైతులను మోసగిస్తున్నారు. రకరకాల మోసపూరిత పద్ధతుల ద్వారా వీరు రైతులను దోపిడికి గురి చేస్తున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఉత్పత్తి యొక్క మార్కెట్ ధరల్లో 60 నుంచి 70 శాతం వరకు మధ్య దళారీలే దోచుకుంటున్నారన్నది ఒక అంచనా.

2. మార్కెట్ లోని మోసపూరిత విధానాలు:
వ్యాపారస్తులు ఉపయోగించే తూనికలు, కొలతలు ప్రామాణికమైనవికావు. వీరు నాణ్యతా పరీక్షలు, ధర్మాలు, మాముళ్ల పేరిట ఉత్పత్తుల్లో కొంత భాగాన్ని కాజేస్తుంటారు. అంతేగాక వ్యాపారస్తులు రైతులకు ఉత్పత్తుల ప్రతిఫలాలను వాయిదా పద్ధతుల్లో చెల్లిస్తుంటారు. మార్కెట్లో రైతులకు, వ్యాపారులకు మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించడం కోసం ఎలాంటి వివాద పరిష్కార – యంత్రాంగం ఏర్పాటు చేయబడలేదు.

`3. రవాణా సౌకర్యాల కొరత :
ఎక్కువ భాగం గ్రామీణ రహదారులు రైలు మార్గాలతోను, పక్కా రోడ్డు మార్గాలతో అనుసంధానం చేయబడలేదు. నేటికి మనదేశంలో రైతులు రవాణాకు ఎడ్లబండ్లను ఉపయోగిస్తున్నారు. అందువల్ల మనదేశంలోని అధిక భాగం రైతులు తమ ఉత్పత్తులను స్థానిక సంతలలో లేదా మండీలలో గిట్టుబాటు కాని ధరలకు అమ్ముకోవడం తప్పనిసరైంది.

4. గిడ్డంగి సౌకర్యాల కొరత :
గిడ్డంగి సౌకర్యాల కొరత వలన రైతులు తమ ఉత్పత్తులను పాతర్లలోను, మట్టికుండల్లోను అశాస్త్రీయ పద్ధతుల్లో నిల్వ చేస్తారు. ఈ అశాస్త్రీయ పద్ధతుల వల్ల తేమ తగిలి పంట నాణ్యత తగ్గుతుంది. అంతేకాక 10 నుంచి 20 శాతం వరకు పంటను చీమలు, ఎలుకలు, పందికొక్కులు తింటున్నాయి. రైతులు గిట్టుబాటు ధర వచ్చేంతవరకు ధాన్యాన్ని దాచుకోలేక తక్కువ ధరలకు నిర్బంధంగా అమ్ముకోవలసి వస్తుంది.

5. మార్కెట్ సమాచార లోపం :
మనదేశంలోని రైతులు గ్రామీణ ప్రాంతాల్లో నివసించడంవల్ల వీరికి మార్కెట్ సమాచారం తెలియదు. నిరక్షరాస్యులైన వీరికి డిమాండ్, సప్లయ్, ధరల్లో మార్పులు, ప్రభుత్వ ధరల విధానం, మొదలైన విషయ పరిజ్ఞానం ఉండదు. సమాచార లోపం కారణంగా రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను పొందడంలో విఫలమవుతున్నారు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

6. శ్రేణీకరణ, ప్రామాణికీకరణ సదుపాయాల కొరత:
వ్యవసాయ ఉత్పత్తులను మనదేశంలో తగిన రీతిలో శ్రేణీకరణ చేయడం లేదు. సాధారణంగా రైతులు తమ ఉత్పత్తులను నాణ్యతాపరంగా శ్రేణీకరణ, ప్రామాణికీకరణ చేయకుండా మొత్తం ఉత్పత్తినంతటిని ఒకే ధరకు అమ్ముతున్నారు. శ్రేణీకరణ చేయకపోవడం వల్ల రైతులు తమ నాణ్యమైన ఉత్పత్తులను సైతం తక్కువ ధరలకు అమ్ముకొని నష్టపోతున్నారు.

