TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

Telangana SCERT 6th Class Telugu Guide Telangana 3rd Lesson వర్షం Textbook Questions and Answers.

వర్షం TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం 1

ప్రశ్నలు

ప్రశ్న 1.
బొమ్మలో ఎవరెవరున్నారు? ఏం చేస్తున్నారు ?
జవాబు.
బొమ్మలో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. వాళ్ళు వాన చినుకులతో ఆడుకుంటున్నారు.

ప్రశ్న 2.
బాలిక మబ్బును చూస్తూ ఏం పాట పాడుతున్నదో ఊహించండి.
జవాబు.
బాలిక మబ్బును చూస్తూ
వానావానా వల్లప్పా వానలు కురిసే వల్లప్పా
బావులు నిండే చెరువులు నిండే
వాగులు పొంగి పరుగులు తీసే ॥ వానావానా వల్లప్పా||
అనే పాట పాడుతున్నది.

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

ప్రశ్న 3.
వానపడుతుంటే మీరేం చేస్తారు ? మీకేం చేయాలనిపిస్తుంది ?
జవాబు.
వానపడుతుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. శరీరానికి ఎంతో చల్లగా ఉంటుంది. అప్పుడు నాకు పాటలు పాడాలనిపిస్తుంది చురుక్కుమంటూ మీదపడే చినుకులతో ఆడుకోవాలని అనిపిస్తుంది.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.22)

ప్రశ్న 1.
మేఘాన్ని నడుమంతరపు సిరికి మిడిసిపడే వారితో కవి ఎందుకు పోల్చి ఉంటాడు?
జవాబు.
నడుమంతరపు సరి అంటే మొదటి నుంచీ లేకుండా మధ్యలో అనుకోకుండా వచ్చి చేరిన సంపద అని అర్థం. మేఘాలు వర్షాకాలంలో మాత్రమే నీటితో నిండి ఉంటాయి. వర్షాకాలం పూర్తి కాగానే తేలికైపోతాయి. అందువల్ల అన్నివేళల్లోనూ లేకుండా మధ్యలో వచ్చి మధ్యలో పోయే మేఘాన్ని నడుమంతరపు సిరికి మిడిసిపడే వారితో కవి పోల్చాడు.

ప్రశ్న 2.
వర్షం పడడాన్ని కవి వర్ణించాడు కదా! జోరువాన పడుతుంటే మీకెట్లా అనిపిస్తుంది ?
జవాబు.
మొదట హాయిగా అనిపిస్తుంది. వినసొంపైన లయతో పడే వాన చినుకుల శబ్దాలకు అనుగుణంగా పాటలు పాడాలని అనిపిస్తుంది. వాన చినుకులతో ఆడుకోవాలని కూడా అనిపిస్తుంది. కానీ అదేపనిగా ఎండ రాకుండా ఎడతెరపి లేకుండా రోజూ వర్షం పడుతూనే ఉంటే విసుగొస్తుంది. వర్షానికి ఇళ్ళ మట్టిగోడలు పడిపోయి, పై కప్పులు ఎగిరిపోయి బాధలుపడే పేదలను చూస్తే బాధేస్తుంది.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.23)

ప్రశ్న 1.
ప్రజలందరు ఛత్రపతులైనారని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
ఛత్రం అంటే గొడుగు. ఛత్రపతి అంటే గొడుగు కలిగినవాడు. వర్షంలో తడవకుండా జాగ్రత్త కోసం గొడుగును ఉపయోగిస్తున్నారు. జోరుగా కురిసే వానలో తడవకుండా ప్రజలందరూ గొడుగులు పట్టుకున్నారు అని చెప్పడం కోసం కవి ఈ మాటలు అన్నాడు.

ప్రశ్న 2.
‘భూసతి రామచిలుకయయ్యె’ అని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
భూసతి అంటే ‘భూమి’ అనే స్త్రీ. రామచిలుక ఆకుపచ్చగా ఉంటుంది. రామచిలుకయయ్యె అంటే రామచిలుక రంగులాగా ఆకుపచ్చగా మారింది అని తాత్పర్యం. వర్షానికి పులకరించిన నేలంతా పచ్చదనంతో రామచిలుక వలె కనిపిస్తున్నది అని చెప్పడానికి కవి ఈ మాటలు అన్నాడు.

ప్రశ్న 3.
వానలు పడడం వల్ల వాతావరణం ఎట్లా మారుతుంది ? ఏమేం జరుగుతుంది ?
జవాబు.
వానలు పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది. కారుమబ్బులతో అంతా చీకటైపోతుంది. నేలంతా ఎటుచూసినా వాన నీళ్ళే కనిపిస్తాయి. అజాగ్రత్తగా నడిస్తే కాలు జర్రున జారుతుంది. వానల వల్ల బావులు, చెరువులు నిండుతాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తాయి. జలాశయాలు కళకళలాడతాయి. వర్షానికి పులకరించి నేలంతా పచ్చదనంతో రామచిలుకవలె కనిపిస్తుంది. రైతులు నాగలిపట్టి వ్యవసాయానికి సిద్ధపడతారు.

ప్రశ్న 4.
మబ్బులను చూసి గుడిసెల కప్పులు, గుంజలు ఎందుకు గడగడలాడినాయి?
జవాబు.
గుడిసెల కప్పులు ఎండలకు వాడిపోయి వేగంగా వీచే గాలులకు పట్టుతప్పిపోయాయి. వాటి గుంజలు ఊగులాడుతున్నాయి. ఆకాశంలో నల్లని మబ్బులను చూడగానే వాటికి భయమేసింది. వాన అప్పటికే వాడిపోయిన, పట్టుతప్పిన తమను కూల్చేస్తుందేమోనని గుడిసెల కప్పులూ, వాటి గుంజలు గడగడలాడినాయి.

ప్రశ్న 5.
“శరీరములను రిపులకు అప్పజెప్పడం” అంటే నీకేమి అర్థమయింది ?
జవాబు.
రిపులు అంటే శత్రువులు. అంటే దోమలు, తేళ్ళు, పాములు మొదలైనవి అని భావం. పేదలు పూరిగుడిసెల్లో నేలమీద పడుకొని నిద్రపోతారు. వర్షంపడినప్పుడు కలుగుల్లోకి, పుట్టల్లోకి నీరు చేరడం వల్ల తేళ్ళు, పాములు బయటికి వస్తాయి. అలాగే అనుకూలమైన వాతావరణం వల్ల దోమలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. ఇటువంటి ప్రమాదకర పరిస్థితులలో కూడా పేదలు వాటినుంచి రక్షణకోసం తగిన జాగ్రత్తలు తీసుకోలేరు. వారి ప్రాణాలు దైవాధీనాలు అని అర్థమైంది.

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

ప్రశ్న 6.
పుడిసెడు పేదకాపురము అని కవి అన్నాడు కదా! పేదల కాపురాలు ఎట్లా ఉంటాయి ?
జవాబు.
కూడు, గూడు, గుడ్డ అనే కనీసావసరాల కోసం ప్రతిరోజూ తిప్పలు పడేవారు పేదవారు. ఏరోజుకారోజు కష్టించి పనిచేస్తేనే గానీ వారి కాపురాలు గడవవు. వారు నివసించే గుడిసెలు ఎండకూ, వానకూ, గాలికీ తట్టుకొని నిలబడేటంత బలంగా ఉండవు. చేతినిండా పని దొరకక, కంటినిండా నిద్రలేక, వంటినిండా కప్పుకునే గుడ్డలేక పేదల కాపురాలు అంతంతమాత్రంగా అతుకుల బొంతలా ఉంటాయి.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. నీకు ఏ కాలం అంటే చాలా ఇష్టం ? ఎందుకు ?
జవాబు.
నాకు వర్షాకాలం అంటే చాలా ఇష్టం. వర్షం పడుతున్నప్పుడు వాన ధారలను మా కిటికీలోనుంచి చూస్తే బలే సరదాగా ఉంటుంది. వాన చినుకులలో తడిస్తే జలుబు చేసి జ్వరం వస్తుందని భయమే గానీ చిరుజల్లుల్లో ఆడుకుంటే ఎంత బాగుంటుందో. మా పాఠశాల ఆటస్థలంలో మేం ఆడుకుంటున్నప్పుడు అప్పుడప్పుడూ అనుకోకుండా వానజల్లు పడుతుంది. అప్పుడు చురుకు చురుకుమంటూ చెంపలను కొడుతున్నట్లు పడే చిరుజల్లు ఎంతో బాగుంటుంది. అందుకే నాకు వానాకాలం అంటే చాలా ఇష్టం.

2. పాఠం చదివారు కదా! కవికి వర్షం గురించి ఉన్న అభిప్రాయాన్ని మీరు సమర్థిస్తారా ? విభేదిస్తారా ? ఎందుకు ?
జవాబు.
పరిచయం : కవికి వర్షం గురించి ఉన్న అభిప్రాయాన్ని సమర్థిస్తాను. కవి వర్షం గురించి చెప్పిన విషయాలు అన్నీ సరైనవే.

అ) మేఘం గర్వం : వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర అనే ఆరు ఋతువులలో వర్ష ఋతువు మధ్యలో
వస్తుంది మధ్యలోనే పోతుంది. ఎండాకాలంలో భూమిమీద నీరే ఆవిరి రూపంలో ఆకాశంలోకి వెళ్ళి మేఘాలై కురుస్తాయి. అందువల్ల మేఘం హఠాత్తుగా ఏర్పడినట్లు అనిపిస్తుంది. నల్లని మబ్బు మీసాలు దువ్విన ఆకారంలో కనిపిస్తుంది. ఇంత మిడిసిపడిన మేఘం కూడా నీరైపోయి చివరకి సముద్రం పాలౌతుంది.

ఆ) వర్షధార : చిన్నచిన్న చినుకులతో మొదలయ్యే వాన ఒక్కసారిగా ఉరుములతో, వడగండ్లతో కుండపోతగా మారడం మనం నిత్యం చూస్తున్నదే.

ఇ) ప్రజలు – ఛత్రపతులు : వానలో నేలపై అజాగ్రత్తగా నడిస్తే కాలు జారుతుంది. వానకు తడవకుండా ప్రతి ఒక్కరూ గొడుగు పట్టుకుంటారు. నేలంతా ఎటుచూసిన వాననీళ్ళే. భూమి అంతా వాననీళ్ళవల్ల పచ్చదనంతో నిండిపోయింది. వర్షం పడ్డాక రైతులు వ్యవసాయం మొదలుపెడతారు.

ఈ) వానదాడి: వాన తన ప్రతాపాన్ని భవంతులమీద కాక పేదల గుడిసెల మీద చూపుతుంది. మేడలు, మిద్దెలు వానకు తట్టుకుంటాయి. కానీ ఎండకు ఎండి, గాలికి పట్టుతప్పి ఉన్న పేదల గుడిసెలే వానకు తేలికగా కూలిపోతాయి. ముగింపు : ఈ పాఠంలో కవి వర్షం గురించి చెప్పిన విషయాలు అన్నీ ప్రతిసారీ మన అందరి అనుభవంలోకి వచ్చేవే. చక్కని పరిశీలన దృష్టి కలిగిన కవి కనుక పల్లా దుర్గయ్య ఈ అంశాలను మనోహరంగా వర్ణించారు.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం

1. కింది భావం వచ్చే వాక్యాలను పాఠంలో వెతికి రాయండి.

అ. నడుమంత్రపు సిరికి గర్వపడే వారి గర్వం నీరై సముద్రంలో కలిసిపోతుంది.
జవాబు.
“నడుమంతరపున్ సిరి కుబ్బు వారి గ
ర్వోన్నతి నిల్వునీరయి మహెూదధి పాలయి పోదె”

ఆ. నెర్రెలిచ్చిన నేలంతా అద్దంవలె మారి నీడలు కనిపిస్తున్నాయి.
జవాబు.
“నెఱియలు వాఱిన నేలనంతట నద్ద
ములు దాపినట్లు నీడలు కనబడె”

ఇ. పటపటమని వడగండ్లు నేలమీద పడినాయి.
జవాబు.
“పటపట వడగండ్లు పుడమిపై బడె”

ఈ. సంపన్నులు మేడల్లో హాయిగా గుర్రుపెట్టి నిద్రపోతున్నారు.
జవాబు.
“ఉన్నత సౌధ గోపురపు టుయ్యెల మంచములందు తిన్నగా
కన్నులు మూసి గుఱ్ఱుమని గాఢసుషుప్తిని మునియుండు సంపన్నుల”

ఉ. నల్లని మబ్బులను చూడగానే గుడిసెలు, గుంజలు గడగడలాడుతున్నాయి.
జవాబు.
“గుడిసెల కప్పులొప్పెడలె, గుంజలు పాదుల నూగులాడెడిన్,
గడగడలాడుచున్నయవి కారుమొగుళ్లను గాంచినంత”

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

2. కింది కవితను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

చిటపట చినుకుల వాన – చిరుజల్లై కురిసేనా
నేలంతా తడిపే వాన – హరివిల్లై విరిసేనా
జలజల గలగల పారే – సవ్వడి ఈ వాన
చెరువులు బావులు నిండుగ – నింపే ఈ వాన
పసిడి పంటలను ఇవ్వగా పరుగెత్తే ఈ వాన
పరిసరాలను పచ్చదనంతో నింపేటి ఈ వాన.

ప్రశ్నలు:

అ. వాన ఎట్లా కురిసింది ?
జవాబు.
చిటపట చినుకుల వాన చిరుజల్లై కురిసింది.

ఆ. వాన వేటిని నింపడానికి కురిసింది ?
జవాబు.
వాన చెరువులు, బావులు నింపడానికి కురిసింది.

ఇ. వానవల్ల కలిగే లాభమేమిటి?
జవాబు.
పసిడి పంటలను ఇవ్వడం, పరిసరాలను పచ్చదనంతో నింపడం అనే రెండూ వాన వల్ల కలిగే లాభాలు.

ఈ. “పసిడి పంటలు” అనే పదంలో పసిడి అనే పదానికి సమానార్థక పదం ఏది?
జవాబు.
పసిడి అనే పదానికి సమానార్థక పదం బంగారం.

ఉ. పై కవితలో ఉన్న జంటపదాలు ఏవి ?
జవాబు.
జలజల, గలగల అనేవి పై కవితలో ఉన్న జంట పదాలు.

III. స్వీయ రచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. వర్షాల వల్ల ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా! మరి శీతకాలంలో ఎట్లా ఉంటుంది ?
జవాబు.
శీతకాలంలో చలి ఎముకలు కొరికేస్తుంది. ఈ చలి బాధ కూడా భవనాలలో ఉండే వారికంటే సౌకర్యవంతంగా లేని గుడిసెలలో ఉండే వారికి ఎక్కువ. ఈ కాలంలో కూడా ఉన్నవారు ముసుగుదన్ని పడుకుంటే, లేని వారు, నిరుపేదలు కడుపు నింపుకోడానికి కష్టపడుతూనే ఉంటారు. శీతాకాలంలో పగటి పొద్దు తక్కువ. రాత్రిపొద్దు ఎక్కువ. సాయంత్రం తొందరగా చీకటిపడుతుంది. అంతకు ముందునుంచే మంచు కురవడం మొదలవుతుంది. రాత్రంతా కురుస్తూనే ఉంటుంది. తెల్లవారిన చాలాసేపటికి గానీ సూర్యుడు కనబడడు. పొగమంచు తొలగే వరకూ ప్రజలు చలికి వణుకుతూనే ఉంటారు.