7. పరపతి సౌకర్యాల కొరత :
సంస్థాగత పరపతి సౌకర్యాల కొరతవల్ల మనదేశంలోని పేద రైతులు గ్రామీణ ప్రాంతాలలో పరపతి కోసం వడ్డీవ్యాపారులపై ఆధారపడుతారు. రైతులు పంట చేతికొచ్చిన తక్షణమే మార్కెట్ ధరలు ఎంత తక్కువగా ఉన్నప్పటికి అమ్మి వడ్డీ వ్యాపారులకు చెల్లించవలసి ఉంటుంది. అందువల్ల గిట్టుబాటు ధరలు వచ్చేంతవరకు వేచి ఉండలేక రైతులు నష్టపోతున్నారు.

8. రైతులు అసంఘటితంగా ఉండటం :
మనదేశంలోని రైతులు వేర్వేరు ప్రాంతాలలో నివసించడంవల్ల సంఘటితం కాలేకపోతున్నారు. కాని వ్యాపారస్తులు మాత్రం సంఘటితంగా ఉండి రైతులను గిట్టుబాటు ధరలు పొందకుండా అడ్డుకుంటున్నారు. ఫలితంగా అసంఘటితమైన రైతులు సంఘటితమై సమిష్టిగా బేరమాడుతున్న వ్యాపారస్తులను ఎదుర్కొని గిట్టుబాటు ధరలు పొందలేక నష్టపోతున్నారు.

ప్రశ్న 9.
వ్యవసాయ ధరల విధానపు లక్ష్యాలను పేర్కొనండి.
జవాబు.
వ్యవసాయ ధరల విధానపు లక్ష్యాలు :
జాతీయ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయపు సాపేక్ష ప్రాముఖ్యతపై ఆధారపడి, ఒకదేశం నుంచి మరొక దేశానికి గల వ్యావసాయిక ధరల విధానపు లక్ష్యాలు మారుతుంటాయి. సాధారణంగా, అభివృద్ధి చెందిన దేశాలలో ధర విధానం ప్రధాన లక్ష్యం వ్యావసాయక ఆదాయం అనూహ్యంగా తగ్గకుండా నిరోధించడం, ఏది ఏమైనప్పటికీ, వ్యావసాయక ధరల విధాన లక్ష్యాలను ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు. అవి :

  1. దేశీయ వినియోగ అవసరాలను తీర్చడం.
  2. వ్యావసాయిక ఉత్పత్తుల ధరలలో స్థిరీకరణను సాధించడం.
  3. ఆహార ధాన్యాల, ఆహారేతర ధాన్యాల ధరల మధ్య సహేతుక సంబంధాన్ని ఆపాదించడం.
  4. వ్యావసాయక పరమైన ఉత్పత్తుల ధరల యొక్క ఋణపరమైన, చక్రీయపరమైన చాంచల్యాలు లేకుండా చేయడం.
  5. రెండు ప్రాంతాల మధ్యగల ధరల వ్యత్యాసాలను తొలగించడం.
  6. కొరతలున్న సమయాలలో వినియోగ ఆహారం అందుబాటులోనికి తేవడం.
  7. వ్యావసాయక ఉత్పత్తుల ఉత్పత్తి, ఎగుమతులను పెంచడం.
  8. సహేతుకమైన ధరలవద్ద పరిశ్రమలకు ముడిసరుకులను కల్పించడం.
  9. వ్యవసాయంలో ఆధునిక ఉత్పాదకాల స్థిర ఉపయోగితను కొనసాగించేందుకు రైతులు ఉత్పత్తి చేసిన ఉత్పత్తికిగాను వారికి కనీస గిట్టుబాటుధరను కల్పించడం ఆవశ్యకం. వ్యావసాయక ఉత్పత్తుల నిర్దిష్ట స్వభావం వల్ల నశ్వరత్వం, నిల్వ సమస్యల లాంటి వ్యావసాయక మార్కెటింగ్ లోని పలు ఇబ్బందులను అధిగమించడం కోసం సరైనపంట ప్రణాళికీకరణ కోసం ధరల విధానం ముఖ్యమైంది.
  10. ధరల విధానంలేని సందర్భాలలో జమీందార్లు, ఇతర మధ్య దళారులు రైతుల నుంచి వారి ఉత్పత్తిని అతి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ వారిని దోపిడీకి గురిచేసే క్రమాన్ని నిరోధించేందుకు ధరల విధానం ఆవశ్యకం.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయాదాయంలో వ్యవసాయం వాటా.
జవాబు.
భారతదేశంలో ప్రణాళికలు ప్రారంభమైన తర: ఐ క, ద్వితీయ, తృతీయ గంగాలు అభివృద్ధి చెందడం వల్ల జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా తగ్గింది. 1950-51లో స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం, దాని అనుబంధ రంగాల వాటా 56.5%. ఉంటే 2000-2001 నాటికి అవి 24.7% తగ్గింది. 2013-14 నాటికి 13.9% కి చేరింది. ఇది 2019 – 20 సం॥ నాటికి 16.5 శాతంగా అంచనా వేయబడింది.