ఆ. “చిన్ని చొప్ప కప్పు గుడిసెల్ వడికూలగ దాడిచేతువా ?” అని కవి ఎందుకు అని ఉంటాడు ?
జవాబు.
సాధారణంగా వర్షం పడినప్పుడు బలమైన పునాదులతో, ఇనుము, సిమెంటులతో నిర్మించిన భవనాలకు పెద్ద ప్రమాదం ఉండదు. కానీ తాటాకులతోనో, జొన్న చొప్పతోనో కప్పిన గుడిసెలకు మాత్రం ప్రమాదమే. అవి వర్షం జల్లులకు నానిపోయి కూలిపోతాయి కూడా. అందువల్లనే కవి ఓ వానదేవుడా! ఎత్తైన మేడలలో ఉండేవారి ఇళ్లను ఏమీ చేయలేక జొన్నచొప్పతో కప్పిన పేదల ఇళ్ళపై దాడి చేస్తావా ? చేయవద్దు సుమా! అని కవి అని ఉంటాడు

ఇ. వర్షాల కోసం ఎవరెవరు ఎదురుచూస్తారు ? ఎందుకు ?
జవాబు.
వర్షాల కోసం భూమిపై ఉండే ప్రతి జీవి ఎదురుచూస్తుంది. మండే ఎండలతో బాధలు పడుతూ తాగడానికి గుక్కెడు నీళ్ళైనా లేని పరిస్థితులలో దాహం తీర్చుకోవడానికి ప్రతి జీవి ఎదురుచూస్తుంది. వర్షంపడితే బావులు, చెరువులూ నిండుతాయి. వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తాయి. పశువులకూ, పక్షులకూ, మనుషులకూ మంచినీరు బాగా లభిస్తుంది. ఆబోతులైతే హుంకారంతో రంకెలు వేస్తాయి. వర్షం వస్తేనే రైతులు నాగలిపట్టి వ్యవసాయపు పనులు మొదలుపెడతారు. వర్షం వల్లనే నేలంతా పులకరించి పచ్చని పైర్లతో సస్యశ్యామలమవుతుంది.

ఈ. డా॥ పల్లా దుర్గయ్య గురించి రాయండి.
జవాబు.
పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు నర్సమ్మ, పాపయ్యశాస్త్రి. ఈయనకు ‘సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎం.ఎ. పట్టా అందుకున్నాడు. ’16 వ శతాబ్దియందలి ప్రబంధ వాఙ్మయం-తద్వికాసం’ అనే అంశంపైన పరిశోధన చేశాడు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. ప్రస్తుత పాఠ్యభాగమైన ‘వర్షం’ ఆయన రచించిన ‘పాలవెల్లి’ అనే ఖండకావ్యంలోది.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ. పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు.
1. పరిచయం : ‘వర్షం’ అనే పాఠ్యభాగం డా॥ పల్లా దుర్గయ్య రచించిన ‘పాలవెల్లి’ అనే ఖండకావ్యం నుంచి గ్రహించబడింది. ఇందులో కవి మేఘం యొక్క గర్వం, వర్ష విజృంభణ, నేలపులకింత, విన్నపం అనే అంశాలను మనోహరంగా వర్ణించారు.

2. మేఘం గర్వం : మేఘం పుట్టీ పుట్టకుండానే ఆకాశంలోకి ఎగబాకింది. నల్లమేఘాలకొసలు మీసాలు దువ్వుతూ నవ్వుతున్నట్టున్నాయి. మధ్యలో వచ్చి మధ్యలోనేపోయే నీరు అనే సంపదతో మిడిసిపడినా మేఘం కరిగి నీరయి నేలపైపడి చివరికి సముద్రం పాలు కావలసిందే.

3. వర్ష విజృంభణ: చిటపట చినుకులతో వాన మొదలైంది. పటపటమని వడగండ్లు భూమిమీద పడ్డాయి. చూస్తుండగానే కుండలతో ధారలు పోసినట్టుగా పెద్ద పెద్ద శబ్దాలతో వర్షం విజృంభించింది.

4. నేల పులకింత : వేసవి ఎండలకు నెర్రెలిచ్చిన నేలంతా నీటితో నిండి అద్దాలు తాపినట్టయి నీడలు కనిపిస్తున్నాయి. ప్రజలందరూ గొడుగులు అంటే ఛత్రాలు పట్టుకొని ఛత్రపతులు అయ్యారు. వర్షం అన్ని జీవుల్లో

5. ఆశలు నింపింది. విన్నపం : వానతో పూరిగుడిసెలలో ఉండే పేదలను ఇబ్బంది పెట్టవద్దని కవి వానదేవుణ్ణి ప్రార్థించాడు.

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

IV. సృజనాత్మకత/ప్రశంస

1. మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయండి.
జవాబు.
ప్రకృతిలోని ప్రతి దృశ్యమూ మనసుకు ఎంతో ఆనందాన్నిచ్చేదే. పున్నమి వెన్నెల, ఇంద్రధనుస్సు, లేగదూడల పరుగులు, నదిలో తిరిగే పడవులు, పక్షుల కిలకిలరావాలు, సెలయేళ్ళ, జలపాతాల చప్పుడు ఇలా ప్రకృతి దృశ్యాలు మనలను ఎక్కడికో తీసికొని వెళతాయి. ముఖ్యంగా సూర్యాస్తమయ సమయంలో పక్షులు గూళ్ళకు చేరేటప్పుడు చేసే కూతల గురించి ఎంతైనా చెప్పవచ్చు. అది కూడా ఏదైనా ప్రశాంత వాతావరణంలో ఏ మామిడి తోటలోనో, నది ఒడ్డున కూర్చుని వింటే, ఆ పక్షుల కిలకిల రావాలు ఎంత కాలమైనా మరచిపోలేము. కోకిల కుహూ కుహూ రావాలు, పిచ్చుకమ్మల కిచకిచలు, చిలుకమ్మల, కాకమ్మల కూతలు భాషకందని అనుభూతులు.

2. ఎండాకాలంలో వాతావరణాన్ని, ప్రజల స్థితిగతులను వర్ణిస్తూ వ్యాసం రాయండి.
జవాబు.
1. పరిచయం : గ్రీష్మఋతువులో ఎండలు మెండుగా ఉంటాయి. అంటే ఏప్రిల్, మే నెలల్లో కాసే ఎండలను తట్టుకోవడానికి ప్రజలు ఎన్నో ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో ఎండలు, ఉక్కపోత, తీరని దాహం, వడగాలులు ముఖ్య లక్షణాలు.

2. ఎండలు : ఎండాకాలంలో పగటి పొద్దు ఎక్కువగా ఉంటుంది. తెలతెలవారుతూనే సూర్యుడు పరుగులు తీస్తూ పైపైకి వస్తూంటాడు. పొద్దున్నుంచే ఎండతీవ్రత పెరుగుతూ ఉంటుంది. మిట్టమధ్యాహ్నం తలపైన గొడుగు లేకుండా కాలికి చెప్పులు లేకుండా నడవలేం.

3. ఉక్కపోత: ఎండాకాలంలో విపరీతంగా చెమట పడుతుంది. ప్రతి ఒక్కరూ విసనకర్రలతోనో, పంకాలతోనో, చలిమరలతోనో సేదతీరవలసిందే.

4. తీరని దాహం : విపరీతమైన చెమట వల్లనే గొంతు తడి ఆరిపోయి ఎక్కువ దాహం వేస్తుంది. ఎన్ని నీళ్ళు తాగినా ఆ దాహం తీరదు. అందువల్ల ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి.

5. వడగాలులు : సాయంత్రం పూట మొదలై అర్ధరాత్రి వరకూ వీచే వడగాలులు చాలా ప్రమాదకరమైనవి. ఈ గాలులు వడదెబ్బకూ, ప్రాణాపాయానికీ ముఖ్యకారణాలు. అందుకోసం చల్లని నీడలో సేదతీరాలి.

6. ముగింపు : ప్రజలు ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకోవడం, ఎక్కువగా ఎండలో తిరగకపోవడం, చల్లని నీడలో సేదదీరడం వంటి జాగ్రత్తలతో ఎండాకాలంలో ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.

V. పదజాల వినియోగం:

1. ముందు చదివిన పాఠాల నుండి కింది గుణింతాలతో కూడిన పదాలను వెతికి పట్టిక ఆధారంగా రాయండి.

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం 2
జవాబు.
TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం 3

2. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.

అ. సోమనాద్రిరాజు కిరీటం వజ్రాలతో తాపడం చేయబడి ఉండేది.
జవాబు.
అతికించడం

ఆ. కృషికులు పొద్దస్తమానం కష్టపడి పంటలు పండిస్తారు.
జవాబు.
రైతులు

ఇ. ఎండాకాలం మిద్దెపై పడుకుంటే పయ్యెర హాయిగా వీస్తుంది.
జవాబు.
గాలి

ఈ. తొందరగా చేరుకోవాలంటే వడిగా నడవాలి.
జవాబు.
వేగం

3. కింది వాక్యాలు చదువండి. ఒకే అర్థం వచ్చే పదాల కింద గీత గీయండి.

అ. సముద్రం నీరు ఉప్పగా ఉంటుంది. కాని ఆ ఉదధి రత్నాలకు నిలయం. పయోధి దాటాలంటే ఓడ కావాలి.
జవాబు.
సముద్రం,ఉదధి, పయోధి

ఆ. నింగిలోని చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. అంబరమంతా నక్షత్రాలు పరుచుకున్నాయి.
జవాబు.
నింగి ,అంబరం

ఇ. మనం భూమిని తల్లిగా భావిస్తాం. ఎందుకంటే అవని మనం పుట్టడానికి, నివసించడానికి ఆధారం కనుక. అటువంటి పుడమిని మన స్వార్థం కోసం కలుషితం చేయకూడదు.
జవాబు.
భూమి , అవని, పుడమి

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

4. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.

అ. బొబ్బలెక్కు : ___________
జవాబు.
శరీరం కాలి బొబ్బలెక్కినప్పుడు బర్నాల్ గానీ, తేనెగానీ రాసి ప్రథమ చికిత్స చేయాలి.

ఆ. అశ్రద్ధ : ___________
జవాబు.
ఒక్కోసారి చిన్నపాటి అశ్రద్ధ వల్ల పెద్ద అవకాశాన్ని కోల్పోతాం.

ఇ. పటపట : ___________
జవాబు.
కోపంలో కొంతమంది పళ్ళు పటపటలాడిస్తారు. దీనివల్ల పళ్ళు దెబ్బతింటాయి.

ఈ. ఆశలుప్పొంగు : ___________
జవాబు.
భవిష్యత్తుపై ఎన్నో ఆశలుప్పొంగే లేత వయసులో ఏ నిర్ణయానికైనా పెద్దల సలహాలు తీసుకోవాలి.

ఉ. పులకరించు : ___________
జవాబు.
రామాయణంలో హనుమంతుడి సాహస ఘట్టాలు వింటూ ఉంటే ఒడలు పులకరిస్తుంది.

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. నాల్గవ పద్యాన్ని చదివి అందులో ఉన్న సరళాక్షరాలను, పరుషాక్షరాలను, మహాప్రాణాలను, అనునాసికాలను గుర్తించి రాయండి.

నాల్గవ పద్యం :
ఉన్నత సౌధ గోపురపు టుయ్యెలమంచములందు తిన్నగా
కన్నులు మూసి గుఱ్ఱుమని గాఢ సుషుప్తిని మునియుండు సం
పన్నుల మీదికిన్ జనగ వాటము కామిని వానదేవుడా!
చిన్నని చొప్పకప్పు గుడిసెల్ వడి కూలగ దాడిచేతువా !”

సరళాక్షరాలు (గ, జ, డ, ద, బ అనే అక్షరాలతో వచ్చేవి) : ధ, గో, గా, గు, గా, ఢ, (న్)గి, డు, ది, జ, గ, దే, డా, గు, డి, డి, గ, దా, డి.
పరుషాక్షరాలు (క, చ, ట, త, ప అనే అక్షరాలతో వచ్చేవి) : త, పు, పు, టు, చ, తి, క, ప్ (తి), ప, కి, ట, కా, చి, చొ, ప్ప, క, ప్పు, కూ, చే, తు.
మహాప్రాణాలు : ధ, ఢ
అనునాసికాలు (ముక్కుతో పలికేవి న, మలు) : న్న, మ, ము, న్న, న్ను, మూ, ను, ని, ని, మున్ (గి), న్ను, మీ, (కి) న్, న, ము, మి, ని, న, న్న, ని.

లలింగములు :

కింది వాక్యాలను చదువండి.

గీత, లత కూరగాయలు తేవడానికి అంగడికి బయలుదేరారు.
ప్రదీప్, సందీప్ లు వాళ్ళ నాన్నతో కలిసి పట్నం వెళ్ళారు.
పిల్లి, ఎలుకను వెంబడించింది.
చెట్టు మీద కోతులు దుంకుతున్నాయి.

పై వాక్యాలలో గీత, లత, ప్రదీప్, సందీప్, నాన్న, పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలను పరిశీలించండి. గీత, లత – అనేవి స్త్రీలకు చెందిన పదాలు. ఇట్లాంటి పదాలను స్త్రీలింగ పదాలు అంటారు.
ప్రదీప్, సందీప్, నాన్న – అనేవి పురుషులకు (మగవారికి) చెందిన పదాలు. ఇట్లాంటి పదాలను ‘పుంలింగ పదాలు’ అంటారు.
పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలు పురుషులను కానీ, స్త్రీలను కానీ సూచించవు. ఇట్లాంటి పదాలను నపుంసక లింగ పదాలు అంటారు.

దీని ప్రకారం పురుష వాచక శబ్దాలను పుంలింగాలనీ స్త్రీ వాచక శబ్దాలను స్త్రీలింగాలనీ పై రెండు కానటువంటి (మానవ సంబంధం కాని) వాటిని అనగా వస్తు, పక్షి, జంతు వాచక శబ్దాలను నపుంసకలింగ పదాలని చెప్పవచ్చు.

2. కింది పేరాలోని పుంలింగ, స్త్రీ లింగ, నపుంసకలింగ పదాలను గుర్తించి రాయండి.

సునీత ఉదయాన్నే నిద్రలేచి బడికి వెళ్ళింది. బడిలో సురేష్ తాను రాసిన కథను సునీతకు వినిపించాడు. ఆ కథలో కుందేలు చెట్టు తొర్రలో తన పిల్లలతో ఆడుకునే సన్నివేశం సునీతకు బాగా నచ్చింది. కుందేలు, ముంగీసతో స్నేహం చేయడం కూడ బాగా నచ్చిందని, సునీత పూజితతో చెప్పింది. కథను గోపాల్కు కూడ వినిపించింది. అందరూ బాగుందని సురేశ్ను మెచ్చుకున్నారు.

స్త్రీ లింగ పదాలు:
1) సునీత
2) పూజిత

పుంలింగ పదాలు:
1) సురేష్
2) గోపాల్

నపుంసకలింగ పదాలు :
1) కథ
2) కుందేలు
3) ముంగీస

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

ప్రాజెక్టు పని

వానాకాలాన్ని వర్ణించే రెండు మూడు పాటలు లేదా కవితలు సేకరించండి. వాటిని రాసి, చదివి వినిపించండి.