ప్రశ్న 2.
ఉద్యోగితలో వ్యవసాయ వాటా.
జవాబు.
భారతదేశంలో చాలా అధిక శాతం. (శ్రామికులు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. 1951లో 98 మిలియన్లు వ్యవసాయ రంగంలో పనిచేస్తే 2001 నాటికి ఈ సంఖ్య 235 మిలియన్లకు పెరిగింది. మొత్తం మీద వ్యవసాయ రంగంపై ఆధారపడిన ప్రజలు 2011వ సంవత్సరంలో 49 శాతం ఉండగా అది 201వ సం॥లో 43 శాతానికి తగ్గింది.

ప్రశ్న 3.
వ్యవసాయ పారిశ్రామిక సంబంధం
జవాబు.
వివిధ ముందంజ పరిశ్రమలకు వ్యవసాయ రంగం ముడిపదార్థాలను అందిస్తుంది. పంచదార, జనపనార, వస్త్ర పరిశ్రమ, వనస్పతి, పిండి మరలు, పండ్ల తోటలు, ఆహార తయారీ పరిశ్రమలు వ్యవసాయ రంగంపై ప్రత్యక్షంగా ఆధారపడ్డాయి. పరోక్షంగా చాలా పరిశ్రమలు వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్నాయి. చాలా చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు వాటికి కావలసిన ముడి సరుకుల కోసం వ్యవసాయ రంగంపైన ఆధారపడుతున్నాయి.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

ప్రశ్న 4.
నీటిపారుదల.
జవాబు.
భారతదేశ జనాభాకు కావలసిన ఆహార పదార్థాలను సరఫరా చేయడానికి వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించాలంటే నీటి పారుదల సౌకర్యం అవసరం. మన దేశంలో నీటి పారుదల సామర్థ్యం ప్రణాళికలకు ముందుకాలంలో 23 మిలియన్ల హెక్టారులుంటే, 2006-2007 నాటికి మొత్తం నీటిపారుదల సామర్థ్యం 103 మిలియన్ల హెక్టార్లకు పెరిగింది. భారతదేశంలో 2019-20 సం॥ నాటికి మొత్తం సాగు విస్తీర్ణంలో 45 శాతం భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యాలు కల్పించగలిగాము.

ప్రశ్న 5.
వ్యవసాయ ఉత్పాదకత.
జవాబు.
ఒక హెక్టారులో పండించిన పంట సగటు ఉత్పత్తి ద్వారా ఆ పంట ఉత్పాదకత గణిస్తారు. 1965 సం॥ తరువాత హరిత విప్లవం ప్రభావం వలన సాగులో ఉన్న భూ విస్తీర్ణం, నీటి పారుదల సౌకర్యాలు ఉన్న భూమి పరిమాణం, అధిక దిగుబడి విత్తనాలను ఉపయోగిస్తున్న భూమి పరిమాణం మొదలగునవి స్థిరంగా పెరిగాయి. అదే విధంగా ఉత్పత్తి ఉత్పాదకతలలో స్థిరమైన పెరుగుదల నమోదైంది.