1. ప్రాజెక్టు శీర్షిక : : వానా కాలాన్ని వర్ణించే రెండు పాటలు / కవితలు సేకరించడం, నివేదిక రాయడం.
2. సమాచార సేకరణ : అ) సమాచారం సేకరించిన తేది: ఆ) సమాచార వనరు : అంతర్జాలం
3. సేకరించిన విధానం : నేను అంతర్జాలం నుండి ఈ క్రింది పాటలను సేకరించాను.
4. నివేదిక :

పాట 1 :
వచ్చెను వచ్చెను వర్షాలు మా వసుధారాణికి తలబ్రాలు
విచ్చిన పూలై ప్రజాముఖమ్మున వెల్లివిరిసెను మురిపాలు
కత్తులు కత్తులు కలిసిన యట్టుల
ఉత్తర దిక్కున ఉరిమింది, కనుపాపల చెక్కని మెరిసింది.
గడగడ గడగడ దివి ఉరిమింది.
చకచక చకచక దిశ మెరిసింది
చలిగాడుపు రివరివ విసిరింది.
పాడు కరవులకు బాణాలు మా
పంట చేలకివి ప్రాణాలు మా ॥ వచ్చెను ॥
కాపు కన్నులకు ముత్యాలు వరి
కర్రల నోళ్ళకు చనుబాలు ॥ వచ్చెను ॥
కోడెనాగులై ఉరికే వాగులు
క్షీరధారలై పారే తోగులు
భూసతి వానల తానములాడి
పచ్చిక కోకల పైట సవరించె ॥ వచ్చెను ॥

పాట 2:
వానల్లు కురువాలె వానదేవుడా!
వరిచేలు పండాలె వానదేవుడా!!
నల్లాని మేఘాలు వానదేవుడా!
సల్లంగ కురువాలె వానదేవుడా!!
తూరుపు దిక్కున వానదేవుడా!
తుళ్ళితుళ్ళి కురువాలె వానదేవుడా!!
చాటంత మబ్బుపట్టి వానదేవుడా!
వర్షంగా మారాలె వానదేవుడా!!
చుక్కచుక్క నీరు చేరి వానదేవుడా!
మాకు ఆసరవ్వాలె వానదేవుడా!!
మావూరి కుంటల్లు వానదేవుడా!
మత్తడై దుంకాలె వానదేవుడా!!
చెరువులన్ని నిండాలె వానదేవుడా!
అలుగులై పారాలె వానదేవుడా!!

పాట 3 :
వానలు జోరుగ కురవాలోయ్
బాగా పంటలు పండాలోయ్
బిడ్డల బొజ్జలు నిండాలోయ్
రైతుల రాజ్యం రావాలోయ్
అందరి మిత్రత అల్లాలోయ్
స్వతంత్ర పాలన కావాలోయ్
స్వర్ణయుగమని చాటాలోయ్
భారత్ జగతిలో వెలగాలోయ్

5. ముగింపు : వర్షాలు కురవడం వల్ల సమస్త ప్రాణి కోటికి నీరు లభిస్తుంది. పంటలు బాగా పండుతాయి. పశుపక్ష్యాదులకు మేత దొరుకుతుంది. ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉంటారని తెలుసుకున్నాను.

TS 6th Class Telugu 3rd Lesson Important Questions వర్షం

ప్రశ్న 1.
మేఘం గర్వం గురించి కవి చేసిన వర్ణనను వివరించండి.
జవాబు.
గ్రీష్మ ఋతువులో కాసిన మండుటెండల తరువాత ఆకాశంలో మబ్బులు పట్టి వర్షాలు కురుస్తాయి. ఎండ నుండి జీవులకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగిస్తాయి. ఎండవేడికి నేలమీద ఉన్న నీరు ఆకాశంలోకి వెళ్ళి వాతావరణం చల్లబడ్డాక వర్షంగా కురుస్తుంది. అందువల్లనే మేఘం పుట్టుకను మనం గమనించలేం. ఆవిరిరూపంలో ఆకాశంలోకి వెళ్ళి మేఘం రూపంగా మనకు కనబడుతుంది. వర్షించే మేఘం నల్లగా ఉంటుంది.

దాని రూపం దువ్విన మీసాల ఆకారంలో ఉంటుంది. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిరం అనే ఆరు ఋతువులలో వర్షఋతువు మధ్యలో వస్తుంది. మళ్ళీ మధ్యలోనే పోతుంది. అలాగే మేఘాలకు సాధారణంగా వర్షించే సామర్థ్యం వర్షాకాలంలోనే ఉంటుంది. ఇంత మిడిసిపడే మేఘమైనా కరిగి నీరై నేలమీద పడి చివరికి సముద్రం పాలుకావలసిందే అంటూ కవి మేఘం గర్వం గురించి వివరించాడు.

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

ప్రశ్న 2.
వర్షం వలన ప్రజలు ఎలా ఇబ్బందులు పడతారో వివరించండి.
(లేదా)
పేదలపై ప్రతాపాన్ని చూపించకు వానదేవుడా ? అని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
పేదల ఇళ్ళు చిన్నవిగా ఉంటాయి. వాటిని వారు జొన్న చొప్పతో కప్పుకుంటారు. అవి ఎండలకు ఎండిపోయి ఉంటాయి. అంతేగాక వేగమైన గాలులకు పట్టుతప్పి ఉంటాయి. ఆ ఇళ్ళ గుంజలు పాదుల నుంచి ఊగిసలాడుతూ ఉంటాయి. అటువంటి ఆ కప్పులూ, గుంజలూ ఆకాశంలో కనిపించే కారుమబ్బులను చూసి గజగజలాడతాయి. అసలే అంతంతమాత్రంగా బలహీనంగా ఉన్న తమ మీద వాన పడితే ఎక్కడ నాశనమైపోతామో అని అవి భయపడతాయి. అటువంటి పూరిగుడిసెలలో పేదలు నేలమీదే పడుకుంటారు. కలుగుల్లోనూ, పుట్టల్లోనూ వాన నీరు చేరడం వల్ల బయటకు వచ్చే పాములు, తేళ్ళు వంటి శత్రువులనుంచి వారికి ప్రమాదం పొంచి ఉంటుంది.

ప్రశ్న 3.
‘వర్షం’ ను వర్ణిస్తూ గేయం/కవిత రాయండి.
జవాబు.
వర్షాలు కురవాలి వానదేవుడా
వాగులు పారాలి వానదేవుడా
వంకలు సాగాలి వానదేవుడా
చెరువులు నిండాలి వానదేవుడా
కరువంతా పోవాలి వానదేవుడా
పుడమి పులకించాలి వానదేవుడా
చిగురులే తొడగాలి వానదేవుడా
పువ్వులే పూయాలి వానదేవుడా
పంటలు పండాలి వానదేవుడా
కష్టాలు తొలగాలి వానదేవుడా
ప్రజలంతా మురవాలి వానదేవుడా

అర్థాలు

  • మిన్ను = ఆకాశం
  • ఉబ్బు = పొంగిపోవు
  • ఉదధి = సముద్రం
  • వడగండ్లు = వానరాళ్లు
  • పుడమి = నేల
  • పాలితులు = పాలింపబడేవారు (ప్రజలు)
  • ఛత్రపతి = రాజలాంఛనంగా గొడుగును ధరించిన వాడు (రారాజు)
  • నెఱియలు = నేల పగుళ్ళు
  • సౌధం = భవనం, మేడ
  • గోపురం = దేవాలయ వాకిలి ద్వారం
  • సుషుప్తి = ఒళ్ళు మరచిన గాఢనిద్ర
  • వాటము = వీలు
  • వడ = ఎండ
  • కారు మొగుళ్ళు = నల్ల మబ్బులు
    రిపులు = శత్రువులు

I. క్రింది పద్యానికి భావం రాయండి.

1. వడలకు వాడిపోయి వడి పయ్యెర యూపుకు పట్టువీడి యీ
గుడిసెల కప్పు లొప్పెడలె, గుంజలు పాదులు నూగులాడెడిన్,
గడగడలాడుచున్నయవి కారుమొగుళ్లను గాంచినంత, నీ
పుడిసెడు పేదకాపురము పొల్లొనరింపకు వానదేవుడా!
జవాబు.
గుడిసెల కప్పులు ఎండలకు వాడిపోయి, వేగంగా వీచే గాలులకు పట్టుతప్పిపోయాయి. వాటి గుంజలు ఊగులాడుతున్నాయి. నల్లని మబ్బులను చూడగానే అవి భయంతో గడగడలాడుతున్నాయి. ఓ వానదేవుడా! ఈ పేద సంసారాన్ని నాశనం చేయకు.