ప్రశ్న 6.
భూసార క్షీణత.
జవాబు.
దేశంలోని 329 మిలియన్ల హెక్టార్ల భూమిలో సుమారు సగం భూమిలో భూసారం క్షీణించింది. 43% భూమిలో చాలా ఎక్కువగా భూసారం క్షీణించినందువల్ల 33.67% వరకు దిగుబడి నష్టం జరుగుతుంది. 5% భూమి ఉపయోగించే స్థితిలో లేదు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

ప్రశ్న 7.
మధ్యవర్తుల తొలగింపు (Abolition of Intermediaries).
జవాబు.
శాశ్వత శిస్తు వసూలు చట్టం ద్వారా బ్రిటీష్ ప్రభుత్వం జమిందారీ పద్ధతిని ప్రవేశపెట్టింది. జమిందారులు, జాగీర్దారులు, ఇనాందారులు వంటి మధ్యవర్తుల ఆధీనంలో పెద్ద మొత్తంలో భూకమతాలు ఉండేవి. వ్యవసాయదారుల నుంచి భాటకాన్ని (rent) వీరు వసూలు చేసేవారు.

ఈ మద్యవర్తులు బ్రిటీష్ ప్రభుత్వానికి స్థిరమైన రేటులో భూమి శిస్తును చెల్లించి వ్యవసాయదారుల నుంచి అధిక ‘మొత్తంలో భాటకాన్ని వసూలు చేసేవారు, నిజానికి జమిందారులు లేదా మధ్యవర్తులు అనుపస్థిత భూస్వాములుగా ఉంటూ, ” భూమిని అభివృద్ధి చేయడం వల్ల విముఖంగా ఉండేవారు.

ప్రశ్న 8.
సాంధ్ర వ్యవసాయ అభివృద్ధి పథకం.
జవాబు.
1960 61 సం॥లో భారతదేశంలోని ఏడు జిల్లాలలో సాంద్ర వ్యవసాయ అభివృద్ధి పధకంగా పైలెట్ ప్రాజెక్టు రూపంలో దీనిని అమలు చేశారు. తరువాత ఈ కార్యక్రమాన్ని సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం పేరిట ఎంపిక చేసిన 114 జిల్లాలలో అమలు చేశారు. 1966-67 సం॥లో అధిక దిగుబడినిచ్చే వంగడాల కార్యక్రమంను అమలు పరిచారు. దీని ఆశయం దిగుబడినిచ్చే వంగడాలు, రసాయనిక ఎరువుల వాడకాన్ని బాగా పెంచి వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం.

ప్రశ్న 9.
హరిత విప్లవం.
జవాబు.
అధిక దిగుబడినిచ్చే వంగడాలు, రసాయన ఎరువులు లాంటి ఆధునిక ఉత్పాదకాల సహాయంతో 1960-70 మధ్యలో వ్యవసాయ ఉత్పాదకత, ఉత్పత్తిలో సాధించిన పెరుగుదలను హరిత విప్లవం అన్నారు. వ్యవసాయ రంగంలో వచ్చిన నూతన సాంకేతిక మార్పులను సూచిస్తూ విలియం S. గాండ్ మొదటిసారిగా హరిత విప్లవం అనే పదాన్ని ఉపయోగించినాడు. అమెరికన్ వ్యవసాయ ఆర్థికవేత్త నార్మన్ బోర్లాగ్ను హరిత విప్లవ పితామహునిగా చెబుతారు.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

ప్రశ్న 10.
ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు.
జవాబు.
సహకార సంఘ వ్యవస్థలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు గ్రామస్థాయిలో ఉండి వ్యవసాయదారులకు స్వల్పకాలిక, మధ్యకాలిక, రుణాలను కల్పిస్తాయి. 2012 మార్చి 31 నాటికి భారతదేశంలో 92,432 ప్రాథమిక, వ్యవసాయ, సహకార పరపతి సంఘాలు స్వల్పకాలిక పరపతిని అందచేస్తున్నాయి. ఈ సంఘాలను గ్రామస్థాయిలో 10 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యుల చేత ప్రారంభించబడతాయి.

ప్రశ్న 11.
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు.
జవాబు.
1975 సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేసారు. చిన్న, ఉపాంత రైతులు, భూమిలోని శ్రామికులు, కులవృత్తులు చేసే ఉద్యమదారులకు అవసరమయ్యే గ్రామీణ పరపతికి సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకులు అందించే పరపతికి మధ్యగల వ్యత్యాసాన్ని తగ్గించే లక్ష్యంగా వీటిని స్థాపించారు.

ప్రశ్న 12.
సూక్ష్మ విత్తం.
జవాబు.
గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో పేద ప్రజల ఆదాయ, జీవన ప్రమాణ స్థాయిని పెంపొందించటానికి, తక్కువ పరిమాణంలో ఋణం, పొదుపు, విత్తపరమైన సేవలను కల్పించే విధానాన్ని సూక్ష్మ విత్తం అంటారు. వీటిని ఎక్కువగా మహిళలు ఉపయోగించుకుంటున్నారు. పేదరిక నిర్మూలన సూక్ష్మ విత్తం వల్ల సాధ్యపడుతుంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

ప్రశ్న 13.
స్వయం సహాయక బృందాలు.
జవాబు.
ఈ భావనను బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంకు ద్వారా మహ్మద్ యూనస్ 1975వ సంవత్సరంలో కనుగొన్నారు. అయితే భారతదేశంలో నాబార్డ్ ద్వారా 1986-87వ సం॥లో ఈ భావనను ఉపయోగించడం జరిగింది. సాధారణంగా 10 నుంచి 15 మంది సభ్యులచే స్త్రీలు ఒక స్వయం సహాయంగా ఏర్పడుట, బృందంలోని సభ్యులంతా తరచూ కొంత మొత్తాన్ని పొదుపుచేసి దాని నుంచి అవసర నిమిత్తం ఋణాలు పొందుట.

ప్రశ్న 14.
శ్రేణీకరణ, ప్రామాణికీకరణ.
జవాబు.
వ్యవసాయ ఉత్పత్తుల శ్రేణీకరణ ప్రమాణీకరణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వ్యవసాయ ఉత్పత్తుల చట్టం 1937 ప్రకారం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వస్తువులకున్న మార్కెట్ను మరింత విస్తృతపరచడానికి వ్యవసాయ మార్కెటింగ్ విభాగం ద్వారా శ్రేణీకరణ చేసిన వస్తువులపైన AGMARK ను ముద్రిస్తున్నారు.

ప్రశ్న 15.
గిడ్డంగి సౌకర్యాలు.
జవాబు.
రైతులు వారి వస్తూత్పత్తిని నిలువ ఉంచుకొని లాభదాయక ధరను పొందటానికి వీలుగా గ్రామాలు పట్టణాల్లో గిడ్డంగి సౌకర్యాలు విస్తరించబడ్డాయి. ఇందులో భాగంగా 1957లో కేంద్ర గిడ్డంగి కార్పోరేషన్ CWC స్థాపించబడింది. అలాగే వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర గిడ్డంగి కార్పోరేషన్లను SWC ఏర్పాటు చేయడమైంది. ఇంతేగాక జాతీయ స్థాయిలో భారత ఆహార సంస్థ (FCI) స్థాపించబడింది. జూన్, 2013 నాటికి భారతదేశంలో FCI లో 355 లక్షల టన్నులు నిలువ చేసుకొనే శక్తి ఉంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

ప్రశ్న 16.
వ్యవసాయ వ్యయాలు మరియు ధరల సంఘం.
జవాబు.
(CACP) వ్యవసాయ ధరల విధానం గూర్చి ప్రభుత్వానికి ఈ సంఘం సలహాలనిస్తుంది. ఇది కనీస మద్ధతు ధరలను మరియు వ్యవసాయిక వ్యయాలను తెలియజేయును. దీనిని 1965లో వ్యవసాయక ధరల సంఘాన్ని 1985 నుంచి ఈ సంఘాన్ని “వ్యవసాయ వ్యయాల మరియు ధరల సంఘం” అంటారు.