II. ఈ క్రింది పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించండి.

2. ఉన్నత సౌధ గోపురపు ………….. దాడి చేతువా!
జవాబు.
ఉన్నత సౌధ గోపురపు టుయ్యెల మంచములందు తిన్నగా
కన్నులు మూసి గుఱ్ఱుమని గాఢసుషుప్తిని మున్గియుండు సం
పన్నుల మీదికిన్ జనగ వాటముకామిని వానదేవుడా !
చిన్నవి చొప్పుకప్పు గుడిసెల్ వడి కూలగ దాడి చేతువా !

III. ఈ క్రింది గద్యాన్ని చదివి 5 ప్రశ్నలు తయారు చేయండి.

చిత్ర లేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం వంటివి లలితకళలు. భావం మనస్సుకు హత్తుకునే విధంగా బొమ్మలు గీయడం చిత్రలేఖనం. వీనుల విందుగా ఉండే గాన కళ సంగీతం. మనలను కదలకుండా అనేక భావాలను మనస్సుకు అందించే కళ శిల్పకళ. రాగ, తాళ, లయలకు తగినవిధంగా అభినయం చేయడం నృత్యకళ. ఒక భావాన్ని సూటిగా చెప్పకుండా మాటల వెనుక మరుగుపరచి మనసుకు ఉల్లాసం కలిగించే విధంగా పదాలను కూర్చి చెప్పేదే కవిత్వం.

ప్రశ్నలు:

1. వేటిని లలిత కళలు అంటారు ?
2. మనస్సుకు హత్తుకునే విధంగా బొమ్మలు గీయడం ఏ కళ ?
3. సంగీతం ఏ విధంగా ఉంటుంది ?
4. ఏ కళలో రాగ, తాళ, లయలకు అనుగుణంగా అభినయం ఉంటుంది ?
5. పదాలను అందంగా కూర్చి చెప్పేది ఏది ?

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

IV. పదజాలం/వ్యాకరణం:

సరైన సమాధానాన్ని గుర్తించండి.

8. ఎండాకాలం మిద్దెపై పడుకుంటే ‘పయ్యెర హాయిగా వీస్తుంది. గీతగీసిన పదానికి అర్థం ?
a) గాలి
b) నీరు
c) విసనకర్ర
d) వింజామర
జవాబు.
a) గాలి

9. వేసవికాలంలో వడగాలులలో తిరగకూడదు. గీతగీసిన పదానికి అర్థం.
a)వాన
b) దుమ్ము
c) వేడి
d) ఆవిరి
జవాబు.
c) వేడి

10. వాతావరణ కాలుష్యం పెరగడం వల్లనే పుడమిపై ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. గీత గీసిన పదానికి అర్థం
a) సముద్రం
b) భూమి
c) ఆకాశం
d) గాలి
జవాబు.
b) భూమి

11. పాలితులే పాలకులు కావడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న గొప్పదనం. – గీత గీసిన పదానికి అర్థం
a) పాలించేవారు
b) అణగదొక్కేవారు
c) రాజులు
d) పాలింపబడేవారు
జవాబు.
d) పాలింపబడేవారు

12. మబ్బులు ఎంతగా కురిసినా ఆకాశం మాత్రం తడవదు. గీత గీసిన పదానికి పర్యాయపదాలు
a) నింగి, గగనం
b) నీరు, జాలరి
c) నిప్పు, మంట
d) నేల, ధరణి
జవాబు.
a) నింగి, గగనం

13. ప్రాణికోటికి మంచినీటికి వారిదమే ఆధారం. – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
a) కొళాయి, పంపు
b) నది, ఏరు
c) సముద్రం, కడలి
d) మేఘం, మబ్బు
జవాబు.
d) మేఘం, మబ్బు

14. ‘వసుధ’ అను పదానికి పర్యాయ పదాలు
a) పుృధ్వి, జలధి
b) అవని, పుడమి
c) ముత్యము, ముక్తి
d) అడవి, వనము
జవాబు.
b) అవని, పుడమి

15. వర్షం పదానికి నానార్థాలు
a) బాష్పం, నీరు
b) వాన, వృష్టి
c) సృష్టి, హర్షం
d) వాన, సంవత్సరం
జవాబు.
d) వాన, సంవత్సరం

16. ఇందులో ద్విత్వాక్షరాన్ని గుర్తించండి.
a) ట్లో
b) క్క
c) ద్యు
d) ంటే
జవాబు.
b) క్క

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

17. వడలకు వాడిపోయి వడి పయ్యెర యూపుకు పట్టువీడి – ఇందులో ఉన్న అంతస్థాలను గుర్తించండి.
a) య్యె, ర, ల, వ
b) శ, ష, స, హ
c) క, చ, ట, త, ప
d) అ, ఆ, ఇ, ఈ
జవాబు.
a) య్యె, ర, ల, వ

18. రాముడు సీతకోసం వానరులతో కలిసి లంకకుచేరి రావణుణ్ణి జయించాడు. ఇందులో పుంలింగ పదాలను గుర్తించండి.
a) వానరులు, లంక
b) సీత, రాముడు
c) రాముడు, రావణుడు
d) సీత, లంక
జవాబు.
c) రాముడు, రావణుడు

19. సంపన్నుల మీదికిన్ జనగ వాటము కామిని – గీతగీసినది ఏ విభక్తికి చెందింది ?
a) ప్రథమా
b) ద్వితీయా
c) చతుర్థీ
d) షష్టీ
జవాబు.
d) షష్టీ

20. అర్జునుడు విలువిద్యలో శ్రీరాముడంతటివాడు. గీతగీసిన పదం ఏ భాషా భాగం ?
a) నామవాచకం
b) సర్వనామం
c) విశేషణ
d) క్రియ
జవాబు.
a) నామవాచకం

21. శ, ష, స, హ లను ఏమంటారు ?
a) ఊష్మాలు
b) అంతస్థాలు
c) సరళాలు
d) అనునాసికాలు
జవాబు.
a) ఊష్మాలు

22. క, చ, ట, త, ప లను ఏమంటారు ?
a) సరళాలు
b) వర్గయుక్కులు
c) పరుషాలు
d) అంతస్థాలు
జవాబు.
c) పరుషాలు

23. ‘అంతస్థాలు’ అని వేటినంటారు ?
a) అ, ఆ, ఇ, ఈ
b) ‘అ’ నుండి ‘ఔ’ వరకు గల అక్షరాలు
c) ‘క-ఱ’ మధ్యగల అక్షరాలు
d) య, ర, ల, వ
జవాబు.
d) య, ర, ల, వ

24. గ, జ, డ, ద, బ లకు గల పేరు
a) సరళాలు
b) పరుషాలు
c) అంతస్థాలు
d) అచ్చులు
జవాబు.
a) సరళాలు

పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు

1వ పద్యం :

ఉ. నిన్నటిదాక లేవుకద నింగిని, పుట్టియు పుట్టకుండనే
మిన్నెగ బ్రాకినాననుచు మీసలు దువ్వుచు నవ్వుచుంటివే
మన్న! యిదేమినీతి, నడుమంతరపున్ సిరి కుబ్బువారి గ
ర్వోన్నతి నిల్వునీరయి మహెూదధి పాలయి పోదె మేఘమా?