ప్రశ్న 17.
కనీస మద్దతు ధరలు (MSP).
జవాబు.
కనీస మద్ధతు ధరలను (Minimum Support Price) లేదా సేకరణ ధరలను నిర్ణయించడం :
ప్రతి సంవత్సరం వ్యావసాయిక వ్యయాల ధరల సంఘం (CACP) చేసిన సూచనల ప్రాతిపదికన గోధుమ, బియ్యం, మొక్కజొన్న లాంటి ప్రధాన వ్యావసాయిక ఉత్పత్తుల కనిష్ట మద్దతు ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

ప్రశ్న 18.
గరిష్ఠ ధర నిర్ణయం.
జవాబు.
కొన్ని నిర్ధిష్ట వ్యావసాయిక వస్తువులకు ప్రభుత్వం గరిష్ఠ ధరలను నిర్ధారిస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఫల వ్యవసాయిక ఉత్పత్తులైన ధాన్యాలు, చక్కెర, బియ్యం మొదలైన వాటిని సరసమైన ధరలకు ప్రభుత్వం అమ్మకాలను చేపట్టడం జరుగుతుంది.

ప్రజాపంపిణీ వ్యవస్థ అనేది ధరల విధానపు మరొక ముఖ్య లక్ష్యం. ఇది రెండు రకాలైన రేషనింగ్ను కలిగి ఉంటుంది. అవి : శాసనపరమైన రేషనింగ్, అనియత రేషనింగ్ (informal rationing). శాసనపరమైన నియంత్రిత (rationed) ప్రాంతాలలో బహిరంగ మార్కెట్ పనితీరును చట్టాన్ని అనుసరించి నిరోధించబడుతుంది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

ప్రశ్న 19.
బఫర్ నిల్వ.
జవాబు.
ధర చాంచల్యాలు లేకుండా చేసే ఏకైక ఉద్దేశ నిమిత్తమై నిల్వల, అమ్మకాల, కొనుగోళ్ళను బఫర్ నిల్వలు సూచిస్తాయి. దీనిని FCI చేపడుతుంది. అహార ధాన్యాల ధర పెరగడం ప్రారంభమైనపుడు, నిర్ధిష్ట ధరల వద్ద బఫర్ నిల్వల నుంచి ఆహార దాన్యాల అమ్మకాలను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. తత్ఫలితంగా ఆహార ధాన్యాల ధరలలోని పెరుగుదల నియంత్రించ బడుతుంది.

ప్రశ్న 20.
ఆహార భద్రత.
జవాబు.
ప్రపంచ ఆహార భద్రతపై నివేదికను అందజేసిన ఐక్యరాజ్య సమితి కమిటీ ప్రకారం, ప్రజలందరికి అన్ని కాలాలలో చురుకైన, ఆరోగ్యవంతమైన జీవనానికి తమ అభిరుచి మరియు ఆహారపు అలవాట్ల ప్రకారం తగినంత సురక్షితమైన, పౌష్టికాహారం భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా అందుబాటులో ఉండటాన్ని ఆహార భద్రత అంటారు.

ప్రశ్న 21.
ఆహార భద్రత చట్టం.
జవాబు.
6 నుంచి 14 సంవత్సరముల వయస్సు గల పిల్లలు మాధ్యమిక తరగతి వరకు చదువుతున్నట్లయితే ఉచిత మధ్యాహ్న భోజనం ఈ చట్టం ద్వారా లభ్యమవుతుంది. ఒకవేళ అర్హులైన ప్రజలకు ఆహారధాన్యాలు పొందడంలో ప్రభుత్వం విఫలమైనట్లయితే వారికి ఆహార భద్రత అలవెన్స్లను కల్పించడమనే అంశం కూడా ఈ చట్టంలో ఇమిడి ఉంది. దీనిని జూలై 5, 2013న భారత ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసింది.

TS Inter 2nd Year Economics Study Material Chapter 5 వ్యవసాయ రంగం

ప్రశ్న 22.
భారత ఆహార సంస్థ.
జవాబు.
ప్రభుత్వం నిర్ధారించిన ధరలకే ఆహార ధాన్యాలను భారత ఆహార సంస్థ సేకరించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అమ్ముతుంది. భారత ఆహార సంస్థను 1965వ సం॥లో భారత ప్రభుత్వం’ ప్రారంభించింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఆహార ధాన్యాలను ఈ సంస్థ సేకరిస్తుంది.

Leave a Comment