ప్రతిపదార్థం:

మేఘమా = ఓ మేఘమా!
నిన్నటిదాక = నిన్నటివరకు
నింగిని = ఆకాశంలో
లేవుకద = లేవు కదా!
పుట్టియు పుట్టకుండనే = పుట్టీ పుట్టకుండానే
మిన్న = ఆకాశానికి
ఎగబ్రాకినానను + అనుచు = ఎగబాకానని (అంత ఎత్తుకు చేరుకున్నానని)
మీసలు = మీసాలు
దువ్వుచు = దువ్వుకుంటూ
నవ్వుచు + ఉంటివి = నవ్వుతున్నావు
ఏమి + అన్న = ఎందుకన్నా!
ఇది + ఏమి = ఇది ఎక్కడి
నీతి = నీతి (నీతికాదు అని భావం)
నడుమంతరపు = మొదటి నుంచీ లేకుండా
సిరికిన్ = సంపదను చూసుకొని
ఉబ్బువారి = మిడిసిపడేవారి
గర్వ + ఉన్నతి = గొప్ప గర్వం
నిల్వు = నిలువునా
నీరు + అయి = నీరై
మహా + ఉదధి = సముద్రం
పాలు + అయిపోదె = పాలు + అయిపోదు + ఎ = పాలైపోదా ? (అవుతుందని భావం)

తాత్పర్యం :
ఓ మేఘమా! నిన్నటివరకు ఆకాశంలో లేనేలేవు కదా! పుట్టీ పుట్టకుండానే ఆకాశానికి ఎగబాకినానని మీసాలు దువ్వుతూ గర్వంతో నవ్వుతున్నావెందుకు? ఇది నీతి కాదు. నడుమంత్రపు సిరికి మిడిసిపడేవారి గర్వం నిలువునా నీరై సముద్రం పాలౌతుందని తెలుసుకో!

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

2వ పద్యం :

కం. చిటపట చినుకులు రాలెను
పటపట వడగండ్లు పుడమిపై బడె, ధారల్
పుటపుటనై కుండలతో
నటునిటు దొరలించినట్టులై కనుపట్టెన్.

ప్రతిపదార్థం:

చిటపట = చిటపట అనే శబ్దాలతో
చినుకులు = చినుకులు
రాలెను = రాలాయి
పటపట = పటపట అనే శబ్దాలతో
వడగండ్లు = వానరాళ్ళు
పుడమిపై = నేలమీద
పడె = పడ్డాయి
పుటపుట = చూస్తుండగానే (తక్కువ వ్యవధిలోనే)
ధారల్ = పెద్ద ధారలను
కుండలతోన్ = కుండలతో
అటునిటు = అన్ని వైపులలోనూ
దొరిలించినట్టులు + ఐ = గుమ్మరించి నాట్లుగా అయి
కనుపట్టెన్ = కనపడింది

తాత్పర్యం :
చిటపట చినుకులతో వాన మొదలైంది. పటపటమని వడగండ్లు భూమిమీద పడ్డాయి. చూస్తుండగానే కుండలతో ధారలు పోసినట్టుగా పెద్దపెద్ద శబ్దాలతో వర్షం విజృంభించింది.

3వ పద్యం :

సీ. నేలపై మోపిన కాలు చుఱుక్కని
బొబ్బ లెక్కెడి దినమ్ములు గతించె,
నించుక యశ్రద్ధ నుంచిన పాదమ్ము
జఱుకుజఱుక్కని జాఱదొడగె
పగలు రాత్రి యనక ప్రభు పాలితులనక
ప్రజలందఱును ఛత్రపతులె యైరి
నెఱియలు వాఱిన నేలనంతట నద్ద
ములు దాపినట్లు నీడలు కనబడె

తే.గీ. పులకరించి భూసతి రామచిలుకయయ్యె
హుంకరించి యాబోతులు అంకెవేసె
నాగలిని బట్టి కృషికుడు నడుముగట్టె
నాశ లుప్పొంగి పాతె వర్షాగమమున

ప్రతిపదార్థం:

నేలపై = నేలమీద
కాలు మోపిన = కాలుపెట్టగానే
చుఱుక్కని = చుఱుక్కుమని కాలి
బొబ్బలు + ఎక్కెడి = బొబ్బలు ఎక్కించే (వేసవి)
దినమ్ములు = రోజులు
గతించెన్ = వెళ్ళిపోయాయి
ఇంచుక = కొంచెం (ఏ మాత్రం)
అశ్రద్ద నుంచిన = అజాగ్రత్తగా నడిచినా
జఱుకు జఱుక్కని =
పాదమ్ము = కాలు
జర్రున = జారుతున్నది
పగలు రాత్రి+అనక = పగలు రాత్రి తేడా లేకుండా ఎడతెరిపి లేకుండా కురిసే వర్షంలో
ప్రభుపాలితులు + అనక = ప్రభువులు, పాలితులు (ధనికులు, పేదలు) అనే తేడా లేకుండా
ప్రజలు + అందరూ = ప్రజలందరూ
ఛత్రపతులు + ఎ = గొడుగులు ధరించిన వారే
ఐరి = అయ్యారు.
నెఱియలు + పాఱిన = వేసవికాలంలో బీటలువారిన
నేలనంతటన్ = నేలమొత్తము
అద్దము + తాపిన + అట్లు = అద్దాలు అతికించినట్లుగా
నీడలు = ఛాయలు
కనన్ + పడె = కనిపిస్తున్నాయి
భూసతి = భూమి అనెడి స్త్రీ (నేలంతా)
పులకరించి = వర్షానికి గగుర్పాటుచెంది
రామచిలుక + అయ్యె = పచ్చదనంతో రామచిలుకవలె కనిపిస్తున్నది
ఆబోతులు = ఎద్దులు
హుంకరించి = కృషికుడు
ఱంకెవేసే = కేక వేస్తున్నాయి, అఱుపు
హుంకరించి = హుంకారంతో
కృషికుడు = రైతు
నాగలిని + పట్టి = నాగలి చేతబట్టి
నడుము + కట్టె = వ్యవసాయానికి సిద్ధపడ్డాడు.
వర్ష + ఆగమమున = ఇట్లా వర్షం రావడంతో
ఆశలు = కోరికలు
ఉప్పొంగి = ఉబికి
పాఱే = పరుగుతీశాయి (ఉరకలెత్తాయి)

తాత్పర్యం: కాళ్ళు నేలపై పెట్టినంతనే బొబ్బలెక్కించే ఎండాకాలం వెళ్ళిపోయింది. అజాగ్రత్తగా నడిస్తే జర్రున కాలు జారుతున్నది. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షంలో తడువకుండా ఉండేందుకు అందరు ఛత్రీలు పట్టు కోవడంతో ప్రభువులు పాలితులు (రాజు-పేద) అనే తేడా లేకుండా అందరూ ఛత్రపతులే అయ్యారు. వేసవికాలంలో నెర్రెలిచ్చిన నేలంతా నీటితో నిండి అద్దాలు తాపినట్టయి నీడలు కనిపిస్తున్నాయి.

వర్షానికి పులకరించిన నేలంతా పచ్చదనంతో రామచిలుకవలె కనిపిస్తున్నది. ఆబోతులు హుంకారంతో రంకెలు వేస్తున్నాయి. రైతులు నాగలిపట్టి వ్యవసాయానికి సిద్ధపడ్డారు. ఇట్లా అన్ని జీవుల్లో ఆశలు నింపుతూ వర్షాకాలం వచ్చింది.

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

4వ పద్యం : 

ఉ. ఉన్నత సౌధ గోపురపు టుయ్యెలమంచములందు తిన్నగా
కన్నులు మూసి గుఱ్ఱుమని గాఢసుషుప్తిని మున్గియుండు సం||
పన్నుల మీదికిన్ జనగ వాటముకామిని వానదేవుడా!
చిన్నని చొప్పకప్పు గుడిసెల్ వడి కూలగ దాడిచేతువా!

ప్రతిపదార్థం :

వానదేవుడా! = ఓ వానదేవుడా!
ఉన్నత = ఎత్తైన
సౌధ = మేడల యొక్క
గోపురపు = శిఖరాల మీద
ఉయ్యెలమంచములు + అందు = ఉయ్యాల మంచాలలో
తిన్నగా = హాయిగా
కన్నులు మూసి = కళ్ళు మూసుకొని
గుఱ్ఱుమని = గురకలు పెడుతూ
గాఢ = గాఢమైన (ఒళ్ళు మరచిన)
సుషుప్తిని = నిద్రలో
మున్గి+ ఉండ = మునిగి ఉన్న
సంపన్నుల మీదికిన్ = ధనవంతుల మీదికి
చనగ = పోవడం
వాటము కామిని = వీలు కాదని
చిన్నని = పేదవారిపైన
చొప్పకప్పు = జొన్నచొప్పుతో కప్పుకున్న
గుడిసెల్ = గుడిసెలను
వడి = గభాలున (వేగంగా)
కూలగ = కూలిపోయేటట్లుగా
దాడిచేతువా! = దాడి చేస్తావా! (చేయవద్దని భావం)

తాత్పర్యం : ఓ వానదేవుడా! ఎత్తైన మేడలమీద, ఉయ్యాల మంచాలలో, గుఱకలు పెడుతూ, గాఢనిద్రలో ఉన్న ధనవంతుల మీదికి పోవడం వీలుకాదని, పేద వాళ్ళు జొన్నచొప్పతో కప్పులు వేసుకున్న గుడిసెలు గభాలున కూలిపోయేటట్లుగా దాడిచేస్తావా ? వద్దు అట్లా చేయకు.

5వ పద్యం : 

చం. వడలకు వాడిపోయి వడి పయ్యెర యూపుకు పట్టువీడి
గుడిసెల కప్పు లొప్పెడలె, గుంజలు పాదుల నూగులాడెడిన్,
గడగడలాడుచున్నయవి కారుమొగుళ్లను గాంచినంత, నీ
పుడిసెడు పేదకాపురము పొల్లొనరింపకు వానదేవుడా!

ప్రతిపదార్థం :

వానదేవుడా! = ఓ వానదేవుడా!
గుడిసెల = గుడిసెల యొక్క
కప్పులు = కప్పులు
వడలకు = ఎండలకు
వాడిపోయి = ఎండిపోయి
వడి = వేగంగా వీచే
పయ్యెర = గాలుల
ఊపుకు = కదలికకు
పట్టు = పట్టుతప్పి
ఒప్పు + ఎడలె = పోయాయి
గుంజలు = వాటి స్తంభాలు
పాదులన్ = పాదాల దగ్గర నుంచీ
ఊగులాడెడిన్ = ఊగిసలాడుతున్నాయి
కారు మొగుళ్ళను = నల్లని మబ్బులను
కాంచిన + అంత = చూడగానే
గడగడలాడుచున్న + అవి = అవి భయపడుతున్నాయి.
ఈ = అటువంటి
పుడిసెడు = అల్పమైన (చిన్నదైన)
పేద కాపురము = పేద సంసారాన్ని
పొల్లు+ఒనరింపకు = నాశనం చేయకు

తాత్పర్యం: గుడిసెల కప్పులు ఎండలకు వాడిపోయి, వేగంగా వీచే గాలులకు పట్టుతప్పిపోయాయి. వాటి గుంజలు ఊగులాడుతున్నాయి. నల్లని మబ్బులను చూడగానే అవి భయంతో గడగడలాడుతున్నాయి. ఓ వానదేవుడా! ఈ పేద సంసారాన్ని నాశనం చేయకు.

6వ పద్యం :

చం. గపగప చొచ్చివచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్
ఱేపఱేపలాడిపోయెన, చెలరేగిన చీకటిలో శరీరముల్
రిపులకు నప్పజెప్పిన దరిద్రులు నిద్రలుపోయినారు, నీ
విపుడె సవారిచేసి యలయింపకు వారిని వానదేవుడా!

ప్రతిపదార్థం :

వానదేవుడా! = ఓ వానదేవుడా!
గపగప = వేగంగా
చొచ్చివచ్చు = చొచ్చుకొని వచ్చే
చలిగాలికి = చల్లని గాలికి
కప్పులు లేని = పైకప్పులు సరిగ్గా లేని
దీపముల్ = దీపాలు
ఱేపఱేపలాడిపోయెను = రెపరెపలాడి ఆరిపోయాయి
చెలరేగిన = దట్టంగా కమ్ముకున్న
చీకటిలో = చీకట్లో
శరీరముల్ = తమ శరీరాలను
రిపులకు = శత్రువులకు (దోమలు, తేళ్ళు, పాములు మొదలైన శత్రువులకు)
అప్పన్ + చెప్పిన = అప్పజెప్పిన (తగిన రక్షణ లేకుండా)
నిద్రలు పోయినారు = నిద్రపోయారు.
నీవు = నువ్వు
ఇప్పుడు + ఎ = ఈ సమయంలోనే
సవారి చేసి = నీ ప్రతాపాన్ని చూపించి
వారిని = వారిని
అలయింపకు = బాధపెట్టకు

తాత్పర్యం : పై కప్పులు సరిగ్గాలేని గుడిసెలలోనికి హఠాత్తుగా గాలి చొరబడగానే దీపాలు రెపరెపలాడి ఆరిపోయాయి. పేదలు ఆ చీకట్లోనే శత్రువులకు (దోమలు, తేళ్ళు, పాములు మొదలైనవాటికి) శరీరాలు అప్పగించి పడుకున్నారు. ఓ వానదేవుడా! ఇక నీవు కూడా ప్రతాపాన్ని చూపించి వారిని బాధపెట్టకు.

పాఠం/ఉద్దేశం

పొగలు సెగలు కక్కే వేసవికాలం వెళ్ళిపోయింది. అంతవరకు వేడెక్కిన భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది. అటువంటి వర్షాకాలపు సొగసును, సామాన్యులపై ఆ వర్ష ప్రభావాన్ని తెలియజేయడం ఈ పాఠ్యభాగం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠ్యభాగం ‘ఖండకావ్యం’ ప్రక్రియకు చెందినది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. ఈ పాఠ్యభాగం డా॥ పల్లా దుర్గయ్య రచించిన “పాలవెల్లి” అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది.

TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం

కవి పరిచయం

ప్రశ్న
‘వర్షం’ పాఠం రచించిన కవిని గురించి రాయండి.
జవాబు.
డా॥ పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు నర్సమ్మ, పాపయ్యశాస్త్రి. ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎం.ఎ. పట్టా అందుకున్నాడు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. ’16 వ శతాబ్దియందలి ప్రబంధ వాఙ్మయం-తద్వికాసం’ అనే అంశంపైన పరిశోధన చేశాడు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో, సున్నితమైన హాస్యంతో సాగుతుంది.

ప్రవేశిక

వర్షాకాలం వచ్చిందంటే, వర్షాలు పడుతుంటే ఆబాలగోపాలం సంతోషిస్తారు. పశుపక్ష్యాదులు ఆనందపడుతాయి. ప్రకృతి పులకరిస్తుంది. అందరికీ మేలు జరుగుతుంది. అయితే ఆ వర్షాలు కొంతమందికి కొన్ని ఇబ్బందులనూ కలిగించవచ్చు. అట్లాంటి ఇబ్బందులను కలిగించవద్దని వర్షాన్ని కోరుకుంటూ పల్లా దుర్గయ్య రాసిన పాఠాన్ని ఇప్పుడు చదువుదాం.

నేనివి చేయగలనా?

  • నాకు ఇష్టమైన కాలం గురించి చెప్పగలను. – అవును/ కాదు
  • అపరిచితమైన కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయగలను. – అవును/ కాదు
  • పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయగలను. – అవును/ కాదు
  • నాకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయగలను. – అవును/ కాదు

Leave a Comment